‘పెద్ది’ పోరాటంలో నేనూ ఒకడినై.. ప్రయాణించా: చిరంజీవి
ABN, Publish Date - Jun 24 , 2026 | 08:59 AM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్బస్టర్ ‘పెద్ది’. 2026 సౌత్ ఇండియా నంబర్ వన్ గ్రాసర్గా నిలిచిన ఈ చిత్ర సక్సెస్ను పురస్కరించుకుని హైదరాబాద్లో ‘పెద్ది మెగా బ్లాక్బస్టర్ ఈవెంట్’ని నిర్వహించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్బస్టర్ ‘పెద్ది’ (Peddi). బుచ్చి బాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే 2026 సౌత్ ఇండియా నంబర్ వన్ గ్రాసర్గా నిలిచిన ఈ చిత్రం.. ఇంకా అన్ని ప్రాంతాల్లో హౌస్ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మంగళవారం హైదరాబాద్లో ‘పెద్ది మెగా బ్లాక్బస్టర్ ఈవెంట్’ (Peddi Blockbuster Event)ని నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, టీమ్ సభ్యులకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ చేతుల మీదుగా షీల్డ్స్ బహుకరించారు.
ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘మా అభిమానుల్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు క్రమశిక్షణలో ఎలాంటి మార్పు లేదు. అదే ఉత్సాహం, అదే ప్రేమతో ఆదరిస్తూ వస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక అభివాదాలు చేస్తున్నాను. నేను ఈ వేడుకకు ఒక అతిథిగా, ఒక సీనియర్ నటుడిగా, సినిమాపై అపారమైన ప్రేమ ఉన్న వ్యక్తిగా వచ్చాను. ఈ సినిమాను విజయవంతం చేసిన ప్రతి ప్రేక్షకుడికి, అభిమానికి, చిత్ర బృందానికి నా ధన్యవాదాలు తెలియజేయడానికే వచ్చాను. ఇలాంటి సినిమాలు పరిశ్రమకు రావాలి. సినీ పరిశ్రమ సుభిక్షంగా ఉండాలి. థియేటర్లు కళకళలాడాలి. ఆ దిశగా ‘పెద్ది’ ఒక గొప్ప విజయంగా నిలిచింది.
ఈ సినిమా చూస్తున్నంతసేపూ నేను ఒక ట్రాన్స్లోకి వెళ్లిపోయిన అనుభూతి కలిగింది. ప్రతి పాత్రతో మమేకమై వారి పోరాటంలో నేనూ ఒకడినై.. ప్రయాణించాను. ఇంత పవర్ఫుల్, ఎమోషనల్, మోటివేషనల్ కథను ఎంచుకుని, దానికి రామ్ చరణ్ న్యాయం చేస్తాడని నమ్మి.. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు బుచ్చిబాబుకు సభాముఖంగా నా హృదయపూర్వక అభినందనలు. ఇది మట్టి మనుషుల కథ. బుచ్చిబాబు కూడా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో ఆ భావోద్వేగాలను అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు. ఈ కథకు ఆయన నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. ఇలాంటి దర్శకుడిని తెలుగు సినీ పరిశ్రమకు అందించిన సుకుమార్కు కూడా నా అభినందనలు. మట్టిలో దాగి ఉన్న మాణిక్యాలను వెలికి తీయగల దార్శనికుడు సుకుమార్. నిర్మాత సతీష్ కిలారు దర్శకుడి విజన్ను ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో తెరపై ఆవిష్కరించారు. ఆయనకు ఈ సందర్భంగా నా ప్రత్యేక అభినందనలు’’ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
నారా లోకేష్తో తనని పోల్చగానే.. రామ్ చరణ్ ఏమన్నారంటే
నెట్ఫ్లిక్స్ ఊపిరి పీల్చుకో.. బాహుబలి టార్చ్బేరర్ వస్తున్నాడు!
పండంటి బిడ్డకు జననం.. నారా రోహిత్, శిరీష దంపతులకు ప్రమోషన్!