మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nenunnanu: వారాహి ‘సాయి’ హనుమంతుని పుస్తకం అద్భుతం... పురాణపండ శ్రీనివాస్ కృషి అమోఘం

ABN, Publish Date - Apr 23 , 2024 | 08:11 PM

భారతదేశంలోనే తొలిసారిగా శ్రీ ఆంజనేయస్వామిపై పురాణపండ శ్రీనివాస్ రచనాసంకలనంగా అనేక వెలుగు లోకాల్లోకి పాఠకులను ప్రయాణింపచేసిన మహాగ్రంధం ‘నేనున్నాను’. ఈ గ్రంధాన్ని ప్రఖ్యాత చలనచిత్ర నిర్మాణసంస్థ ‘వారాహి చలన చిత్రం’ అధినేత సాయి కొర్రపాటి సమర్పించారు. ఈ అఖండ గ్రంధంలో తన ఆరాధ్య మిత్రులైన ఎస్.ఎస్. రాజమౌళికి, ఎం.ఎం. కీరవాణికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Puranapanda Srinivas and Sai Korrapati

ప్రపంచ పుస్తక దినోత్సవం (World Book Day), హనుమాన్ విజయోత్సవం (Hanuman Jayanti) కలిపి ఒకే రోజైన ఈరోజు (ఏప్రిల్ 23) రావడంతో అటు పుస్తకంగాను, ఇటు హనుమాన్‌గాను కలిపిన ప్రత్యేక విశేషంగా ఈ పవిత్రమైన రోజు గురించి చెప్పుకోవచ్చు. తెలుగులో హనుమంతుని పుస్తకాలంటే కొన్ని వందలమంది పుస్తక ప్రచురణకర్తలు ప్రచురించిన ‘హనుమాన్ చాలీసా’ మొదలుకొని ‘సుందరకాండ’వరకూ కొన్ని రకాల బుక్స్ గుర్తుకొస్తాయి. ఇందులో తొంబై శాతం ప్రచురణకర్తలు చాలా చవకబారు పేపర్‌పై ముద్రించి సెంటిమెంట్‌ని ఆసరా చేసుకుని వ్యాపారం చేస్తారు. మరొకవైపు చూస్తే జీవితమే పుస్తక పరిమళంగా ఒక పదిశాతం అద్భుతమైన వ్యక్తులు కనిపిస్తారు. ఇలా చూసినప్పుడు హనుమాన్ (Hanuman) బుక్‌ని మహోన్నతంగా దర్శింపచేసిన ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధికారిక మాసపత్రిక ‘ఆరాధన’ పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) ఠక్కున గుర్తుకొస్తారు.

భారతదేశంలోనే తొలిసారిగా శ్రీ ఆంజనేయస్వామిపై పురాణపండ శ్రీనివాస్ రచనాసంకలనంగా అనేక వెలుగు లోకాల్లోకి పాఠకులను ప్రయాణింపచేసిన మహాగ్రంధం ‘నేనున్నాను’ (Nenunnanu). ఈ గ్రంధాన్ని ప్రఖ్యాత చలనచిత్ర నిర్మాణసంస్థ ‘వారాహి చలన చిత్రం’ అధినేత సాయి కొర్రపాటి సమర్పించారు. ఈ అఖండ గ్రంధంలో తన ఆరాధ్య మిత్రులైన దర్శకధీరులు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli)కి, ఎం.ఎం. కీరవాణి (MM Keeravani)కి ఎంతో ప్రత్యేక కృతజ్ఞతలు ప్రకటించారు సాయి కొర్రపాటి (Sai Korrapati).

ఈ ‘నేనున్నాను’ నిస్సందేహంగా అఖండ గ్రంధం. పూర్తిగా జపాన్ ఆర్ట్ పేపర్‌పై ముద్రించబడిన ఈ మహాగ్రంధం ఏక మొత్తంగా వర్ణభరితమనే చెప్పాలి. ఎన్నెన్నో అరుదైన ఆంజనేయ చిత్రాల సంపద, ఎక్కడెక్కడివో హనుమంతుని అపురూప శిలాఖండాల చిత్రాలు, శ్రీ ఆంజనేయుని అమోఘమంత్ర శక్తులు, మధ్యే ... మధ్యేగా పురాణపండ శ్రీనివాస్ కలం బలంగా రచించిన అమృతమయమైన సమ్మోహన వ్యాఖ్యానాలు, కధలు.. అహో.. ‘ఈగ’ (Eega) చలన చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి (Producer Sai Korrapati) ఎంత ధన్యులో ఈ పుస్తకానికి ప్రచురణకర్తగా వ్యవహరించడం. అందుకే కాబోలు ఇన్నాళ్లయినా చలన చిత్ర పరిశ్రమలో ఎంతోమంది నిర్మాతల, దర్శకుల ఇళ్లలో ఈ మంత్రం మహాగ్రంధం ఒక అభయ హస్తంలా కనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) టేబుల్‌పై ఈ పుస్తకమే. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఇంట ప్రత్యేకంగా ఒక గ్లాస్ అల్మారాలో, దర్శక ప్రముఖుడు క్రిష్ (Krish) ఇంటి లైబ్రరీ‌లో, విక్టరీ వెంకటేష్ (Venkatesh) పూజాపీఠంలో... విఖ్యాత నటుడు, రచయిత తనికెళ్ళ భరణి హోమ్ లైబ్రరీలో... వీళ్ళే కాదు ఇలా ఎందరి మనస్సునో ఈ అఖండం దోచేసిందనే చెప్పాలి. అప్పట్లో ఈ పుస్తకాన్ని సాయి కొర్రపాటి దంపతులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ద్వారా చాలామందికి చేరవేశారు.


ఇక పోతే... ఇంతటి వైభవం ఒక్కటే కాదు. జీవన యాత్రలో కొన్ని ఆపదలెదురైనా సరే అస్సలు స్వార్ధాన్ని తన మనస్సుకు తాకనివ్వని పురాణపండ శ్రీనివాస్ తన ప్రతీ అడుగూ భగవంతుని సాధనా మార్గంవైపు వెయ్యడం వల్లనేమో మరొక మహా హనుమంతుని పుస్తకాన్ని ఈ దేశ హోమ్ శాఖామంత్రి అమిత్ షా (Amit Shah) ఆవిష్కరించి సాయి కొర్రపాటి, పురాణపండలను అభినందించారని దేశ రాజధాని మీడియా సైతం కోడై కూసింది. కాళీ అమ్మవారి ఉపాసనకు జీవితాన్ని ధారపోసిన మహాత్ములు సిద్ధేశ్వరానంద భారతి వంటి వచోవైభవం కలిగిన తపస్వి, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తరిస్తూ... బంగారు రామానుజుల గంభీర విగ్రహ ప్రతిష్టతో ఈ దేశాన్నే తమ వైపు తిప్పుకున్న యశస్వి చిన్న జీయర్ (Chinna Jeeyar Swamy) సైతం ఈ ‘నేనున్నాను’ సాక్షాత్కారంపై మంగళాశాసనాలు చెయ్యడం దైవానుగ్రహమే.

ఏది ఏమైనా ఇంతవరకూ ఇలాంటి కంటెంట్‌తో కూడిన హనుమాన్ గ్రాండ్ బుక్ తెలుగులో రాలేదని అటు ఆధ్యాత్మిక రంగపు పెద్దలు, ఇటు సినీరంగపు పెద్దలు పదే పదే చెప్పడాన్ని ఈ హనుమాన్ విజయోత్సవం, ప్రపంచ పుస్తక దినోత్సవాల సందర్భంలో మరొక్కసారి స్మరించుకోవడం మన కర్తవ్యమంటున్నారు విజ్ఞులు. ఈ గ్రాండ్ హనుమాన్ బుక్‌ని మొదటగా తిరుమల శ్రీవారి సేవలో తరించే ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుకు అందజేసినట్లు మీడియా కధనం. తిరుమల శ్రీవేంకటేశ్వరుని అర్చనల భక్తునికి చేరడంవల్లనే బహుశా ఇంతటి వైభవాన్ని పురాణపండకు, కొర్రపాటికి దక్కిందేమో.

ఇటీవల ఎన్‌టిఆర్ కుమార్తె, గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి (Nara Chandrababu Naidu) భార్య నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) సైతం తన సాంఘిక కార్యక్రమంలో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ‘నేనున్నాను’ గ్రంధాలను అనేకమంది ప్రతిభావంతులకు స్వయంగా పంచడం గురించి ఆలోచిస్తే ఈ మహోన్నత గ్రంధం ఎంత ఉదాత్తమైందో అర్థమవుతోందని మేధో సమాజం స్పష్టం చేస్తోంది.

Updated Date - Apr 23 , 2024 | 10:50 PM