నాడు 'ఆ నలుగురు'.. నేడు 'ఈ పాట కోరినవారు..'
ABN, Publish Date - Sep 15 , 2026 | 05:41 PM
'ఆ నలుగురు' ఫేం చంద్ర సిద్ధార్థ్ ఆయన తెరకెక్కించిన తాజా సినిమా 'ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు' టీజర్ విడుదల అయింది.
'ఆ నలుగురు', 'మధుమాసం', 'అందరి బంధువయా', 'ఇదీ సంగతి', 'ఆటగదరా శివా' తదితర సినిమాలతో విలక్షణ దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు చంద్ర సిద్ధార్థ్. ఆయన తెరకెక్కించిన తాజా సినిమా 'ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు'. (ఎ ఫర్బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్బిడెన్ సాగా) అనేది ఉపశీర్షిక.
తెలుగు సినిమా చరిత్రలో అత్యంత పొడవైన టైటిల్తో వస్తున్న సినిమాగా రికార్డులకు ఎక్కింది. ప్రముఖ దర్శక రచయిత మదన్ అందించిన కథతో వై.వి.సత్యనారాయణ రాజు సమర్పణలో ఫిల్మోత్సవ్ పతాకంపై చంద్ర సిద్ధార్థ్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 18న విడుదల కానుంది. బ్లాక్ బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు.
'ఈ పాట కోరినవారు...' టీజర్ విడుదల చేసిన అనిల్ రావిపూడి, సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ''ఇంత పెద్ద టైటిల్తో సినిమా రావడం ఇంట్రెస్టింగ్గా ఉంది. చంద్ర సిద్ధార్థ్ గారి దగ్గర 'మధుమాసం', 'హౌస్ఫుల్', 'అందరి బంధువయా' చిత్రాలకు నేను స్క్రిప్ట్ విభాగంలో పని చేశాను. ఆయన సెన్సిబుల్ సినిమాలు తీశారు. పొడవాటి టైటిల్తో వస్తున్న ఈ సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంటుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.
దర్శక నిర్మాత చంద్ర సిద్దార్థ్ మాట్లాడుతూ... ''మా సినిమా టీజర్ విడుదల చేసిన అనిల్ రావిపూడి గారికి థాంక్స్. మేం అడిగిన వెంటనే ఓకే చెప్పారు. ఆయన బిజీ షెడ్యూల్లో మాకు కొంత టైమ్ ఇచ్చారు. ఆయనకు టైటిల్, టీజర్ నచ్చడం పాజిటివ్ సైన్. మాకు సంతోషంగా ఉంది. టైటిల్ రెస్పాన్స్ బావుంది. ఆడియన్స్ అందరిలో సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన థ్రిల్లర్ సినిమాల్లో ఇదొక డిఫరెంట్ సినిమా అవుతుంది. థియేటర్లలో మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం'' అని అన్నారు.
హర్ష హీరోగా, అమైరా గోస్వామి, సుజనా రెడ్డి హీరోయిన్లుగా పరిచయమవుతున్న 'ఈ పాట కోరినవారు..' సినిమాలో ఇనయా సుల్తానా, రవివర్మ, అశోక్ వర్ధన్, రేఖా నిరోషా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. టీజర్ విషయానికి వస్తే... 'నీ రేడియో కావాలి' అంటూ హీరో హర్ష ఒకరి ఇంటికి వెళతాడు. అక్కడ రేఖా నిరోషా 'నేను వద్దా' అని అడుగుతారు. అది చూసి ఆమె భర్త ఓ లుక్ ఇస్తారు. తర్వాత 'ఇంత అందంగా ఉన్నారు. మిమ్మల్ని ఎలా వదులుకున్నారు' అని ఇనాయ సుల్తానాను అడిగితే... 'ఎప్పుడూ మీరే వదిలేయాలా? మేం వదలకూడదా' అని ఆమె సమాధానం ఇస్తారు. ప్రేయసిని షేర్ చేసుకోవాలనుకునే ప్రియుడు, పెళ్లి పీటల మీద భర్తతో పాటు మరొకరు కావాలని కోరిన భార్య వంటి సన్నివేశాలు సినిమాపై ఆసక్తి పెంచాయి. ఈ మిస్టికల్ మ్యూజికల్ థ్రిల్లర్ మీద అంచనాలు పెంచాయి.
'ఆ నలుగురు'తో మానవ సంబంధాలు, భావోద్వేగాలను బలంగా ఆవిష్కరించిన చంద్ర సిద్ధార్థ్, ఈసారి ఆధునిక థ్రిల్లర్ నేపథ్యంతో మరో భిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. సంగీతం, ధ్వని, మానవ మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని కథలో కీలకంగా మలుస్తూ రూపొందిన చిత్రమిది. సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, మెమరీస్, గిల్ట్ వంటి అంశాలను మిస్టరీ కథనంతో మేళవించిన చిత్రమిది.
ఇవి కూడా చదవండి!
చిన్ని ప్రాణానికి ఎప్పటికీ కృతజ్ఞురాలిని.. సమంత సీమంతం పోస్ట్ వైరల్
పావలా శ్యామల కూతురికి 'మా' చేదోడు!
36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ ఏందయ్యా ఈ స్పీడ్!