భారతీరాజా శైలి ప్రత్యేకమైనది: పవన్ కళ్యాణ్
ABN , Publish Date - Jun 10 , 2026 | 09:32 AM
లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూశారని తెలిసి చింతించానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
లెజెండరీ దర్శకుడు భారతీరాజా (Bharathiraja) కన్నుమూశారని తెలిసి చింతించానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ భారతీరాజా (84).. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ బుధవారం చెన్నైలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ లెజెండరీ డైరెక్టర్కు ప్రముఖులెందరో నివాళులు అర్పిస్తున్నారు. భారతీరాజా మృతికి చింతిస్తూ.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు పవన్ కళ్యాణ్. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో..
‘‘ప్రముఖ దర్శకులు భారతీరాజా కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తమిళ, తెలుగు చిత్రాలపై భారతీరాజా తనదైన ముద్ర వేశారు. గ్రామీణ నేపథ్యం, పల్లె ప్రజల జీవనం, ప్రేమానుబంధాలను, టీనేజర్స్కి ఉండే ఆకర్షణలు లాంటివి చూపించడంలో ఆయన శైలి ప్రత్యేకమైనది. ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’ ఇప్పటికీ చూడదగ్గ విధంగా ఉంటుంది. ఆ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అన్నయ్య చిరంజీవితో ‘ఆరాధన’ చిత్రం రూపొందించారు. అందులో ‘అరె ఏమైంది...’ అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. సున్నితమైన ప్రేమ, సెంటిమెంట్ కథలే కాకుండా ‘ఎర్ర గులాబీలు’, ‘టిక్ టిక్ టిక్’ లాంటి థ్రిల్లర్స్తోనూ ఆయన ప్రేక్షకులను మెప్పించారు. భారతీరాజా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను..’’ అని పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు.
ఇవి కూడా చదవండి:
మెగా హీరోస్ రేంజ్ అది.. మూడు వందల కోట్ల క్లబ్లో ఆ ముగ్గురు
Peddi: గురువు సుకుమార్లా బ్యాలెన్స్ చేయలేకపోయిన బుచ్చి!