Bollywood: చైనాలో రామాయణ ప్రివ్యూ!
ABN , Publish Date - Jul 14 , 2026 | 02:18 PM
హిందీ చిత్రం రామాయణ తొలిభాగం వరల్డ్ వైడ్గా ఈ యేడాది దీపావళికి విడుదల కానుంది. దానికి ముందు ఈ చిత్ర బృందం చైనాలో నాలుగు రోజుల పాటు పర్యటించబోతోందట.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్న 'రామాయణ' చిత్రం మొదటి భాగం ఈ యేడాది దీపావళి కానుకగా విడుదల కానుంది. నితీశ్ తివారీ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 24న మూవీ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. అదే సమయంలో చిత్ర బృందంతో వరల్డ్ టూర్ కూ సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం.
ప్రస్తుతం భారతీయ సినిమాకు చైనా అతి పెద్ద మార్కెట్ గా అవతరించింది. భాషతో నిమిత్తం లేకుండా భారతీయ చిత్రాలు చైనాలో సబ్ టైటిల్స్ తో రిలీజ్ అవుతున్నాయి, అఖండ విజయాన్నీ అందుకుంటున్నాయి. అందుకే ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ చైనా మార్కెట్ పై ప్రత్యేక శద్థ వహిస్తున్నారు. 'రామాయణ' దర్శక నిర్మాతలూ అందుకు మినహాయింపు కాదని తెలుస్తోంది.
'రామాయణ' చిత్రంలో సీతారాములుగా నటించిన సాయిపల్లవి, రణబీర్ కపూర్తో పాటు ఇందులో రావణాసురుడి పాత్రను పోషించిన యశ్ సైతం ఈ సినిమా విడుదలకు ముందు చైనాలో పర్యటించబోతున్నారు. సెప్టెంబర్ లో నాలుగు రోజుల పాటు వీరి పర్యటన ఉండే ఆస్కారముందని మేకర్స్ చెబుతున్నారు. ఈ నాలుగు రోజుల్లోనే అక్కడో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. దీనితో పాటు అదే సమయంలో పింగ్యావో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'రామాయణ' చిత్రం స్పెషల్ స్క్రీనింగ్ కు ప్లాన్ చేస్తున్నారట. ఇలా కేవలం చైనాలోనే కాకుండా మరికొన్ని దేశాలలోనూ ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ జరిగే ఆస్కారం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే భారతీయ ఇతిహాసమైన రామాయణం వివిధ రూపాలలో పలు దేశాలలో ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు సినిమా మాధ్యమంగానూ అది పండితులను, పామరులను చేరుకోవడం విశేషం. మరి నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న 'రామాయణ'కు గ్లోబల్ మార్కెట్లో ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.
ALSO READ:
Dhanush: ‘డి-56’ ఆ రోజే అఫీషియల్
Mysskin: విజయ్ సేతుపతి ఒక అగ్నిపర్వతం
Shruti Haasan : శ్రుతి హాసన్ ఓ ఇంటిదయ్యింది
Indian Movies: ఆ చిత్రాల్లో అగ్రస్థానంలో 'టాక్సిక్'!