భారతీరాజా నాపై చెరగని ముద్ర వేశారు: చిరంజీవి
ABN, Publish Date - Jun 10 , 2026 | 10:37 AM
దర్శకుడు భారతీరాజా తనపై చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి. దర్శకదిగ్గజం భారతీరాజా మృతికి నివాళులు అర్పిస్తూ, చిరంజీవి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
‘ఆరాధన’ సినిమాలో భారతీరాజా (Bharathiraja) దర్శకత్వంలో ‘పులిరాజు’గా నటించే అదృష్టం నాకు దక్కిందని, ఆయన తనపై చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి. దర్శకదిగ్గజం భారతీరాజా మృతికి నివాళులు అర్పిస్తూ, చిరంజీవి (Chiranjeevi) చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. దర్శకనటుడు భారతీరాజా (84) బుధవారం ఉదయం అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణ వార్త తెలిసిన వారంతా తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతూ.. ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో సినిమా చేసిన చిరంజీవి.. ఎక్స్ వేదికగా తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు ఆయన చేసిన పోస్ట్లో..
‘‘భారతీయ సినిమా, గొప్ప కథకులలో ఒకరైన భారతీరాజాను కోల్పోయింది. గ్రామీణ మట్టి సువాసనలను, మానవ సంబంధాల అందాలను, ప్రేమలోని అమాయకత్వాన్ని, సామాన్య ప్రజల భావోద్వేగాలను ఆయన ఎప్పటికీ నిలిచిపోయే సినిమా కవిత్వంగా మార్చారు. ఆయన చిత్రాలు కోట్లాది మంది హృదయాలను తాకాయి. ఇంకా ఎంతో మంది సినీ దర్శకుల తరాలకు స్ఫూర్తిగా నిలిచాయి. ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పలు జాతీయ చలనచిత్ర అవార్డుల గ్రహీత అయిన భారతీరాజా.. భారతీయ సినిమాకు అందించిన సహకారం వెలకట్టలేనిది.
‘ఆరాధన’ (Aradhana) సినిమాలో ఆయన దర్శకత్వంలో ‘పులిరాజు’ (Puliraju)గా నటించే అదృష్టం నాకు దక్కింది. సినిమాపై ఆయనకున్న మక్కువ, ఆయన సింప్లిసిటీ, తన వృత్తి పట్ల ఆయనకున్న అంకితభావం నాపై చెరగని ముద్ర వేశాయి. ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోయినప్పటికీ, ఆయన అందించిన అద్భుతమైన చిత్రాల ద్వారా ఆయన వారసత్వం ఎప్పటికీ జీవించే ఉంటుంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి దర్శక శిఖరం భారతీరాజా. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’ అని దర్శకదిగ్గజానికి చిరంజీవి నివాళులు అర్పించారు.
ఇవి కూడా చదవండి:
భారతీరాజా మృతికి ప్రముఖుల నివాళి
‘పెద్ది’ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ! నార్త్, ఓవర్సీస్లో ఇక తిరుగులేనట్టే!
మెగా హీరోస్ రేంజ్ అది.. మూడు వందల కోట్ల క్లబ్లో ఆ ముగ్గురు