సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘జననాయగన్‌’ నిర్మాతకు తమిళనాడు ప్రభుత్వం కీలక బాధ్యత!

ABN, Publish Date - Jun 26 , 2026 | 08:23 PM

కర్ణాటకకు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత వెంకట్ కె. నారాయణ‌కు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతను అప్పగించింది. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Producer Venkat K Narayana and CM Vijay

కర్ణాటకకు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ కెవిఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) నిర్మాత వెంకట్ కె. నారాయణ‌ (Venkat K. Narayana)కు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం (Tamil Nadu Govt) కీలక బాధ్యతను అప్పగించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయ్ టీవీకే ప్రభుత్వం ఆయనని నియమించింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం. సాయి కుమార్ అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ తాత్కాలిక పదవిలో వెంకట్ కె. నారాయణ ఒక సంవత్సరం పాటు కొనసాగుతారని, ఆయన నియామకానికి సంబంధించిన పూర్తి నిబంధనలు, షరతులను త్వరలోనే వెల్లడిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం తెలియజేసింది. ప్రస్తుతం కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో విజయ్ హీరోగా నటించిన ‘జననాయగన్’ (Jana Nayagan) చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమా విడుదల విషయమై.. కొన్నాళ్లుగా కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది. ఇక విజయ్ (Tamil Nadu CM Vijay) ఎన్నికల ప్రచారం మొదలుకుని, గెలిచి ప్రమాణ స్వీకారం చేసే వరకు నిర్మాత వెంకట్ కె. నారాయణ ఆయన వెంటే ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే.


తనతో భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీసి, అది విడుదల కాకపోయినప్పటికీ.. వెన్నంటే ఉండి సహకారం అందించిన నిర్మాతకు సీఎం విజయ్ ఈ రూపంలో కృతజ్ఞత చాటుకున్నారనేలా అంతా అనుకుంటూ ఉన్నారు. మరో వైపు టీవీకే (TVK) ప్రభుత్వంలోని ఈ కీలక నియామకంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డీఎంకే రాజ్యసభ సభ్యుడు పి. విల్సన్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఒక సినిమా నిర్మాతను ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించడం అంటే.. ఆ పదవికి ఉన్న గౌరవం తగ్గిపోతుందని, జాతీయ రాజధానిలో తమిళనాడు రాష్ట్రం నవ్వులపాలు కావాల్సి వస్తుందని ఆయన విమర్శలు గుప్పించారు. ఎంతగా ఎంపిక చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, అది రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి చేయకూడదని ఆయన హితవు పలికారు.


ఇంకా విల్సన్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక వారధిలా ఉంటూ, రాష్ట్ర హక్కులను కాపాడటంలో ఈ ప్రత్యేక ప్రతినిధి పాత్ర ఎంతో కీలకమని ఆయన గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వంతో, కేంద్ర మంత్రులతో సమన్వయం చేసుకోవడం, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలకు సంబంధించిన సమావేశాలను షెడ్యూల్ చేయడం, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఎప్పటికప్పుడు కీలక సమాచారాన్ని రాష్ట్రానికి చేరవేయడం వంటి ఎన్నో బాధ్యతలు ఈ పదవి పరిధిలోకి వస్తాయని వివరించారు. అంతేకాకుండా, పార్లమెంట్ సమావేశాల సమయంలో రాష్ట్ర ఎంపీలకు అవసరమైన పత్రాలు, సమాచారాన్ని అందించి సహాయపడాల్సిన బాధ్యత కూడా ఈ ప్రతినిధికే ఉంటుందని, అంతటి కీలక స్థానంలో అనుభవం లేని వ్యక్తిని నియమించడం సరికాదని విల్సన్ అభిప్రాయపడ్డారు. మరి విల్సన్ కామెంట్స్‌‌పై తమిళనాడు ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

సీఎంకి కాబోయే భార్యనా.. మజాకానా.. 3 కోట్ల నెక్లెస్ తో త్రిష రచ్చ

జక్కన్న షాక్‌ మాములుగా లేదుగా..! హీరోలు ఇక క్యూ కట్టవచ్చు

ఖుష్బూ సుందర్ కుమార్తె పెళ్లిలో చిరు, నాగ్, వెంకీ సందడి!

Updated Date - Jun 26 , 2026 | 08:23 PM