ఆ పనిచేస్తే టీవీకే సర్కారుకు మంచి పేరు -సత్యరాజ్
ABN , Publish Date - Jun 07 , 2026 | 03:11 PM
విజయ్ టీవీకే ప్రభుత్వం పై నటుడు సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో ప్రవేశపెట్టిన పథకాలకు స్టిక్కర్ అంటించుకుంటే చాలంటూ హేళన చేశారు.
విజయ్ టీవీకే ప్రభుత్వం (Vijay TVK Govt) పై నటుడు సత్యరాజ్ (Sathyaraj) సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ (MK Stalin) ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో ప్రవేశపెట్టిన పథకాలకు స్టిక్కర్ అంటించి, ప్రచారం చేసుకుంటేనే టీవీకే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని సత్యరాజ్ అన్నారు. స్థానిక కొళత్తూరులో డీఎంకే ఆధ్వర్వంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, 1967కు ముందు రాష్ట్రంలో ధనవంతుల పాలన సాగిందన్నారు. 1967 తర్వాత డీఎంకే ప్రభుత్వం ఏర్పాటై రాష్ట్రం తలెత్తుకుందన్నారు. ఆ తర్వాత కలైంజర్ కరుణానిధి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ఉన్నత స్థానంలో నిలబెట్టారని, కలైంజర్ మాటలు సమకూర్చిన రెండు చిత్రాల్లో తాను నటించినట్టు తెలిపారు.
ఇప్పుడు డీఎంకే ప్రతిపక్షంలో ఉంటూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో తాను పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టి అమలు చేసిన పథకాలకు స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేస్తే, ఆ పథకాలకు పేర్లు మార్చుకుంటేనే టీవీకే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. కానీ స్టాలిన్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను మార్చడం సరికాదన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మాజీ సీఎం స్టాలిన్ తన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చారని, ఆయన సేవాగుణంతో ఉన్నారని పేర్కొన్నారు.
సూర్యుడు ఉదయిస్తాడని, సూర్య వెలుగు శాశ్వతమైనదని, సూర్యుడికి మరణం లేదని, సూర్యుడు ఒక్కడే అని, ప్రపంచాన్ని చుట్టి వస్తున్నాడని, తన అంచనా ప్రకారం కలైంజర్ 104వ జయంతి వేడుకల రోజున ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని, ఆయన సారథ్యంలోనే కలైంజర్ 104వ జయంతి వేడుకలు జరుగుతాయని నటుడు సత్యరాజ్ అన్నారు. ఇంకా విజయ్ గురించి మాట్లాడుతూ.. కేవలం సినీ మోజుతో మాత్రమే విజయ్ అండ్ పార్టీ గెలిచిందని, కొత్త సీఎం కేవలం ట్విట్టర్కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. డీఎంకేకు తాను వీర విధేయుడిని అని చెప్పిన సత్యరాజ్.. సొంత నియోజకవర్గం కొళత్తూరు ప్రజల కోసం ఎంతో చేసిన స్టాలిన్ని ఓడించడం ఏమిటంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సినీ వ్యామోహంలో జనాలు పడ్డారని, ఇది డీఎంకేకు ఎదురుదెబ్బ కాదని.. ప్రజలకే గుణపాఠం అని త్వరలోనే తెలుసుకుంటారంటూ సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్యరాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై డీఎంకే పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఆయన ఇకనైనా నిద్రలేస్తే మంచిదంటూ హితవు పలుకుతున్నారు.
ఇవి కూడా చదవండి:
నీ కోసమే నాన్న.. రామ్ చరణ్కు క్లీంకార పాప అదిరిపోయే సర్ప్రైజ్!
ట్రోలింగ్.. చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా తయారయ్యారేంట్రా!
సినిమా రివ్యూ: హీమాన్ అండ్ మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్