Tharun Bhascker: అప్పుడు కుదరలేదు... ఇప్పుడిలా కుదిరింది!
ABN, Publish Date - Jan 22 , 2026 | 12:37 PM
తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బ జంటగా నటిస్తున్న సినిమా 'ఓం శాంతి శాంతి శాంతిః'. ఈ మూవీతో ఎ.ఆర్. సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా మేకింగ్ గురించి సజీవ్ ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు.
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నుండి హైదరాబాద్ వచ్చి, సినిమా దర్శకుడిగా తన సత్తాను చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఎ.ఆర్. సజీవ్ (A.R. Sajeev). యువ దర్శకులు సంకల్ప్ రెడ్డి, '35 చిన్న కథ కాదు' ఫేమ్ నందకిశోర్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన సజీవ్ ఇప్పుడు 'ఓం శాంతి శాంతి శాంతిః' (Om Shanthi Shanthi Shanthihi) తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మలయాళ చిత్రం 'జయ జయ జయ జయహే' (Jaya Jaya Jaya Jayahe) కు ఇది రీమేక్. అయితే స్ట్రయిట్ తెలుగు మూవీ అనే భావన కలిగేలా గోదావరి నేపథ్యంలోకి ఈ కథను మార్చామని, మాతృకలోని పాటలను కాకుండా మన నేటివిటీకి తగ్గట్టుగా తిరిగి బాణీలు సమకూర్చామని దర్శకుడు సజీవ్ చెబుతున్నాడు.
తరుణ్ భాస్కర్ (Tharun Bhascker), ఇషా రెబ్బా (Eesha Rebba) జంటగా నటించిన ఈ సినిమాను సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్ , నవీన్ సనివరపు నిర్మిస్తున్నారు. ఈ నెల 23న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు 30వ తేదీన జనం ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సజీవ్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలియచేశాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత దర్శకత్వ శాఖలో పనిచేయాలని అనుకున్నప్పుడు తరుణ్ భాస్కర్ దగ్గర వర్క్ చేయడానికి ప్రయత్నించాడట. కానీ ఆయన దగ్గర పని చేసే అవకాశం దక్కలేదట. అలాంటిది తాను దర్శకత్వం వహిస్తున్న మొదటి సినిమాకు ఆయన్నే డైరెక్ట్ చేసే అవకాశం రావడం చిత్రంగా అనిపించిందని సజీవ్ తెలిపాడు. తెలంగాణ వాడైన తరుణ్ భాస్కర్ గోదావరి వాసిగా చక్కగా నటించాడని, యాసలో ఎలాంటి తేడా లేకుండా బాగా ప్రాక్టీస్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారని సజీవ్ చెప్పాడు. నిజానికి తాను తయారు చేసుకున్న కథతో దర్శకుడు కావాలని అనుకున్నానని, కానీ '35 చిన్న కథ కాదు' నిర్మాత సృజన్ యరబోలు... మలయాళ సినిమాను రీమేక్ చేయమని కోరగా, అంగీకరించక తప్పలేదని సజీవ్ తెలిపాడు.