Kannappa: మోహన్ బాబు తనయుడిగా...
ABN, Publish Date - Jun 25 , 2025 | 05:50 PM
నటుడు శివ బాలాజీ 'కన్నప్ప' చిత్రంలో మోహన్ బాబు తనయుడిగా నటించాడు. పాత్ర నిడివి తక్కువే అయినా... సినిమా గొప్పతనాన్ని గుర్తించి ఇందులో చేశానని శివ బాలాజీ చెబుతున్నాడు.
ప్రముఖ నటుడు, నిర్మాత డా. ఎం. మోహన్ బాబు (Mohan Babu) ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 'కన్నప్ప' (Kannappa) చిత్రం ఈ నెల 27న జనం ముందుకు రాబోతోంది. దీనిని ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. విష్ణు, ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో అగ్ర నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో మోహన్ బాబు మహదేవశాస్త్రిగా నటించారని, తాను ఆయన కొడుకు పాత్రను చేశానని నటుడు శివ బాలాజీ (Siva Balaji) తెలిపారు.
'కన్నప్ప' చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ, 'నాకు మంచు విష్ణుతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ద్వారా అనుబంధం ఏర్పడింది. అది మమ్మల్ని ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా మార్చేసింది. 'కన్నప్ప' సినిమా గురించిన చర్చలు జరుగుతుండగా ఓ రోజు మోహన్ బాబు గారు 'ఈ సినిమాలో నాకు పాత్ర ఎందుకు ఇవ్వలేద?'ని విష్ణును అడిగారు. 'నాకు తగ్గ పాత్ర ఏదీ లేద'ని అతను చెప్పారు. 'శివ బాలాజీ ఈ చిత్రంలో ఉండాల్సిందే'... అని మోహన్ బాబు గారు అన్నారు. ఆ తర్వాత ఆయన పోషించిన మహదేవ శాస్త్రి కొడుకు పాత్రను నాకు ఇచ్చారు. అయితే ఈ పాత్ర నేను చేయడం కరెక్టా? కాదా? అనే ఆలోచనలో పడ్డాను. నా భార్య మధు సైతం చిన్న పాత్ర చేయడం అవసరమా అని అంది. అదే మాట విష్ణుతో అంటే... 'నిర్ణయం నీదే' అని చెప్పారు. పాత్ర నిడివిని దృష్టిలో పెట్టుకోకుండా... ఈ సినిమా గొప్ప తనాన్ని గుర్తించి, అంగీకరించారు. ఇవాళ ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. మోహన్ బాబు గారితో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవడం, న్యూజిలాండ్ లో రెండు నెలల పాటు షూటింగ్ లో పాల్గొనడం మర్చిపోలేని సంఘటనలు' అని చెప్పారు.
నటుడిగా కెరీర్ ప్రారంభించిన కొత్తలోనే పలు ఆటు పోటులను ఎదుర్కొన్నానని శివ బాలాజీ అన్నారు. తాను నటించిన మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయని, తొలి విజయాన్ని 'ఆర్య' అందించిందని చెప్పారు. ఆ మధ్య తాను నటించిన సినిమాలలో 'సిందూరం' చక్కని పేరు తెచ్చిపెట్టిందని, అలానే 'రెక్కి' వెబ్ సీరిస్ వీక్షకుల ఆదరణ పొందిందని, దానికి కొనసాగింపుగా 'రెక్కి -2' పేరుతో ఈసారి ఫీచర్ ఫిల్మ్ తీస్తున్నారని శివ బాలాజీ తెలిపారు. దీనితో పాటే మోహన్ బాబు ప్రొడక్షన్ హౌస్ లో నిర్మితమయ్యే సినిమాలో తాను హీరోగా నటిస్తున్నానని అన్నారు.
'కన్నప్ప' మూవీ గురించి చెబుతూ, 'ప్రభాస్, మంచు విష్ణు మధ్య వచ్చే సంభాషణలు అత్యద్భుతంగా ఉంటాయి. ప్రభాస్ ఎంట్రీ నుండి మూవీ మరో లెవెల్ లో ఉంటుంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ దాదాపు 40 నిమిషాలు ఉంటుంది. అలానే మోహన్ లాల్ ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అక్షయ్ కుమార్ ను తెర మీద చూడగానే పరమ శివుడిని చూసిన భావనకు ప్రేక్షకులు లోనవుతారు' అని చెప్పారు.
Also Read: Salman Khan: ఆ స్టార్ హీరోయిన్ నా ఫోటోను బాత్ రూమ్ లో పెట్టుకుంది
Also Read: OTT: ఈవారం.. ఓటీటీ సినిమాలు, సిరీస్ల ఫుల్ లిస్ట్! ఆ మూడు చాలా స్పెషల్