యూపీలో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?
ABN , Publish Date - May 28 , 2026 | 04:45 PM
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తన లైఫ్లో జరిగిన ఓ భయానక సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఫ్యామిలీ మొత్తం లైవ్లో రామ్ గోపాల్ వర్మ ‘రక్తచరిత్ర’ సినిమా చూశామంటూ.. బండ్ల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) తన లైఫ్లో జరిగిన ఓ భయానక సంఘటనను గుర్తు చేసుకున్నారు. లైవ్లో రామ్ గోపాల్ వర్మ ‘రక్తచరిత్ర’ సినిమా చూశానంటూ ఆయన చెప్పిన ఘటన వింటే.. ఎవరికైనా చమటలు పట్టాల్సిందే. తాజాగా ఆయన నటుడు రాజా రవీంద్ర నిర్వహిస్తోన్న పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బండ్ల గణేష్ నిర్వహిస్తోన్న పౌల్ట్రీ బిజినెస్పై రాజా రవీంద్ర (Raja Ravindra) ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ బిజినెస్ అద్భుతంగా సాగుతుందని చెబుతూ.. ఈ బిజినెస్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో బండ్ల గణేష్ చెప్పారు. అనంతరం ఈ బిజినెస్ని యూపీలో కూడా మొదలు పెట్టాలని ప్రయత్నించావు కదా.. ఏమైంది? అని రాజా రవీంద్ర ప్రశ్నించారు.
దీనికి బండ్ల గణేష్ సమాధానమిస్తూ.. తన ఫ్యామిలీతో కలిసి యూపీ వెళ్ళినప్పుడు ఎదురైన ఆ అత్యంత భయానక సంఘటనను పంచుకున్నారు. ‘‘యూపీ ప్రభుత్వం (UP Govt) నుంచి ఈ బిజినెస్ కోసం అన్ని అనుమతులు తీసుకున్నాను. దాదాపు 100 ఎకరాల స్థలంలో భూమి పూజ చేసేందుకు.. మా ఫ్యామిలీ మొత్తం అక్కడికి చేరుకున్నాం. పూజా జరుగుతుండగా.. మా నాన్న ఆ స్థలం మొత్తం చూసి వస్తానంటూ వెళ్లారు. అప్పుడే ఒక జీపు వేగంగా వచ్చి అక్కడ వెళ్తున్న ఒక బైక్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆ జీపులో నుంచి ఐదారుగురు వ్యక్తులు కత్తులతో కిందకు దిగారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, రోడ్డుపై పడిపోయిన ఆ బైక్ నడుపుతున్న యువకుడిని పట్టుకుని, అందరూ చూస్తుండగానే అతని తల నరికి చంపేశారు. అంతటితో ఆగకుండా, తెగిపడిన ఆ తలను తీసుకుని తిరిగి జీపులో ఎక్కి అక్కడి నుంచి వేగంగా పారిపోయారు.
ఈ ఘోరాన్ని చాలా దగ్గరగా చూసి నేనే వణికి పోయాను. ఇక మా నాన్న అయితే తీవ్రమైన దిగ్భ్రాంతికి, భయానికి గురయ్యారు. స్థానికంగా జరుగుతున్న కొన్ని గొడవల నేపథ్యంలోనే ఈ దారుణ హత్య జరిగి ఉండొచ్చు. ఈ భయానక దృశ్యాన్ని చూసిన తర్వాత, ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని వెంటనే అక్కడి నుంచి బయలుదేరాం. ఆ తీవ్ర భయాందోళన నుంచి కోలుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది. మా నాన్న అయితే హైదరాబాద్ తిరిగి వచ్చేంత వరకు.. కనీసం మాట కూడా మాట్లాడలేనంతగా గజగజ వణికిపోయాడు. మా నాన్నకి ఏమైనా అవుతుందేమో అని మేమంతా భయపడిపోయాం. హైదరాబాద్ వచ్చే వరకు ఆయన మళ్లీ మనిషికాలేకపోయాడు. అంతే, మళ్లీ యూపీ వైపు తిరిగి చూడలేదు’’ అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
‘రంగస్థలం’ చిట్టిబాబుకి, ‘పెద్ది’కి ఉన్న తేడా ఏంటంటే?
‘అమ్మ’కు ఏమైంది? మరో సీనియర్ నటి సంచలన ఆరోపణలు!
మళ్లీ కత్తిలా తయారైన కాజల్.. ఈ గ్లామర్ ఫొటోలు చూశారా!
System Movie Review: సోనాక్షి సిన్హా, జ్యోతిక 'సిస్టమ్' ఓటీటీ మూవీ రివ్యూ