Bandla Ganesh: ఎవరు పీకేది.. జనాలు డిసైడ్ చేస్తారు! బండ్లన్న.. మరోసారి రచ్చ
ABN , Publish Date - Oct 16 , 2025 | 05:17 PM
బన్నీ వాస్ చేసిన వ్యాఖ్యలపై బండ్ల గణేశ్ “అది పీకుతా ఇది పీకుతా…” అంటూ చేసిన ట్వీట్ టాలీవుడ్లో కొత్త చర్చకు దారి తీసింది.
కమెడియన్, నిర్మాత బండ్ల గణేశ్ (BANDLA GANESH)మరోసారి టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యాడు. నెల రోజుల క్రితం లిటిల్ హార్ట్స్ మూవీ సక్సెస్ మీట్లో ఓ వైపు ఆ సినిమా హీరో మౌళికి సుద్దులు చెప్పే క్రమంలో అల్లు అరవింద్ గురించి మాట్లాడిన మాటలు వారం పది రోజుల పాటు ఇండస్ట్రీని ఉడికించాయి. ఆ తర్వాత అంతా చల్లారిపోయింది అంతా ప్రశాంతం అనుకుంటున్న సమయంలో బన్నీ వాస్ (Bunny Vas) మిత్ర మండలి (Mithra Mandali ) చిత్రం ప్రమోషన్ సందర్భంగా తమను కావాలని కొందరు ట్రోల్ చేస్తున్నారని, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని అలాంటి వారంతా ఏం పీక్కుంటారో పీక్కోండని అంటూ కామెంట్లు చేయడంతో అది ఎవరై ఉంటారనే మరో కొత్త చర్చకు దారి తీశాడు. అది ఓ వైపు నడుస్తుండగానే ఆ సినిమా రిలీజ్ అవడం నెగిటివ్ టాక్ తెచ్చుకుని మిమర్శలు సైతం మూటగట్టుకుంటుంది.
సరిగ్గా ఈ సమయంలోనే బండ్ల గణేశ్ సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి బన్నీ వాస్ వ్యాఖ్యలపై తన మార్కు పంచు డైలాగ్లతో “అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు.. మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు! అంటూ ఓ పోస్టు పెట్టి మళ్లీ ఓ కొత్త చర్చకు మార్గం వేశాడు. దీంతో అప్పుడు అల్లు అరవింద్ గురించి మాట్లాడినప్పుడే పోగిడాడా లేక తెగిడాడా అనేది అర్థం కాక అనేక మంది సందిగ్దంలో ఉండగా.. ఇప్పుడు చేసిన పోస్టు సైతం అలానే ఉండడం గమనార్హం.
గణేశ్ పెట్టిన ఈ పోస్టూ ఏదో బన్నీ వాస్ మాట్లాడిన రెండు రోజుల్లో పెడితే ట్రోలింగ్ గురించి పట్టించుకొవద్దని ఆయనకు అండగా ఉన్నట్లు జనాలకు అర్థం అయ్యేది. అలా గాక ఆ ఇన్సిడెంట్ జరిగిన నాలుగు రోజుల తర్వాత ఇప్పుడు తీరా సినిమా రిలీజ్ అయి పబ్లిక్ టాక్ బయటకు వచ్చిన సమయంలో ఈ పోస్టు పెట్టడంతో ఆ పోస్టు కాస్త బన్నీ వాస్ను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్ల లాగానే తెలుస్తోంది. సినిమాలో దమ్ము ఉంటే అది చూసుకుంటుందని మనం అది చేయలేరు ఇది చేయలేరు అంటూ మాటలు చెప్పాల్సిన అవసరం లేదు అనేలా ఉన్నాయి. ఇప్పుడు ఈ అంశంపై మరలా చర్చ గట్టిగానే జరుగుతుంది. అల్లు అరవింద్, బండ్ల గణేశ్ల మధ్య అంతర్గతంగా ఏమైనా జరుగుతుందా అనే కొత్త అనుమానాలకు తావిస్తుంది.