NTR: యాభై ఏళ్ళ రాముని మించిన రాముడు

ABN , Publish Date - Jun 12 , 2025 | 05:52 PM

ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా 'రాముని మించిన రాముడు'. ఎమ్మెస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై యాభై సంవత్సరాలు పూర్తయ్యింది.

నటరత్న యన్.టి.రామారావు (NTR) అనేక 'రాముడు' టైటిల్స్ మూవీస్ లో నటించారు. ఇక యన్టీఆర్ ద్విపాత్రాభినయం సైతం రికార్డ్ స్థాయిలో సాగింది. రామారావు డ్యుయల్ రోల్ లో రూపొందిన 'రాముని మించిన రాముడు' (Ramuni Minchina Ramudu) చిత్రం 1975 జూన్ 12న విడుదలయింది. ప్రముఖ నటుడు సురేశ్ (Suresh) తండ్రి యమ్మెస్ గోపీనాథ్ (M S Gopinath) దర్శకత్వంలో 'రాముని మించిన రాముడు' రూపొందింది. ఈ చిత్రాన్ని యన్. భక్తవత్సలంతో కలసి గోపీనాథ్ నిర్మించారు. వాణిశ్రీ, శ్రీవిద్య నాయికలుగా నటించిన ఈ చిత్రానికి 1963లో రూపొందిన బెంగాలీ చిత్రం 'ఉత్తరాయణ్' (Uttarayan) ఆధారం. అయితే అంతకుముందు 1961లో దేవానంద్ (Devanand) డ్యుయల్ రోల్ లో వచ్చిన 'హమ్ దోనో' (Hum Dono) కథాంశం కూడా ఇలాగే ఉండడం గమనార్హం!

కథ విషయానికి వస్తే - డాక్టర్ రామును ధనవంతుడైన రాయుడు కూతురు లక్ష్మి ప్రేమిస్తుంది. రాయుడు అవమానించిన కారణంగా రాము మిలిటరీకి వెడతాడు. అక్కడ అచ్చు అతనిలాగే ఉన్న మేజర్ రఘు కలుస్తాడు. యుద్ధంలో రఘు తీవ్రగాయాలకు గురవుతాడు. తాను బ్రతకనని, తన కన్నతల్లిని కాపాడమని రామును పంపిస్తాడు రఘు. రామును చూసి రఘు అని భావించిన తల్లి ఎంతో ఆనందిస్తుంది. అయితే అక్కడ రఘు భార్య ఒకప్పుడు తాను ప్రేమించిన లక్ష్మి అని తెలుస్తుంది. ఆ తరువాత ఏమైందన్నదే కథ!


ఈ చిత్రానికి చలపతిరావు సంగీతం ఎస్సెట్. సి.నారాయణ రెడ్డి, దాశరథి పాటలు పలికించారు. పాటలన్నీ అలరించాయి. అయితే అప్పట్లో తెలుగునాట కలర్ మూవీస్ హవా వీస్తోంది. అంతకు ముందు వచ్చిన యన్టీఆర్ 'సంసారం' కలర్ సినిమా ముందు బ్లాక్ అండ్ వైట్ లో తెరకెక్కిన 'రాముని మించిన రాముడు' నిలవలేక పోయింది. ఇందులో నగేశ్ పాత్ర బాగా ఆకట్టుకుంది. అతనిపై చిత్రీకరించిన "ఇది నా పుట్టినరోజు..." సాంగ్ అలరించింది. "ప్రేమకు నీవే దేవుడవు... రాముని మించిన రాముడవు..." సాంగ్ ఈ నాటికీ సంగీతాభిమానులను పులకింప చేస్తూనే ఉంది. రిపీట్ రన్స్ లో 'రాముని మించిన రాముడు' మంచి ఆదరణ పొందింది.

యమ్.యస్.గోపీనాథ్ 'రాముని మించిన రాముడు'కు ముందు శోభన్ బాబుతో 'జీవితబంధం' అనే సినిమా తీశారు. తరువాత 'మాతృభూమి' అనే చిత్రం రూపొందించారు. ఆ పై "ప్రతీకార" అనే కన్నడ చిత్రం తెరకెక్కించారు. 'రాముని మించిన రాముడు' తరువాత ఏయన్నార్ తో 'మహాత్ముడు' రూపొందించారు గోపీనాథ్. ఆ పై 'తల్లే చల్లని దైవం', కృష్ణతో 'చెప్పింది చేస్తా', శోభన్ బాబుతో 'రాముడు-పరశురాముడు' వంటి చిత్రాలు తెరకెక్కించారు. చిత్రమేమిటంటే యమ్మెస్ గోపీనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించలేక పోయింది. కానీ, గోపీనాథ్ అభిరుచి ఆయన చిత్రాల్లో కనిపించేది.

Also Read: Plane Crash: విమాన ప్రమాదంపై ప్రముఖుల సంతాపం! 

Also Read: Plane Crash - Pawan Kalyan: విమాన ప్రమాదం.. ఏపీ డిప్యూటీ సీఎం స్పందన 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 12 , 2025 | 05:52 PM