NBK 112: అమరావతిలో.. బాలయ్య-కొరటాల శివ సినిమా ప్రారంభం?
ABN , Publish Date - Jun 15 , 2026 | 10:49 AM
ప్రస్తుతం ‘NBK 111’తో బిజీగా ఉన్న నటసింహం బాలకృష్ణ.. తదుపరి స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేయనున్న సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట హాల్చల్ చేస్తోంది.
వయసు పెరుగుతున్నా కొద్దీ నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఎనర్జీ ఏ స్థాయిలో రెట్టింపు అవుతోందో మనం చూస్తూనే ఉన్నాం. బాక్సాఫీస్ దగ్గర వరుస రికార్డులు క్రియేట్ చేస్తూ, కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని వేగంతో బాలయ్య బాబు ఫుల్ స్వింగ్లో దూసుకు పోతున్నారు. అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఆయన.. ఇప్పుడు మరో అదిరిపోయే అప్డేట్తో మన ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'NBK 111' ప్రాజెక్ట్ను శరవేగంగా పూర్తి చేసే పనిలో బాలయ్య బిజీగా ఉన్నారు. రీసెంట్ గా రిలీజైన ఈ మూవీ టీజర్ చూస్తే అభిమానులకు ఓ రేంజ్లో పూనకాలు వస్తున్నాయి. అందులో ఆయన గెటప్, డైలాగ్ డెలివరీ అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ సినిమా షూటింగ్ ఓ పక్క సాగుతుండగానే.. నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి.
ఒక సినిమా సెట్స్పై ఉండగానే మరో సినిమాను లైనప్ చేయడం బాలయ్యకు మొదటి నుంచి అలవాటే. అదే ట్రాక్లో ఇప్పుడు స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారు. మాస్ కి కేరాఫ్ అడ్రస్ అయిన బాలకృష్ణ, కమర్షియల్ అంశాలకు సామాజిక సందేశాన్ని బలంగా జోడించే కొరటాల శివ (Koratala Siva). ఈ ఇద్దరి కలయిక అనగానే ఇండస్ట్రీలో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. వీరిద్దరూ కలిసి ఏ స్థాయిలో మాస్ జాతర చూపించబోతున్నారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే, ఈ సినిమా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు టాలీవుడ్తో పాటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్గా మారింది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ జరగనుందని సమాచారం. అది కూడా నవ్యాంధ్ర రాజధాని అమరావతి సమీపంలోని వెంకటాయపాలెంలో ఉన్న ప్రసిద్ధ టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం ఈ అపురూప ఘట్టానికి వేదిక కానుంది. పవిత్రమైన దైవసన్నిధిలో, అది కూడా ఏపీ రాజధానిలో ఈ ఈవెంట్ను ప్లాన్ చేయడం వెనుక చాలా బలమైన కారణాలే ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
అంతేకాదు, ఈ ముహూర్తం వేడుకకు కేవలం సినిమా వాళ్ళే కాకుండా, నందమూరి, నారా కుటుంబాలకు చెందిన ముఖ్య నేతలు, సన్నిహితులు భారీ ఎత్తున హాజరుకానున్నారట. రాజధాని ప్రాంతంలో ఈ రేంజ్ ఈవెంట్ జరగడం స్థానికుల్లో సైతం కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కొరటాల శివ సినిమాలంటే అందులో కచ్చితంగా ఓ బలమైన సోషల్ ఎలిమెంట్ ఉంటుంది.
బాలయ్య బాబు పవర్ ఫుల్ ఇమేజ్కు సరిపోయేలా, ఆయనలోని మాస్ యాంగిల్ను ఎలివేట్ చేస్తూనే.. సమాజానికి ఆలోచింపజేసే ఒక గొప్ప సందేశాన్ని ఈ చిత్రంలో కొరటాల చూపించబోతున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ టచ్ కూడా ఉండే అవకాశం లేకపోలేదు. మొత్తానికి అటు గోపీచంద్ మలినేని సినిమాతో యాక్షన్ డోస్ ఇస్తూనే, ఇటు కొరటాల శివతో మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్కు శ్రీకారం చుడుతున్న బాలయ్య లైనప్ చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నెల 25న అమరావతిలో జరగబోయే ముహూర్తం వేడుక కోసం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.