సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Maganti Gopinath: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇక లేరు

ABN, Publish Date - Jun 08 , 2025 | 08:43 AM

బీఆర్ఎస్ (BRS) జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (MLA Maganti Gopinath no more) కన్నుమూశారు . ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుది శ్వాస విడిచారు.

బీఆర్ఎస్ (BRS) జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (MLA Maganti Gopinath no more) కన్నుమూశారు . ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండెపోటు (Heart attack)తో ఏఐజీ ఆస్పత్రి (AIG Hospital)లో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. ఈ మేరకు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. (RIP Maganti Gopinath)

హైదరాబాద్ లోని అతి పెద్ద శాసనసభ నియోజక వర్గాల్లో ఒకటైన జూబ్లీ హిల్స్ నుండి వరుసగా 2014, 2018, 2023 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా గెలిచారు మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath). రాజకీయ రంగంలో శాసనసభ్యుడు కాకపూర్వం మాగంటి గోపీనాథ్ నాలుగు చిత్రాలు నిర్మించారు. 1995లో ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో 'పాతబస్తీ' (Paatha Basthi)చిత్రంతో నిర్మాతగా మారారు గోపీనాథ్. సురేశ్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో రూపొందిన 'పాతబస్తీ' అంతగా అలరించలేక పోయింది. తరువాత 2000లో రాజశేఖర్ హీరోగా 'రవన్న' (Ravanna)సినిమా నిర్మించారు. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తన అభిమాన హీరో కృష్ణతో ఓ కీలక పాత్రను ధరింప చేశారు గోపీనాథ్. సౌందర్య నాయికగా తెరకెక్కిన ఈ సినిమా సైతం జనాన్ని ఆకట్టుకోలేక పోయింది. తారకరత్నను హీరోగా పరిచయం చేస్తూ ఒకే రోజున తొమ్మిది సినిమాలు మొదలయ్యాయి. అందులో గోపీనాథ్ 'భద్రాద్రి రాముడు' (Bhadradri Ramudu) మూవీ ఒకటి. 2004లో వచ్చిన ఈ చిత్రానికి సురేశ్ కృష్ణ దర్శకుడు. ఈ చిత్రం కూడా గోపీనాథ్ కు తీపి రుచి చూపించలేక పోయింది. తన 'రవన్న' హీరో రాజశేఖర్ తో 2009లో 'నా స్టైలే వేరు' (Naa Style Veru) సినిమా తెరకెక్కించారు. జి. రామ్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో భూమిక నాయికగా నటించారు. ఇది కూడా గోపీనాథ్ కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. అలా సినిమా రంగంలో నిర్మాతగా సక్సెస్ సాధించలేకపోయిన గోపీనాథ్ రాజకీయరంగంలో ఎమ్మెల్యేగా 'హ్యాట్రిక్' సాధించడం విశేషం!

గోపీనాథ్ తండ్రి మాగంటి కృష్ణమూర్తి (Maganti Krishnamurthy) ఆంధ్రప్రాంతం నుండి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డారు. 1963 జూన్ 2వ తేదీన గోపీనాథ్ జన్మించారు. గోపీనాథ్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ లోనే. హైదర్ గూడలో నివాసం ఉండేవారు. ఆయన తల్లి మహానంద కుమారి (Mahananda Kumari). ఆమెకు సినిమాలంటే ఇష్టం ఉండేది. అలా గోపీనాథ్ కు కూడా చిన్నతనంలోనే సినిమాపిచ్చి ఉండేది. హీరో కృష్ణ నటించిన "గూఢచారి 116, మోసగాళ్ళకు మోసగాడు" వంటి యాక్షన్ మూవీస్ చూసి ఆయనపై అభిమానం పెంచుకున్నారు గోపీనాథ్. తన అభిమాన హీరో కృష్ణకు అభిమాన నటుడైన యన్టీఆర్ అంటే తరువాతి రోజుల్లో విపరీతమైన ఆరాధనా భావం పెరిగింది. యన్టీఆర్ నటించిన అనేక పౌరాణిక చిత్రాలను చూసి ఆయనకు జేజేలు కొట్టేవారు గోపీనాథ్. ఆ రోజుల్లో తన మిత్రులతో కలసి గోపీనాథ్ గొడవలు చేయడం గట్రా చేసేవారు. ఆయనకు ఓ బుల్లెట్ ఉండేది. అలాగే ఆయన మిత్రులు కూడా బుల్లెట్స్ కొని అందరూ కలసి తిరిగేవారు. దాంతో గోపీనాథ్ గ్యాంగ్ ను 'బుల్లెట్ గ్యాంగ్' అంటూ పిలిచేవారు జనం. గోపీనాథ్ చదువు మందకొడిగానే సాగిందని చెప్పాలి. శ్రీవేంకటేశ్వర ట్యూటోరియల్స్ ద్వారా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన గోపీనాథ్ తరువాత డిగ్రీ అయిందనిపించారు.

'బుల్లెట్ గ్యాంగ్'తో ర్యాలీ

1983లో యన్.టి.రామారావు (N T Rama Rao) ముఖ్యమంత్రి అయిన తరువాత నుంచీ 'తెలుగుదేశం పార్టీ'పై అభిమానం పెంచుకొని కార్యకర్తగా మారారు. 1984 ఆగస్టులో యన్టీఆర్ ను బర్తరఫ్ చేసినప్పుడు గోపీచంద్ 'బుల్లెట్ గ్యాంగ్'తో ర్యాలీ చేశారు. దాంతో యన్టీఆర్ వీరాభిమాని, తరువాత మంత్రి అయిన శ్రీపతి రాజేశ్వర్ తో అనుబంధం ఏర్పడింది. ఆ పై 1985లో యన్టీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించినప్పుడు కూడా గోపీనాథ్ 'బుల్లెట్ ర్యాలీ' ఓ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలచింది. గోపీనాథ్ 'బుల్లెట్ ర్యాలీ' గురించి తెలిసిన అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్.జి.రామచంద్రన్ సైతం వీరిని చెన్నై పిలిపించుకున్నారు. అక్కడ కూడా గోపీనాథ్ తన గ్యాంగ్ తో బుల్లెట్ ర్యాలీ నిర్వహించడం విశేషం! గోపీనాథ్ చురుకుదనం చూసిన యన్టీఆర్ ఆయనను 'తెలుగుయువత' (Telugu Yuvatha) అధ్యక్షునిగా నియమించారు. 1985 నుండి 1992 వరకు గోపీనాథ్ తెలుగుయువత అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1989లో యన్టీఆర్ 'తెలుగుదేశం పార్టీ' ప్రతిపక్షంలో ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో రామారావును తరచూ కలుసుకుంటూ ఉండేవారు గోపీనాథ్. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే కేసీఆర్ (KCR) తోనూ అనుబంధం ఏర్పడింది. 1987 నుండి 1989 దాకా 'హైదరాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ' (హుడా) (HUDA) డైరెక్టర్ గానూ పనిచేశారు గోపీనాథ్. 1990ల ఆరంభంలో ఖైరతాబాద్ కూడలిలోనూ, సెక్రటేరియట్ సమీపంలోనూ యన్టీఆర్ 'శ్రీక్రిష్ణపాండవీయం'లోని దుర్యోధనుని గెటప్ భారీ కటౌట్స్ ను ఏర్పాటు చేశారు గోపీనాథ్. దాంతో ఒక్కసారిగా గోపీనాథ్ పేరు తెలుగుదేశం పార్టీలో మారుమోగిపోయింది. యన్టీఆర్ కుటుంబసభ్యులతోనూ గోపీనాథ్ కు సత్సంబంధాలు ఉండేవి. అలా రాజకీయాల్లో ఒక్కోమెట్టూ ఎక్కుతూ వచ్చిన గోపీనాథ్ 1995లో 'పాతబస్తీ'తో నిర్మాత అయ్యారు.

తెలుగుదేశం పార్టీనే నమ్ముకొని ఉన్న గోపీనాథ్ కు చంద్రబాబు నాయుడు (Chandra Babu Nayudu) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవిభజన తరువాత జరిగిన ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ తెలుగుదేశం (TDP) అభ్యర్థిగా సీటును ఇచ్చారు. 2014లో జరిగిన ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి మజ్లిస్ పార్టీకి చెందిన నవీన్ యాదవ్ పై తొమ్మిది వేలకు పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు గోపీనాథ్. అలా తొలిసారి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన గోపీనాథ్ కొన్నాళ్ళకు అప్పటి టి.ఆర్.ఎస్. ప్రభుత్వంలోకి జంప్ అయ్యారు. దాంతో ఎందరో తెలుగుదేశం పార్టీ అభిమానులకు దూరమయ్యారు. తరువాత వారందరినీ చేరదీసి ఏ పరిస్థితుల్లో తాను పార్టీ మారవలసి వచ్చిందో వివరించారు. మళ్ళీ తనవాళ్ళను కలుపుకొని ముందుకు సాగిన గోపీనాథ్ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ (TRS) అభ్యర్థిగా పోటీచేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.విష్ణువర్ధన్ రెడ్డిపై పదహారు వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ (BRS) గా మారిన టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. గోపీనాథ్ మూడోసారి ప్రఖ్యాత క్రికెటర్ మహ్మద్ అజరుద్దీన్ పై 16.337 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం అందరినీ ఆశ్చర్యపరచింది. అలా జూబ్లీ హిల్స్ నియోజక వర్గంలో 'హ్యాట్రిక్' సాధించిన తొలి నాయకునిగా గోపీనాథ్ చరిత్రలో నిలిచారు.

గోపీనాథ్ కు భార్య సునీత, కొడుకు వాత్సల్యనాథ్, కూతుళ్ళు దివ్య అక్షరనాగ్, దిశిర ఉన్నారు. తారకరత్న హీరోగా గోపీనాథ్ నిర్మించిన 'భద్రాద్రిరాముడు' చిత్రాన్ని పెద్ద కూతురు దివ్యఅక్షర నాగ్ పేరిటే బ్యానర్ పెట్టి నిర్మించారు. తరువాత తీసిన 'నా స్టైలే వేరు' సినిమాను చిన్నకూతురు దిశిర పేరిట బ్యానర్ ఏర్పాటు చేసి తెరకెక్కించారు. అంతకు ముందు 'ఆర్.కె.ఫిలిమ్స్' పతాకంపై చిత్రాలు నిర్మించారు గోపీనాథ్. ఏది ఏమైనా సినిమారంగంలో అంతగా అలరించలేకపోయిన గోపీనాథ్ రాజకీయరంగంలో అందునా జూబ్లీ హిల్స్ వంటి నియోజకవర్గానికి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషమనే చెప్పాలి.

ALSO READ: OG Movie: ఎట్టకేలకు 'ఓజీ' ని పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ 

Nandamuri Balakrishna: మార్కో డైరెక్టర్ తో జతకట్టిన బాలయ్య.. ?



Updated Date - Jun 08 , 2025 | 08:43 AM