‘పెద్ది’.. ఫస్ట్ డే ఫస్ట్ షో వైబ్ కోసం టోక్యో టు టాలీవుడ్!
ABN , Publish Date - Jun 03 , 2026 | 11:31 AM
ఒక హీరోపై అభిమానం వారిని దేశాల సరిహద్దులను దాటించింది. సినిమా విడుదలైన మొదటి రోజు, మొదటి షో చూడాలనే తపన ఏకంగా జపాన్ నుంచి నగరానికి పనిగట్టుకుని వచ్చేలా చేసింది.
ఒక హీరోపై అభిమానం వారిని దేశాల సరిహద్దులను దాటించింది. సినిమా విడుదలైన మొదటి రోజు, మొదటి షో చూడాలనే తపన ఏకంగా జపాన్ నుంచి నగరానికి పనిగట్టుకుని వచ్చేలా చేసింది. తమ అభిమాన నటుడి చిత్రం ప్రదర్శితమయ్యే థియేటర్ వద్ద కనిపించే పండుగ వాతావరణం, థియేటర్ దగ్గర క్యూలు, టిక్కెట్లు దొరికిన అభిమానుల కళ్లలో తొణికసలాడే సంతోషం.. చూడాలనే ఆరాటం.. ఐదు రోజులు ఆఫీసులకు సెలవు పెట్టి మరీ ఇండియాలో వాలిపోయేలా చేసింది. ఈ జపానీ అభిమానులు (Japanese Fans) మసామీ, క్రిస్తో పాటుగా వారి స్నేహితురాలు కణ్మని ని ‘ఆంధ్రజ్యోతి’ పలుకరించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
‘మేము రామ్ చరణ్ (Ram Charan)కు వీరాభిమానులం. టోక్యో నుంచి టాలీవుడ్కు రావడం ఇది తమకు రెండోసారి. గత ఏడాది డిసెంబర్లో తొలిసారి ఇండియాకు.. అదీ హైదరాబాద్కు వచ్చి రామ్చరణ్ను కలిశాం. ఈసారి ఆయనను కలవాలని అనుకోవడం లేదు. ఎందుకంటే, ఆయన సినిమా ప్రమోషన్లలో చాలా బిజీగా ఉన్నారు. పైగా మేము ‘పెద్ది’ (Peddi) సినిమా చూడటం కోసమే ఇక్కడకు వచ్చాం. హైదరాబాద్, చెన్నైలలో పది షోలను చూడాలని ప్రణాళిక వేసుకున్నాం. దీనికోసమే ప్రత్యేకంగా టీ షర్ట్లను కూడా డిజైన్ చేయించుకున్నాం’ అని వివరించారు. నిజానికి ఈ సినిమా చూసేందుకు సింగపూర్కు వెళ్దామనుకున్నాము కానీ, సినిమా మొత్తం ఒకేసారి చూస్తే లిప్రీడింగ్ అర్థం కావడం కాస్త కష్టమని అన్నారు. ఇండియాకు చెందిన స్నేహితురాలు కణ్మని తమను హైదరాబాద్కు తీసుకువెళ్తానని అనడంతో సంతోషంగా ఇక్కడకు వచ్చేశామని తెలిపారు.
‘దాదాపు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలు ఖర్చు పెట్టుకుని సినిమా చూడటం కోసమే వచ్చారా.. అని అంటే, అవుననే అంటాం. అలాగని మేము సంపన్నులమేమీ కాదు. ఇక్కడకు రావడం కోసమే ఓవర్ టైమ్ పనిచేయడం, ఇతర ఖర్చులను తగ్గించుకున్నాం. నిజానికి రామ్చరణ్ అభిమానుల కోలాహలం, సందడి ఎలా ఉంటుందో చూడాలని, అదీ దక్షిణ భారతదేశంలో హీరో వర్షిప్ను ప్రత్యక్షంగా చూడాలని ఇక్కడకు వచ్చాం’ అంటూ తమ వెంట తెచ్చుకున్న చరణ్ టీ షర్టులు, ప్లకార్డులు చూపించారు.
రామ్చరణ్ను ఇంతగా అభిమానించడానికి కారణం..
‘మగధీర’లో రామ్చరణ్ నటన తమను అమితంగా ఆకట్టుకుంది. అతని సినిమాల్లో ఆ సినిమాలో ఆయన ఎక్కువ సేపు హ్యాపీగానే ఉంటాడు. దీనికి పూర్తి విరుద్ధంగా ‘ఆర్ఆర్ఆర్’లో అతని క్యారెక్టర్ సీరియస్గా ఉంటుంది. ‘రంగస్థలం’ సినిమాలో చరణ్ నటన బాగుంది. సినిమా హిట్, ప్లాఫ్లతో మాకు సంబంధం లేదు. చరణ్ ఉంటే చాలు... చూసేస్తామని తెలిపారు. జపాన్లో అందరూ కష్టపడుతుంటారు. పద్దెనిమిది ఏళ్లు వస్తే పిల్లల బాధ్యత కూడా మనకు పెద్దగా ఉండదని క్రిస్ చెబుతూనే తనకు నలుగురు పిల్లలని, అందరూ పెద్దవారే అన్నారు. తనకు ఓ అబ్బాయి అని, అతను కూడా చరణ్ అభిమానే అని మసామీ వివరించారు. ఇంత ఖర్చు పెట్టుకుని ఇండియాకు వెళ్లడం గురించి కుటుంబసభ్యులు ఏమీ అనలేదా అని ప్రశ్నిస్తే.. లేదు. ఒకరి అభిప్రాయాలు, ఇష్టాలకు కుటుంబసభ్యులు విలువనిస్తారని, వారు కూడా సంతోషంగా ఒప్పుకున్నారన్నారు. తాను ‘గేమ్ఛేంజర్’ సినిమా చూడటం కోసమే సింగపూర్ వెళ్తున్నానంటే, మా వారు ఆశ్చర్యపోయారని మసామీ చెబుతూ తాను సంతోషంగా ఉండటమే తన కుటుంబసభ్యులు కోరుకుంటారని, తనకిష్టమైన హీరో సినిమాలకు వారేమీ అడ్డుకోరని వివరించారు.
జపాన్లో ఇటీవలి కాలంలో ఉద్యోగాలు తీవ్ర ఒత్తిడితో కూడి ఉంటున్నాయి. వారాంతాలలో తమకు దక్షిణాది సినిమాలు ఓ స్ట్రెస్బస్టర్లా ఉంటున్నాయి. వారాంతాలలో ఎన్టీఆర్, ప్రభాస్, రాజమౌళి తదితరుల అభిమానులు ఒకచోట కలుసుకోవడం, ఎంజాయ్ చేయడం ఉంటుంది. అభిమానులకు సంబంధించి వాట్సాప్ గ్రూప్లతో పాటుగా ఎక్స్లో కూడా గ్రూప్లు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
‘పెద్ది’ పోరాటానికి తెలంగాణలోనూ లైన్ క్లియర్! పెరిగిన టికెట్ల ధరలు
NBK 111: ‘నో మోర్ వింటేజ్, ఓన్లీ న్యూ ఏజ్’.. సరికొత్త అవతారంలో బాలయ్య
Blast Zone : అర్జున్ సర్జా బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ