వరలక్ష్మి శరత్ కుమార్పై ‘పోలీస్ కంప్లైంట్’ దర్శకుడు షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:37 PM
నటి వరలక్ష్మి శరత్ కుమార్ పై ‘పోలీస్ కంప్లైంట్’ దర్శకుడు సంజీవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రెమ్యునరేషన్ కోసం వారి మేనేజర్ టంచన్గా ఫోన్ చేస్తారు కానీ, ప్రమోషన్స్ మాత్రం ఆమె రావడం లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
నటి వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar)పై ‘పోలీస్ కంప్లైంట్’ (Police Complaint) దర్శకుడు సంజీవ్ (Director Sanjeev Megoti) షాకింగ్ కామెంట్స్ చేశారు. రెమ్యునరేషన్ కోసం వారి మేనేజర్ టంచన్గా ఫోన్ చేస్తారు కానీ, ప్రమోషన్స్ విషయానికి వస్తే మాత్రం అసలు స్పందించరు.. అంటూ దర్శకుడు సంజీవ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. హారర్, యాక్షన్, థ్రిల్లర్ అంశాల సమ్మేళనంగా రూపొందిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. వరలక్ష్మి శరత్కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ చిత్రాన్ని ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్పై బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్లో భాగంగా బుధవారం హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించారు.
వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్గా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్లో మాత్రం ఆమె ఎక్కడా కనిపించడం లేదు. బుధవారం జరిగిన మీడియా సమావేశానికి కూడా ఆమె హాజరు కాలేదు. దీంతో దర్శకుడు సంజీవ్, ఆమెను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘వరలక్ష్మి శరత్ కుమార్ మా సినిమాకు ప్రమోషన్స్ పరంగా సపోర్ట్ చేయడం లేదు. ‘పెద్ది’ సినిమాకు రామ్ చరణ్ వంటి స్టార్ హీరో ప్రమోట్ చేసుకుంటున్నారు. 94 ఏళ్ల సింగీతం శ్రీనివాసరావు ఆయన సినిమా ‘సింగ్ గీతం’కు ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. కానీ మా సినిమాలో మెయిన్ లీడ్ పోషించిన వరలక్ష్మి నుంచి మాత్రం మా సినిమాకు ఎలాంటి సపోర్ట్ లేదు.
వరలక్ష్మి శరత్ కుమార్ షూటింగ్ వరకు బాగానే చేస్తారు.. కానీ ప్రమోషన్స్కు రారు. కానీ, రెమ్యునరేషన్ కోసం వారి మేనేజర్ టంచన్గా ఫోన్ చేస్తూ, నిర్మాతల నుంచి వసూలు చేస్తారు. ఇలాంటి సినిమాలకు వరలక్ష్మి శరత్ కుమార్ ప్రమోషన్స్ ఎంతో అవసరం ఉంది. ఇప్పటికైనా ఆమె సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన మాటలపై ఇండస్ట్రీలో చర్చలు నడుస్తున్నాయి. ఇంతకు ముందు నయనతార విషయంలో కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి. కానీ, ఆమె పక్కాగా ప్రమోషన్స్ చేయనని, అందుకు అనుగుణంగానే రెమ్యునరేషన్ ఇవ్వాలని ముందే మాట్లాడుకుంటుందనేలా వార్తలు వచ్చాయి. మరి, వరలక్ష్మి శరత్ కుమార్ ఇలా చేయడం వెనుక కారణం ఏమై ఉంటుందనేది మాత్రం తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
భారతీరాజా ‘సీతాకోకచిలుక’ హ్యాపీ ఎండింగ్కి కారణమిదే: ఏడిద రాజా
భారతీరాజా మృతికి ప్రముఖుల నివాళి
‘పెద్ది’ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ! నార్త్, ఓవర్సీస్లో ఇక తిరుగులేనట్టే!