Raviteja: మూడు ముడులతో.. ఫ్యామిలీ డ్రామాగా
ABN, Publish Date - Aug 13 , 2026 | 07:09 AM
ఏ ఆడకూతురిలోనైనా నా కూతుర్ని చూసుకునే బలహీనత నాది.. దాని జోలికి రాకండి' అంటూ విలన్ గ్యాంగ్ కి వార్నింగ్ ఇస్తున్నారు మాస్ మహారాజా రవితేజ
'ఏ ఆడకూతురిలోనైనా నా కూతుర్ని చూసుకునే బలహీనత నాది.. దాని జోలికి రాకండి' అంటూ విలన్ గ్యాంగ్ కి వార్నింగ్ ఇస్తున్నారు మాస్ మహారాజా రవితేజ(Ravi Teja). ఆయన కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). ప్రియ భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో బేబీ నక్షత్ర, సాయికుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా భీమవరంలో నిర్వహించిన గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రవితేజ తన పాత్ర, సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
‘‘నాకు ఒక బలహీనత ఉంది.. ఏ ఆడకూతురులోనైనా నా కూతురిని చూసుకుంటా' ఈ డైలాగ్లోనే కథ మొత్తం అర్థమైపోతుంది. ఎమోషనల్ గా సాగే కథ ఇది. భీమవరంలో ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. మీతో పాటు నేనూ ఈరోజే ట్రైలర్ చూశాను. మీ అందరికీ ట్రైలర్ నచ్చడం చాలా హ్యాపీగా ఉంది. ‘ఇరుముడి’ మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఈ వైబ్ను ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఇక భీమవరంతో మంచి అనుబంధం ఉంది. నా జీవితంలో దాదాపు ఎనిమిది నెలలు కేవలం సినిమాలు చూడటానికే భీమవరంలో ఉన్నాను. మా తాతయ్య, నానమ్మ డీఎన్ఆర్ కాలేజ్ దగ్గర ఉండేవారు. భీమవరానికి చాలా మంచి వైబ్ ఉంటుంది. ఇక్కడి ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సంక్రాంతికి కోడిపందాల్లో కలుద్దాం’’ అని అన్నారు.
దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ ‘ఇరుముడి’లో మూడు ప్రధానమైన ముడులు ఉంటాయి. ‘‘ఒక తండ్రికి, కూతురికి మధ్య ఉన్న ముడి.. అయ్యప్ప స్వామికి, ఆయన భక్తుడికి మధ్య ఉన్న ముడి.. అలాగే సినిమాలో ఉన్న క్రైమ్ చిక్కుముడి. ఈ మూడు అంశాలను కలిపి ఒక ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించాము.ట్రైలర్లో కనిపించిన దానికంటే సినిమాలో పదింతలు ఎక్కువ కంటెంట్ ఉంటుంది" అని అన్నారు.
ALSO READ:
బాక్సాఫీస్ పోరులో ‘సాహో’ జోడీ.. విన్నర్ ఎవరు?
రౌడీ వేర్ బ్రాండ్కు ఫ్యాన్స్గా డైరెక్టర్స్.. విజయ్ క్రేజ్ ఇది!
నటుడు అజింక్య దేవ్ చేతుల మీదుగా.. హీరోయిన్ జో శర్మకు నాఫా అవార్డ్