సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

VK Naresh: ఏపీలోనూ తమిళనాడు తరహాలో...

ABN, Publish Date - Jul 08 , 2026 | 11:09 AM

సీనియర్ నటుడు నరేశ్‌ ఆంధ్ర ప్రదేశ్‌లో జరుగుతున్న తాజా పరిణామాలపై తీవ్రంగా స్పందించారు. తమిళనాడు తరహాలో ఓ కొత్త రాజకీయ శక్తి రాబోయే ఆంధ్ర ఎన్నికలను శాసిస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.

V.K. Naresh

సీనియర్ నటుడు వి. కె. నరేశ్‌ (V.K. Naresh) ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నా... వాటిని సునిశితంగా పరిశీలిస్తున్నారు. తన మనసులోని అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో విజయ్‌ (Vijay) పార్టీ విజయం సాధించే ఆస్కారం ఉందని నరేశ్‌ ఫలితాలు రాకముందే చెప్పారు. కానీ దానిని ఎవరూ విశ్వసించక పోగా ఆయన్ని తప్పుపడుతూ వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడైతే నరేశ్‌ జోస్యమే నిజమైందో ఆయనది పైచేయిగా మారిపోయింది. దాంతో నరేశ్‌ వ్యాఖ్యలను తేలికగా తీసుకోకూడదనే అభిప్రాయానికి కొందరు నెటిజన్స్ వచ్చారు.

నరేశ్‌ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణాలమాలను గురించి ఎక్స్ లో జూలై 1న ఈ క్రింది విధంగా వ్యాఖ్యానించారు. 'జై భీమ్ పార్టీ అధినేత జడ శ్రవణ్‌, ఆయన బృందం చేపట్టిన అతి మతరాజకీయ ప్రచారం, దానికి అనుసంధానంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు, అరెస్టులు... ఇవన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ అజెండాను మళ్లించే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. ఇందుకు మరో రాజకీయ పార్టీతో కుమ్మక్కై, రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని క్రైస్తవ, దళిత ఓటు బ్యాంకును ఆకర్షించే వ్యూహం అమలు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది ఒక ముందస్తు హెచ్చరికగా భావించాలి. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే, వచ్చే ఎన్నికలు సిద్ధాంతాలకు, ధర్మానికి మధ్య జరిగే పోరాటంగా రాజకీయ రంగంలో కలియుగ మహాభారతంలా మారే అవకాశం ఉంది. గతంలో నేను చేసిన అనేక రాజకీయ అంచనాలు నిజమయ్యాయి. ఈ పరిణామాలను గమనిస్తూ ఉండండి' అని పేర్కొన్నారు.


అయితే దీనిని ఎవరూ పట్టించుకోలేదని, తాను గతంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి చేసిన వ్యాఖ్యల మాదిరే దీనిని నిర్లక్ష్యం చేశారని నరేశ్‌ తాజాగా వాపోయారు. ఆ పాత పోస్ట్ ను తిరిగి జత చేస్తూ, 'ఐదు రోజుల క్రితం నేను ఈ విషయంపై ట్వీట్ చేసినప్పుడు, తమిళనాడు ఎన్నికలపై చేసిన నా అంచనాల మాదిరిగానే చాలామంది దాన్ని తేలికగా తీసుకున్నారు. కానీ ఈరోజు అదే అంశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. దీని వెనుక మత – రాజకీయ కుట్ర ఉందని నేను అప్పుడే స్పష్టంగా చెప్పాను. భారీ షాక్‌కు సిద్ధంగా ఉండండి. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ, వామపక్ష పార్టీలు, ఇతరులు ప్రశ్న రావణ్‌, జడ శ్రావణ్ అండ్ టీమ్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తున్నారు. నేను ఏ రాజకీయ పార్టీకి మద్దతుదారుడిని కాదు. అయితే రాజకీయ పరిణామాలను అధ్యయనం చేసే ఒక రాజకీయ పరిశీలకుడిగా ఈ పరిణామాలను గమనిస్తున్నాను. అందరూ అప్రమత్తంగా ఉండండి. ఇది కేవలం రాష్ట్రానికే పరిమితమయ్యే విషయం కాదు... దేశం మొత్తం దీని పరిణామాలకు సిద్ధంగా ఉండాలి. ఈ విషయాన్ని గమనిస్తూ ఉండండి' అని పేర్కొన్నారు.

గతంలో బీజేపీలో పలు బాధ్యతలను నిర్వర్తించిన నరేశ్‌ అనంతపురం నుంచి ఎన్నికల బరిలో కూడా నిలిచారు. అయితే ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చే పలు పార్టీలు మారారు. కానీ కొంతకాలంగా రాజకీయంగా యాక్టివ్‌గా ఉండటం లేదు. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఆయన తెరపైకి వచ్చి ఆంధ్ర రాజకీయాల గురించి సునిశితమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటే... తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లో నరేశ్‌ పాల్గొనబోతున్నారా? అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం... ఏం జరుగుతుందో!

ఇవి కూడా చదవండి:

‘రామాయణ’.. అంత‌ రేటు తగ్గడానికి కారణం ఏమిటి?

మహేష్ మమ్మల్ని మోసం చేశాడు.. సీక్రెట్ రివీల్ చేసిన మరదలు

Anjali: అతను రాఖీ కట్టినా వదలలేదు


Updated Date - Jul 08 , 2026 | 11:29 AM