జక్కన్న షాక్ మాములుగా లేదుగా..! హీరోలు ఇక క్యూ కట్టవచ్చు
ABN, Publish Date - Jun 26 , 2026 | 05:01 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారనే విషయం తెలిసిందే.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (Varanasi) కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు, రాజమౌళి టీమ్ అదిరిపోయే తీపికబురు అందించింది. ఒకే ఒక్క స్టేట్మెంట్తో అటు మహేష్ ఫ్యాన్స్కు, ఇటు పాన్ ఇండియా ఫ్యాన్స్కు మంచి కిక్ ఇచ్చారు. సాధారణంగా జక్కన్న సినిమా అంటే ఏళ్లకు ఏళ్లు సమయం పడుతుందన్న భావన ప్రేక్షకుల్లో ఉంటుంది. గత చిత్రాలను గమనిస్తే.. ‘బాహుబలి’ సిరీస్కు ఐదేళ్లు, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు దాదాపు మూడేళ్ల సమయం పట్టింది. దీంతో మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ సినిమాకు కనీసం నాలుగేళ్లు పడుతుందని అంతా అనుకున్నారు. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ, జక్కన్న ఈ సారి తన స్పీడ్ పెంచారు. జక్కన్న స్పీడ్ చూసిన వారంతా.. ఆయనతో సినిమా చేయాలనుకున్న హీరోలందరూ క్యూ కడతారేమో!.. అనేలా కామెంట్స్ చేస్తుండటం విశేషం.
ఇక ‘వారణాసి’ విషయానికి వస్తే.. గత ఏడాదిన్నర కాలంగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం మేజర్ పార్ట్, అలాగే హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్ కూడా పూర్తయ్యాయని చిత్రబృందం ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. దీంతో సూపర్ స్టార్ అభిమానులు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే, నెట్టింట ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా కథా విస్తృతి చాలా పెద్దది కావడంతో, వారణాసి కేవలం ఒక భాగంతో ఆగిపోదని, రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మేకర్స్ సైతం ఈ భారీ కథను ఒకే సినిమాలో కుదించడం కన్నా, రెండు పార్టులుగా రిలీజ్ చేస్తేనే పూర్తి న్యాయం జరుగుతుందని భావిస్తున్నారట. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ రీసెంట్గా పంచుకున్న విషయాలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
రాజమౌళి తన విజన్కు తగ్గ అవుట్పుట్ వచ్చే వరకు ఆర్టిస్టులను అస్సలు వదిలిపెట్టరనే సంగతి ప్రతి ఒక్కరికీ స్పష్టమే. పృథ్వీరాజ్ సైతం ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ, ఒక పర్టిక్యులర్ సీన్ కోసం జక్కన్న ఏకంగా 90కి పైగా టేకులు తీసుకున్నారని వెల్లడించారు. ఈ మాట విన్న నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఆ సీన్ ఏంటి? అందులో మహేష్ బాబు ఉన్నారా? లేక వేరే యాక్టర్స్ ఉన్నారా? అని తెలుసుకోవాలనే ఉత్కంఠ అందరిలోనూ మొదలైంది. 90 టేకులు తీసుకున్నారంటే, ఆ సీన్ సిల్వర్ స్క్రీన్ మీద ఎంత అద్భుతంగా రాబోతుందో ఊహించుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఈ సినిమాను గ్లోబల్ స్టాండర్డ్స్లో హాలీవుడ్ను సైతం మెప్పించేలా అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా దాదాపు 120కి పైగా దేశాల్లో ‘వారణాసి’ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. పూర్తి ఐమ్యాక్స్ ఫార్మాట్లో ఒక అద్భుతమైన విజువల్ వండర్గా రాబోతోన్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
ఖుష్బూ సుందర్ కుమార్తె పెళ్లిలో చిరు, నాగ్, వెంకీ సందడి!
ఇది ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజాలు జన్మించిన నేల- బాలయ్య
నిన్న రిజిస్టర్ మ్యారేజ్.. నేడు సంప్రదాయం ప్రకారం ఫైమా పెళ్లి