పద్మశ్రీ అవార్డు కోసం బ్రతిమిలాడను- బాబు మోహన్
ABN, Publish Date - Apr 19 , 2026 | 10:34 PM
ప్రఖ్యాత హాస్య నటుడు రేలంగి అవార్డు వచ్చిన సందర్భంగా బాబు మోహన్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ‘పద్మశ్రీ’ అవార్డు విషయమై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడు, మాజీ మంత్రి, విశ్వ నట సామ్రాట్ డాక్టర్ బాబు మోహన్ (Babu Mohan)ను తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ అండ్ భారత్ కల్చరల్ అకాడమీ వారు.. ప్రఖ్యాత హాస్య నటుడు రేలంగి అవార్డు (Relangi Award)తో సత్కరించారు. ఈ అవార్డు వచ్చిన సందర్భంగా బాబు మోహన్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ‘పద్మశ్రీ’ (Padma Shri) అవార్డు విషయమై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ కార్యక్రమంలో తను నిర్వహిస్తున్న ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సహాయం చేస్తున్నానని, దానికి ప్రభుత్వ గుర్తింపు కూడా ఉందని చెప్పారు. పబ్లిసిటీ కోసం కాకుండా, అందరికీ సోదరుడిగా ఉంటూ సామాజిక సేవ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ప్రజల ఆశీస్సులు, వారి ప్రేమ తనకు దక్కిన అతిపెద్ద పురస్కారమని పేర్కొన్నారు. దారిలో వెళ్తున్నప్పుడు సామాన్య ప్రజలు ఆప్యాయంగా పలకరించడం, ఒక చిన్నారి తనను గుర్తుపట్టడం వంటి ఘటనలు తనకు ఎంతో సంతృప్తిని ఇస్తాయని తెలిపారు.
ఇక ‘పద్మశ్రీ’ పురస్కారం ఇంకా ఎందుకు రాలేదని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. పద్మశ్రీ అవార్డు రావాలని తాను ఎప్పుడూ ఎవరినీ వేడుకోలేదని, బ్రతిమిలాడుకోవడం తన అలవాటు కాదని స్పష్టం చేశారు. అవార్డు వస్తే తప్పకుండా సంతోషిస్తానని, కానీ రాకపోయినా ప్రజల దీవెనలు ఉండగా తనకు ఎలాంటి లోటు లేదని చాలా నిక్కచ్చిగా చెప్పారు. ప్రస్తుతం కొన్ని చిత్రాలలో నటిస్తున్నానని.. ఆ చిత్రాలలోని తన పాత్రలు ఎంతో అద్భుతంగా ఉండబోతున్నాయని వెల్లడించారు. తనను రేలంగి అవార్డుతో పురస్కరించిన వారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన తోటి నటులకు, ఆశీర్వదించిన పెద్దలకు.. బాబు మోహన్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
సాఫ్ట్వేర్ జాబ్ వదిలి సినిమాల్లోకి వచ్చిన సెలబ్రిటీలు వీరే!
సబ్స్క్రిప్షన్ వార్తలపై అనన్య నాగళ్ల క్లారిటీ ఇదే!
SIFPA: ఏకపక్ష నిర్ణయాలకు చెక్.. సినీ పరిశ్రమను కాపాడుకునే దిశగా నిర్మాతలు!
Raasi: మహేష్ ‘నిజం’ సినిమాలోని పాత్రపై రాశి షాకింగ్ కామెంట్స్!