అక్టోబర్ నుంచి యంగ్ టైగర్ వేటకు వస్తున్నాడట..
ABN , Publish Date - Aug 31 , 2026 | 07:37 PM
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ‘డ్రాగన్’. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ‘డ్రాగన్’ (Dragon). తొలిసారి వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుండడంతో తారక్ ఫ్యాన్స్తో పాటు సినీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలన్నాయి. ఇక ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్.. ‘దేవర’, ‘వార్-2’ చిత్రాల తర్వాత తారక్ను ఎలాంటి కొత్త లుక్లో చూపించబోతున్నారో ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ స్పష్టం చేసింది. ఈ చిత్రంలో కన్నడ భామ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్, మలయాళ నటుడు బిజు మీనన్, అలాగే ప్రముఖ నటి ఖుష్బు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. నీల్ డార్క్ ఎలివేషన్లకు రవి బస్రూర్ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘డ్రాగన్’ కోసం ఆయన అంతకుమించిన మ్యూజిక్ను ప్లాన్ చేస్తున్నారట. ఇక విషయానికి వస్తే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ఇటీవల ‘డ్రాగన్’ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ భుజానికి చిన్న గాయం కావడం, దానికి శస్త్రచికిత్స జరగడంతో ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే నందమూరి అభిమానులకు శుభవార్త ఏమిటంటే.. తారక్ అక్టోబర్ మొదటి వారంలో పూర్తిగా కోలుకుని మళ్లీ సెట్స్లో జాయిన్ కాబోతున్నారట. ఎన్టీఆర్ రాక కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక భారీ, కీలకమైన షెడ్యూల్ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ లోపు సమయాన్ని వృధా చేయకుండా తారక్ లేని సన్నివేశాలను ప్రశాంత్ నీల్ శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్లతో పాటు, పలు కీలక యాక్షన్ సీన్స్ కూడా ప్లాన్ చేసినట్లు సమాచారం.
ప్రశాంత్ నీల్ సినిమా అనగానే మనకు మొదట గుర్తుకొచ్చేది బ్లాక్, గ్రే షేడ్ ఫ్రేమ్స్. కానీ ‘డ్రాగన్’ విషయంలో ఆయన ఒక సరికొత్త ప్రయోగం చేయబోతున్నారట. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ మొత్తం ఫుల్ కలర్ఫుల్గా ఉండబోతోందని తెలుస్తోంది. ఆ ఫ్లాష్బ్యాక్ సీన్స్లో ఎలాంటి డార్క్ లేదా బ్లాక్ షేడ్ ఫ్రేమ్స్ ఉండవని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు, అలాగే సినీ ప్రేక్షకులకు దర్శకుడు ఒక అద్భుతమైన, సరికొత్త విజువల్ ట్రీట్ అందించబోతున్నారు. అంతేకాకుండా, 1967 నాటి బ్యాక్డ్రాప్లో ఇంటర్నేషనల్ స్కేల్లో సాగే ఈ కథ కోసం శ్రీలంక, ఆఫ్రికా, జోర్డాన్ వంటి విదేశీ లొకేషన్లలో భారీ యాక్షన్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్, ఎన్టీఆర్ గూస్బంప్స్ పర్ఫార్మెన్స్, సరికొత్త కలర్ఫుల్ ఫ్లాష్బ్యాక్ విజువల్స్ చూస్తుంటే ‘డ్రాగన్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ కలర్ఫుల్ ఫ్లాష్బ్యాక్లో ప్రశాంత్ నీల్.. యంగ్ టైగర్ని ఎలా చూపించబోతున్నాడో చూడాలంటే, వచ్చే ఏడాది జూన్ 11వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి:
రాజా రవీంద్రతో నేనే దాడి చేయించుకున్నా: కస్తూరి షాకింగ్ కామెంట్స్
మలయాళ బాక్సాఫీస్.. ‘స్టార్ పవర్’ కాదు.. కంటెంటే కింగ్!
విడదీయాలని చూస్తే రోడ్డుపైనే కొడతాం..: జానీ మాస్టర్ వైఫ్