Komalee Prasad: వాటిని నమ్మకండి.. నాపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు
ABN, Publish Date - Jul 02 , 2025 | 01:27 PM
నాపై ప్రచారం జరుగుతున్న అవాస్తవాల్ని నమ్మవద్దని ‘శశివదనే’ మూవీ హీరోయిన్ కోమలి ప్రసాద్ కోరారు.
హిట్ సిరీస్ చిత్రాలతో పాటు ఇటీవల వచ్చిన వెబ్ సిరీస్ టచ్ మీ నాట్ వెబ్ సిరీస్లతో మంచి పేరు తెచ్చుకున్న నటి కోమలి ప్రసాద్ (Komalee Prasad). తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి నటిగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అయితే కోమలి హీరోయిన్గా మూడు నాలుగేండ్ల క్రితం ‘శశివదనే’ అనే సినిమా రూపొందింది. ఆ చిత్రం అనేక అవాంతరాలను దాటుకుని ఇప్పుడు థియేటర్లోకి విడుదలకు రెడీ అయింది. కాగా ఈ సమయంలోనే కొమలి సినిమాలకు గుడ్ బై చెప్పింది అని తన గిక్టర్ వీత్తా కంటిన్యూ చేస్తుందని, ఇకపై అక్కడే పర్మినెంట్ కాబోతుదంటూ వార్తలు వైరల్ అయ్యాయి.
దీంతో సదరు నటి స్పందిస్తూ ఆ వార్తల్ని ఖండిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది..‘అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అయ్యానని, నటనకు పూర్తిగా దూరం అయ్యానంటూ అసత్య ప్రచారాలు, తప్పుదోవ పట్టించే వార్తల్ని ప్రచురిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ రూమర్లను నిజం అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని అందరికీ స్పష్టంగా తెలియజేయాలని అనుకుంటున్నాను. ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఎంతో కష్టపడి ఇప్పటి వరకు సినిమాల్లో కెరీర్ను కొనసాగిస్తూ ఈ స్థాయి వరకు వచ్చాను. ఆ శివుని ఆశీస్సులతో నా కెరీర్ను ముందుకు సాగిస్తున్నాను.
నాలో, నా శ్రేయోభిలాషులలో అనవసరమైన ఆందోళనలను రేకెత్తించేలా ఈ రూమర్లను ప్రచారం చేస్తున్నారు. ఇలా తప్పుదారి పట్టించే సమాచారం వ్యాప్తి చెందకూడదని నేను కోరుకుంటున్నాను. అందుకే ఈ స్పష్టతనిస్తూ పోస్ట్ వేస్తున్నాను. ఆ విధే నన్ను ఈ మార్గంలోకి తీసుకు వచ్చిందని నేను భావిస్తుంటాను. చివరి శ్వాస వరకు నటిగా నా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ ప్రయాణంలో నా వెన్నెంటే ఉన్న నా శ్రేయోభిలాషులందరికీ, నా కంటే నన్ను ఎక్కువగా నమ్మిన వారందరికీ ధన్యవాదాలు. నేను ప్రస్తుతం నా స్క్రిప్ట్లను జాగ్రత్తగా ఎంచుకుంటున్నాను. త్వరలో కొత్త ప్రకటనలతో మీ అందరినీ చాలా గర్వపడేలా చేస్తాను’ అని కోమలి ప్రసాద్ (Komalee Prasad) అన్నారు.