‘వలిమై’: లైన్‌లోకి జాన్వీ కపూర్

ABN , First Publish Date - 2022-02-20T03:41:41+05:30 IST

అతిలోక సుందరి దివంగత శ్రీదేవి - బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ దంపతుల ఇద్దరు కుమార్తెల్లో ఒకరైన జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌ హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటిస్తోంది. సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలోనూ ఆమె యాక్టివ్‌గానే

‘వలిమై’: లైన్‌లోకి జాన్వీ కపూర్

అతిలోక సుందరి దివంగత శ్రీదేవి - బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ దంపతుల ఇద్దరు కుమార్తెల్లో ఒకరైన జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌ హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటిస్తోంది. సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలోనూ ఆమె యాక్టివ్‌గానే ఉంటుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో 15 మిలియన్లకు పైగా ఆమెకు ఫాలోయర్లు ఉన్నారు. అయితే, ఈమె ఇప్పుడు హీరో అజిత్‌ కుమార్‌ నటించిన ‘వలిమై’ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. తన తండ్రి బోనీ కపూర్‌ నిర్మాతగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ నెల 24వ తేదీన విడుదలకానున్న ఈ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఇందులో విలన్‌గా నటించిన టాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తికేయ ప్రత్యేకంగా మీడియాతో ఈ చిత్ర విశేషాలను వెల్లడించారు. అలాగే హీరోయిన్‌ హ్యూమా ఖురేషీ కూడా ఈ చిత్రం గురించి ప్రమోషన్స్‌ చేస్తున్నారు. 


ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్‌ ఈ చిత్రానికి సంబంధించిన పలు పోస్టులను తన ఇన్‌స్టా, ట్విటర్‌ ఖాతాల్లో పోస్ట్‌ చేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా సాయపడుతోంది. ఈ సినిమా ఖచ్చితంగా భారీ విజయం సాధిస్తుందనేలా జాన్వీ చెప్పుకొస్తుంది. అసలైతే ఈ సినిమాలో జాన్వీ కపూర్ కూడా ఓ లీడ్ రోల్ పోషించింది అనేలా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలను జాన్వీ ఖండించడంతో.. ఆమె సౌత్ ఎంట్రీ ఏ చిత్రంతో ఉంటుందో అనేది మళ్లీ మొదటికి వచ్చింది. శ్రీదేవి వారసురాలిగా టాలీవుడ్‌లో ఆమె ఎంట్రీ విషయంలో.. పలువురు హీరోల పేర్లు వినబడుతున్నప్పటికీ.. ఇప్పటి వరకు సరైన క్లారిటీ మాత్రం రాలేదు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ హీరోయిన్లు సౌత్ సినిమాలపై ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టిన ఆమె త్వరలోనే సౌత్‌లోనూ అడుగుపెడుతుందనేలా వార్తలు నడుస్తున్నాయి. అంతకుముందు బోనీకపూర్ నిర్మించిన ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని కూడా జాన్వీ తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.  


కాగా, ఇటీవల విడుదలైన ట్రైలర్‌తోనే సంచలనాలను క్రియేట్ చేసిన ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. అజిత్ కుమార్ మొదటి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని హెచ్. వినోద్ దర్శకత్వంలో జీ స్టూడియోస్‌ సంస్థ,  బేవ్యూ ప్రాజెక్ట్స్‌ పతాకాలపై బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఫిబ్రవరి 24న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలకాబోతోన్న ఈ చిత్రానికి నీరవ్‌ షా సినిమాటోగ్రఫీ, యువన్‌ శంకర్‌రాజా సంగీత బాధ్యతలను నిర్వహించారు.



Updated Date - 2022-02-20T03:41:41+05:30 IST