కేంద్రమంత్రి రాజీనామా చేయాలి: నటి జ్యోతిక సంచలన పోస్ట్
ABN, Publish Date - Jul 25 , 2026 | 02:35 PM
విద్యార్థుల సమస్యలు, విద్యావ్యవస్థలో పారదర్శకతపై స్టార్ హీరో సూర్య భార్య, ప్రముఖ నటి జ్యోతిక చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది
విద్యార్థుల సమస్యలు, విద్యావ్యవస్థలో పారదర్శకతపై స్టార్ హీరో సూర్య (Suriya) భార్య, ప్రముఖ నటి జ్యోతిక (Jyothika) చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థలో ఎదురవుతున్న సమస్యలపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆమె సంచలన డిమాండ్ చేశారు. తాను ఎప్పుడూ విద్యార్థుల వైపు, దేశ భవిష్యత్తు వైపు మాత్రమే నిలబడతానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
విద్యావ్యవస్థలో సమగ్ర సంస్కరణలు, బాధ్యతాయుతమైన పాలన అవసరమని పేర్కొన్న జ్యోతిక, హక్కుల కోసం ఉద్యమిస్తున్న నేటి తరం (Gen Z) యువత ధైర్యాన్ని చూసి గర్వపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులను నిర్భయంగా పోరాడేలా ప్రోత్సహిస్తున్న సిజెపి (CJP)కి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అందరం కలిస్తేనే ‘మనం’ భారతదేశమవుతామని నిరూపించారంటూ యువత పోరాటాన్ని కొనియాడారు.
ఈ సందర్భంగా ఒక తల్లిగా తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్, అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్ లాంటి ఆదర్శవంతమైన వ్యక్తుల్లాగే తమ పిల్లలను కూడా పెంచాలని ఆశిస్తున్నట్లు ఎమోషనల్గా వ్యాఖ్యానించారు. ‘జై హింద్’ అంటూ ముగించిన ఈ పవర్ఫుల్ నోట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఒక్క జ్యోతిక మాత్రమే కాదు.. బాలీవుడ్కు చెందిన సెలబ్రిటీలు ఎందరో.. ఈ ఘటనపై రియాక్ట్ అవుతూ.. విద్యార్థులకు సపోర్ట్గా నిలబడుతున్నారు. తప్పు జరిగినప్పుడు, అది తప్పు అని ప్రశ్నించే యువత.. దేశానికి అవసరం అంటూ జెన్ జీకి వారు సెల్యూట్ చేస్తున్నారు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
విద్యార్థుల ఆందోళన.. సీఎం విజయ్కు కనిపించడం లేదా?: దర్శకులు
బాలయ్యకు సర్జరీ.. నారా బ్రహ్మణి ఏం చెప్పారంటే
రామా ఏంటిది.. ప్రమోషన్స్ కోసమే రూ. 375 కోట్లా?