Sikandar: పైరసీతో సల్మాన్ చిత్రానికి దాదాపు వందకోట్ల నష్టం
ABN, Publish Date - Jun 17 , 2025 | 03:35 PM
సల్మాన్ ఖాన్ తాజా చిత్రం సికందర్ బాక్సాఫీస్ బరిలో బోల్తా పడింది. అంతేకాదు విడుదలైన మొదటి రోజునే పైరసీ బారిన పడింది.
ఇవాళ స్టార్ హీరోల సినిమాలే కాదు చిన్న హీరోల సినిమాలు సైతం విడుదలైన మొదటి రోజే పైరసీ బారిన పడుతున్నాయి. తమిళ్ రాకర్స్, మూవీరూల్జ్, ఫిల్మీ జిల్లా వంటివి సినిమాలను యద్ధేచ్ఛగా అప్ లోడ్ చేసేస్తున్నాయి. ఇక టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో అయితే పైరసీ వీడియోల లింక్ లను పెట్టి ఫార్వర్డ్ చేసేస్తున్నారు.
ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ (Salman Khan) 'సికిందర్' (Sikandar) సైతం పైరసీ బారిన పడింది. ఈ సినిమాను నిర్మించిన సాజిద్ నడియాద్ వాలా (Sajid Nadiadwala) ఈ రకమైన పైరసీ ద్వారా తమకు ఎంత నష్టం వాటిల్లిందనే దానిని ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఇ.ఎన్.వై) సంస్థతో ఎసెస్ మెంట్ చేయించారు. ఆ సంస్థ డిజిటల్ గానే కాకుండా ఏ యే రకాలుగా 'సికిందర్' సినిమా పైరసీ అయ్యిందో లోతుగా అధ్యయనం చేసింది. పర్టిక్యులర్ గా 'సికిందర్' సినిమా విషయానికే వస్తే... ఈ మూవీ సెన్సార్ కాకముందే పైరసీ అన్నట్టు వారి అధ్యయనంలో తేలింది. సెన్సార్ అయిన సినిమాలో కంటే పైరసీ అయిన మూవీలో చాలా సన్నివేశాలు ఉన్నాయి. నిజానికి సినిమాను సెన్సార్ కు పంపడానికి ముందే మేకర్స్ చాలా వరకూ ట్రిమ్ చేశారు. కాజల్ అగర్వాల్, అంజనీ ధావన్ కు సంబంధించిన అనేక సన్నివేశాలను చివరి నిమిషంలో నిడివిని దృష్టిలో పెట్టుకుని ఎడిటర్ తొలగించాడు. కానీ ఆ సన్నివేశాలు పైరసీ కాపీలో ఉండటం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఎప్పటి లానే సినిమా విడుదలైన తర్వాత థియేటర్ల నుండి కూడా పలు చోట్ల మూవీని పైరసీ చేశారు. ఇలా అన్ని రకాలుగా, అన్ని ఫార్మాట్స్ లోనూ పైరసీకి గురైన అంశాలను బేరీజు వేసి... దీని కారణంగా నిర్మాణ సంస్థకు రూ. 91 కోట్ల నష్టం వాటిల్లిందని తేల్చిచెప్పారు. దాంతో ఈ మొత్తాన్ని రికవర్ చేయాల్సింది చిత్ర నిర్మాత సాజిద్ నడియాద్ వాలా పైరసీ ఇన్యూరెన్స్ క్లయిమ్ చేయబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఈ విషయమై అటు నిర్మాణ సంస్థ, ఇటు ఇన్సూరెన్స్ కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
సహజంగా ఇప్పటి వరకూ పైరసీ అయిన పక్షంలో ఏకపక్షంగా ఆ సినిమాకు ఇంత నష్టం వాటిల్లి ఉండవచ్చు... అంత నష్టం వచ్చి ఉండొచ్చు అనే ఉజ్జాయింపు లెక్కలు వేస్తారు తప్పితే... ఇంత లోతుగా అధ్యయనం చేయడం ఇదే మొదటిసారి బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే... ఈ అధ్యయనం మీద కూడా కొందరు పెదవి విరుస్తున్నారు. సల్మాన్ ఖాన్ గత చిత్రాలకు భిన్నంగా 'సికందర్' మూవీ తొలి రోజున అత్యల్పంగా రూ. 27.5 కోట్లను వసులు చేసింది. ఇక టోటల్ థియేట్రికల్ రన్ రూ. 103.45 కోట్ల గ్రాస్ వచ్చింది. అయితే పైరసీ పరంగా మూవీకి డ్యామేజ్ జరిగి ఉండకపోతే... వీళ్ళు చెబుతున్న లెక్క ప్రకారం మూవీ దాదాపు 200 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి ఉండేది. ఈ మొత్తాన్ని రికవర్ చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీ అంగీకరిస్తుందో లేదో తెలియదు కానీ... ఇలా ఒక సినిమాకు పైరసీ కారణంగా ఇంత నష్టం వచ్చిందని స్పష్టంగా తేల్చి చెప్పడం మాత్రం ఇదే తొలిసారి అని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: The Raja Saab: మేకర్స్ కు షాకిచ్చిన ఆడియో కంపెనీ
Also Read: Kerala Crime Files: కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్2.. ట్రైలర్