సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Allu Arjun Movie: అట్లీపై కోలీవుడ్ వర్గాల కుట్ర...

ABN, Publish Date - Jun 16 , 2025 | 12:32 PM

అల్లు అర్జున్ తో దర్శకుడు అట్లీ సినిమా చేస్తుండటం కొందరు తమిళ నిర్మాతలకు కంటగింపుగా ఉందని తెలుస్తోంది. తమిళ హీరోలను పక్కన పెట్టి షారుఖ్, అల్లు అర్జున్ తో అతను సినిమా చేయడాన్ని వారు హర్షించలేక పోతున్నారని సమాచారం.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో అట్లీ (Atlee) కూడా ఒకరు. పుష్కర కాలం క్రితం 'రాజా రాణీ' (Raja Rani) తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించాడు అట్లీ. ఆర్య (Arya), జై (Jai), నయనతార (Nayanatara) ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా గ్రాండ్ విక్టరీని అందుకుంది. దీనిని మరో దర్శకుడు మురుగదాస్ (Murugadas) ప్రొడ్యూస్ చేయడం విశేషం. ఆ తర్వాత ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి థాను... అట్లీ డైరెక్షన్ లో విజయ్ (Vijay) హీరోగా 'తెరి' సినిమాను నిర్మించాడు. ఇది కూడా చక్కని విజయాన్ని అందుకుంది. తెలుగులో 'పోలీసోడు' పేరుతో డబ్ అయ్యింది. ఇప్పుడు దీన్నే పలు మార్పులు చేర్పులు చేసి 'ఉస్తాద్ భగత్ సింగ్'గా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో హరీశ్‌ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.


'తెరి' తర్వాత అట్లీ... హీరో విజయ్ తోనే 'మెర్సిల్', 'బిగిల్' చిత్రాలను రూపొందించి తమిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సాధించాడు. సినిమా సినిమాకూ అట్లీ ఊహకందని ఎత్తుకు ఎదగడం పట్ల కోలీవుడ్ వర్గాలు సైతం హర్షం వ్యక్తం చేశాయి. అట్లీతో సినిమా చేస్తే హిట్ గ్యారెంటీ అని ఇటు హీరోలు, అటు నిర్మాతలు నమ్మడం మొదలైంది. అతనితో సినిమా నిర్మించడానికి ప్రొడ్యూసర్స్, నటించడానికి హీరోలు ఆసక్తి చూపుతున్న తరుణంలో అట్లీ ఊహకందని ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఠక్కున బాలీవుడ్ కు వెళ్ళిపోయి... అక్కడ షారుఖ్ ఖాన్ తో 'జవాన్' మూవీని తెరకెక్కించాడు. 'జవాన్' మూవీ ఉత్తరాదిన అఖండ విజయాన్ని అందుకుంది. అట్లీని వెయ్యి కోట్ల సినిమాల దర్శకుడిగా టాప్ లో నిలబెట్టింది. ఇది కోలీవుడ్ వర్గాలకు ఆగ్రహం తెప్పించిందని తెలుస్తోంది. అతనితో సినిమా చేయడానికి పలువురు తమిళ హీరోలు ఆసక్తి చూపుతుంటే వారిని కాదని అట్లీ బాలీవుడ్ లోకి వెళ్లడం, షారూఖ్‌ ను హీరోగా పెట్టి 'జవాన్' చేయడం వారికి నచ్చలేదని అంటున్నారు. ఇక 'జవాన్' సక్సెస్ తర్వాత అయినా... అట్లీ తమిళ హీరోతో, తమిళ చిత్రం చేస్తాడని భావిస్తుంటే... వారిని కాదని ఇప్పుడు అట్లీ... అల్లు అర్జున్ తో మూవీని మొదలు పెట్టాడు. దీంతో అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా కోలీవుడ్ వర్గాల పరిస్థితి ఉందంటున్నారు.

Also Read: Keerthy Suresh: ఓటీటీలో ఉప్పుకప్పురంబు...


నిజానికి 'జవాన్' తర్వాత ఓ ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ అట్లీతో మూవీ నిర్మించడానికి సిద్థపడిందట. అయితే... తమిళ హీరోతోనే ఆ సినిమా చేయాలనే నిబంధనను పెట్టిందట. ఎప్పుడైతే 'పుష్ప -2' గ్రాండ్ విక్టరీ తర్వాత అట్లీ.... అల్లు అర్జున్ తో మూవీ ప్లాన్ చేశాడో సదరు నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే రెండు మూడేళ్ళుగా ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్న అట్లీ వెనకడుగు వేయకుండా సన్ పిక్చర్స్ కు కథ వినిపించాడని, వాళ్ళు అల్లు అర్జున్ కు ఉన్న మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని 'గో హెడ్' అన్నారని తెలుస్తోంది. ఏదో రకంగా అట్లీపై ఒత్తిడి తెచ్చి అతనితో తమిళ హీరోతోనే, తమిళంలోనే సినిమా చేయడానికి అక్కడి కొన్ని శక్తులు గట్టిగా ప్రయత్నిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. వాటికి వెరవకుండా అట్లీ... బన్నీతో చేతులు కలపడాన్ని వాళ్ళు సహించలేకుండా ఉన్నారట. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్ అయితే... కొందరు కోలీవుడ్ నిర్మాతలకు కంటి మీద నిద్ర కరువు అవ్వడం ఖాయమని తెలుస్తోంది.

Also Read: Kannappa: మంచు విష్ణుకు.. త‌ప్ప‌ని క‌న్న‌ప్ప క‌ష్టాలు

Updated Date - Jun 16 , 2025 | 01:35 PM