పావలా శ్యామల గురించి ఘోరంగా రాశారు.. ఇక ఆపండి: కరాటే కళ్యాణి
ABN , Publish Date - Jul 30 , 2026 | 05:13 PM
పావలా శ్యామల ఇక లేరు.. లేని మనిషిపై ఎలా పడితే అలా రాతలు రాయవద్దని కోరారు నటి కరాటే కళ్యాణి.
పావలా శ్యామల ఇక లేరు.. లేని మనిషిపై ఎలా పడితే అలా రాతలు రాయవద్దని కోరారు నటి కరాటే కళ్యాణి (Karate Kalyani). ‘మా’ అందరికీ సపోర్ట్గా ఉంటుందని, ‘మా’ తరపున నాకు పావలా శ్యామల (Pavala Syamala) అంత్యక్రియల బాధ్యతలు అప్పగించారని, ఆమెకు ఎవరూ లేరని రాయడం కరెక్ట్ కాదని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
‘‘పావలా శ్యామల మనకి దూరమైపోయి వెళ్ళిపోయారు కానీ.. ఆవిడ ఎప్పుడు మనందరి మనసుల్లోనే ఉంటారు. ఆమెకు సంబంధించిన ఏదైనా కామెడీ సీన్ చూసినప్పుడు.. మరీ ముఖ్యంగా ‘ఎవరికి భాయ్’ అనే సీన్ చూసిన ప్రతి ఒక్కరు కూడా నవ్వుకుంటూనే ఉంటారు. ఆవిడ కామెడీతో మనల్ని నవ్విస్తూనే ఉంటారు.. ఎప్పటికీ నవ్విస్తారు, మన జనరేషన్ కాదు ముందు జనరేషన్ కూడా ఆమె సీన్స్ చూసి హాయిగా నవ్వుకుంటారు. ఇక ఆమె అంత్యక్రియల బాధ్యత నాకు రావడం.. నిజంగా ఆవిడకి నాకు ఏ రుణం ఉందో తెలీదు, ఆ రుణం నేను తీర్చేసుకున్నానని అనిపిస్తోంది. నాకు ఇప్పుడే కాదు ముందు నుంచి ఆవిడతో అనుబంధం ఉంది. ఆవిడ ఎంత దూరంగా ఉందామన్నా ఆవిడికి ఏదో ప్రాబ్లెం వచ్చినప్పుడల్లా నేను దగ్గరికి వెళ్ళేదాన్ని. ఎందుకంటే ఆవిడ మాట కటువుగా ఉంటుంది కానీ పరిస్థితి, వయోభారం కదా.. మన అమ్మ అయితే అనదా అనుకొని.. నేనే వెళ్తాను. మనుషులకి ఇలాంటి కష్టంలో రానప్పుడు ఇంకెప్పుడు వస్తారు? సుఖంలో రాకపోయినా పర్లేదు కానీ, కష్టంలో ఉండాలని పెద్దలు చెబుతుంటారు.
ఇంతమంది ఆర్టిస్టులు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున నిలబడి ఈ కార్యక్రమం జరపడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ‘ఆమె అనాధగా వెళ్ళిపోతుంది’ అని రాసిన కొంతమందికి ఇది సమాధానం. చాలా మంది రాశాను.. అలా రాసిన వారందరికీ మేము ఇచ్చే సమాధానం ఇదే. ఇప్పుడు చూశారు కదా.. ఆవిడ అనాధగా వెళ్ళారా? మీరే చెప్పండి. ఎంత గ్రాండ్గా పంపించాలో అంత గ్రాండ్గా పంపించాం. మాకు ఈ విషయంలో శంకర్ వాళ్ల ఆశ్రమం చాలా చాలా సపోర్ట్ చేసింది. ఇప్పుడు కూడా పావలా శ్యామల కుమార్తె మాధవిని కూడా వాళ్ళకే అప్పజెప్పి.. మేము ఏం చేయగలమో.. మా తరపున అది చేస్తాం. మంచు విష్ణు ప్రస్తుతం ఇక్కడ లేరు.. ఆయన వచ్చాక ఒక మీటింగ్ ఉంటుంది. మురళీ మోహన్, నరేష్ ఇలా పెద్దవాళ్ళందరూ బాధ్యత తీసుకుని.. మా చేతనైంది మేము చేస్తాం. నేను శ్యామలమ్మకి చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా కొన్ని ఉన్నాయి. అలాగే వారి పాప విషయంలో కూడా నాకు బాధ్యత ఉంది. అది కూడా పూర్తి చేస్తాను.
ఇక మీడియా ద్వారా మరొక్కసారి చెబుతున్నాను.. శ్యామలమ్మ గురించి నిన్న కూడా నేను వీడియోలో విన్నాను. అసలు లేనివి ఉన్నవి కూడా రాస్తున్నారు. దయచేసి అలా రాయకండి, ఆవిడ ఆత్మ క్షోభిస్తుంది. చాలా ఘోరంగా రాశారు.. అవన్నీ చూసి చాలా బాధేసింది. ముఖ్యంగా యూట్యూబర్స్కి.. ప్లీజ్ తమ్ముళ్ళు మీరందరూ అర్థం చేసుకోండి. ఆవిడ వెళ్ళిపోయింది, వెళ్ళిపోయిన వాళ్ళందరూ మంచివాళ్ళు అని అంటారు. నిజంగా ఆవిడ గురించి మీకేం తెలియదు. మీరు ఏది పడితే అది రాస్తే.. వాళ్ళ అమ్మాయి ఆ వీడియోలు చూపించి చాలా బాధపడుతుంది. ఆ అమ్మాయి గురించి కూడా పిచ్చి పిచ్చి థంబ్స్ పెట్టారు. శ్యామలమ్మ పాడె మోయడానికి నలుగురు కూడా లేరని రాశారు. మేమందరం ఉన్నామని నిరూపించాం. ‘మా’ అసలు పట్టించుకోదు అని రాశారు. ఇప్పుడెవరు పట్టించుకున్నారు. నేను ‘మా’లో జాయింట్ సెక్రటరీని. నాకు శ్యామలమ్మ బాధ్యతలు అప్పగించారు. దయచేసి ఎవరూ రాలేదు అని రాయవద్దు. అంతా చూశారు కదా.. ఇకనైనా పోయిన వారి గురించి తప్పుతప్పుగా రాయకండి. ఆ పాపని కూడా మేము బాగా చూసుకుంటాం. రెడీ టు సర్వ్ ఫౌండేషన్కు కృతజ్ఞతగా ఉంటాము. శ్యామలమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
Spider-Man: Brand New Day Review: స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రివ్యూ
Srinivasa Mangapuram Review: శ్రీనివాస మంగాపురం రివ్యూ
రమేష్కు పవన్ కళ్యాణ్ రూ. 5 లక్షల సాయం.. ‘గబ్బర్సింగ్’ టీమ్ స్పందనిదే