సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

RD composed: రెండు తెలుగు చిత్రాలకు ఆర్డీ సంగీతం

ABN, Publish Date - Jun 27 , 2025 | 05:08 PM

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఆర్డీ బర్మన్ బాణీలు ఆబాలగోపాలాన్నీ అలరించాయి. తెలుగువారితోనూ ఆర్డీ అనుబంధం ప్రత్యేకమైనది. జూన్ 27న ఆర్డీ బర్మన్ జయంతి. ఈ సందర్భంగా మ్యూజిక్ తో ఆర్డీ చేసిన మ్యాజిక్ ను గుర్తు చేసుకుందాం.

ఈ యేడాది ఆగస్టు 15తో ఆల్ టైమ్ బాలీవుడ్ హిట్ 'షోలే' యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగానే 'షోలే' ను మోడరన్ టెక్నాలజీతో రూపొందించారు. జూన్ 26న 'షోలే' కొత్త హంగులతో ఇటలీలో ప్రీమియర్ ప్రదర్శితమయింది. ఈ నేపథ్యంలో ఆ చిత్ర సంగీత దర్శకుడు ఆర్డీ బర్మన్ ను, అందులో గబ్బర్ సింగ్ గా నటించిన అంజాద్ ఖాన్ ను యూనిట్ గుర్తు చేసుకున్నారు. 'షోలే' ఘనవిజయంలో ఆర్డీ బాణీల పాత్ర కూడా ఎంతోఉంది. పాటలు, నేపథ్య సంగీతంతో అలరించడమే కాదు - అందులో 'మెహబూబా.' పాట పాడి ఉర్రూతలూగించారు ఆర్డీ.


ఆర్డీ బర్మన్ బాణీలను అనుకరిస్తూ ఆ రోజుల్లో ఎన్నో తెలుగు పాటలు రూపొందాయి. అంతేకాదు, ఆర్డీ స్వరపరచిన హిందీ చిత్రాలను తెలుగులో రీమేక్ చేసినప్పుడు బర్మన్ బాణీలనే యథాతథంగా ఉపయోగించేవారు. అలాంటి ఆర్డీ బర్మన్ తో సంగీతం చేయించాలని ఎందరో తెలుగువారు తపించారు. అయితే జంధ్యాల దర్శకత్వంలో రమేశ్ బాబు, ఖుష్బూ జంటగా రూపొందిన 'చిన్నికృష్ణుడు'లో తొలిసారి ఆర్డీ బర్మన్ స్వరాల్లో తెలుగు పాటలు రూపొంది అలరించాయి.

యావద్భారతాన్నీ తన స్వరకల్పనతో మాయ చేసిన ఆర్డీ బర్మన్ అంటే కశ్మీరం నుండి కన్యాకుమారి దాకా ఎంతోమందికి అభిమానం. రామ్ గోపాల్ వర్మ తన 'అంతం' సినిమాలో ఆర్డీ బర్మన్ తో పాటలకు బాణీలు కట్టించారు. ఈ సినిమా 'ద్రోహి' పేరుతో హిందీలోనూ విడుదలయింది. 'అంతం' చిత్రంలో నాలుగు పాటలకు ఆర్డీ బర్మన్ స్వరాలు సమకూర్చారు. ఓ పాటకు మణిశర్మ, మరో పాటకు కీరవాణి బాణీలు కట్టారు. ఇక మణిశర్మ నేపథ్య సంగీతంతో 'అంతం' తెరకెక్కింది. ఇందులో బర్మన్ బాణీల్లో రూపొందిన నాలుగు పాటలూ సంగీతాభిమానులను విశేషంగా అలరించాయి.


ఎందరో ఆర్డీ వీరాభిమానులు

ఎందరో దక్షిణాది సంగీత దర్శకులు ఆర్డీ బర్మన్ ను స్ఫూర్తిగా తీసుకొని విజయం సాధించారు. ఇక ఆర్డీ బర్మన్ ట్యూన్స్ తో ఆల్ ఇండియాలో అలరించిన ఎన్నో హిందీ చిత్రాలున్నాయి. వెస్ట్రన్ ను మన ఇండియన్ ట్యూన్స్ తో మిక్స్ చేసి ఆర్డీ బర్మన్ చేసిన ప్రయోగాలను ఎవరూ మరచిపోలేరు. అలాంటి ఆర్డీ బర్మన్ సూపర్ డూపర్ హిట్స్ కు కాకుండా 'సనమ్ తేరీ కసమ్, మాసూమ్' వంటి సినిమాలకు ఫిలిమ్ ఫేర్ అవార్డు లభించింది. అలాగే ఆయన మరణం తరువాత '1942- ఎ లవ్ స్టోరీ' కి కూడా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు దక్కింది. ఈ విషయం తెలిసిన తెలుగు సంగీత దర్శకుడు కీరవాణి విచారం వ్యక్తం చేశారు. అంతేకాదు తనకు ఇచ్చిన ఫిలిమ్ ఫేర్ అవార్డ్ ను తాను వెనక్కి తిరిగి ఇచ్చానని ఓ సారి 'పాడుతా తీయగా' కార్యక్రమంలో ఎస్పీ బాలుతో చెప్పారు కీరవాణి. అంతలా ఇతర సంగీత దర్శకులను సైతం ఆకట్టుకున్నారు ఆర్డీ బర్మన్. తన అభిమాన సంగీత దర్శకుడు ఆర్డీ బర్మన్ భార్య అయిన ఆశా భోస్లేతో కీరవాణి 'పవిత్రబంధం' కోసం ఓ పాట పాడించడం విశేషం! అంతకు ముందు కూడా ఆశాభోస్లే కొన్ని తెలుగు పాటలు పాడినా, 'పవిత్రబంధం' పాట ఓ స్పెషల్ అనే చెప్పాలి. ఇలా తెలుగువారితో ఆర్డీ బంధం మరపురానిదిగా నిలచింది.

Also Read: Siddharth: స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సిద్దార్థ్...

Also Read: Manchu Vishnu: ఎట్టకేలకు హిట్ కొట్టిన మంచు విష్ణు

Updated Date - Jun 27 , 2025 | 05:10 PM