Yash: రాముడి పాత్ర కోసం రణ్బీర్ ఎంతో కష్టపడ్డాడు
ABN, Publish Date - Jul 24 , 2026 | 11:43 AM
రాముడి పాత్రను పోషించడం అంత సులభం కాదు. అది ఎంతో బాధ్యతతో కూడుకున్న పాత్ర. రణ్బీర్ ఈ పాత్ర కోసం అసాధారణంగా శ్రమించాడు.
రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నితీశ్ తివారీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రామాయణ’. నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే గ్లోబల్ స్థాయిలో ప్రమోషన్స్ ప్రారంభించిన చిత్ర బృందం తాజాగా అమెరికాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక శాన్ డియాగో కామిక్-కాన్ 2026 వేడుకల్లో సందడి చేసింది. ఈ కార్యక్రమంలో హీరో రణ్బీర్ కపూర్, రాకింగ్ స్టార్ యశ్, దర్శకుడు నితీశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా పాల్గొని సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. రాముడి పాత్రలో నటిస్తున్న రణ్బీర్ కపూర్పై యశ్ ప్రశంసల వర్షం కురిపించారు.
ఆయన మాట్లాడుతూ "రాముడి పాత్రను పోషించడం అంత సులభం కాదు. అది ఎంతో బాధ్యతతో కూడుకున్న పాత్ర. రణ్బీర్ ఈ పాత్ర కోసం అసాధారణంగా శ్రమించాడు. సినిమా చూసినప్పుడు అతని అంకితభావం ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది. ఇలాంటి మహత్తర ప్రాజెక్ట్ను తెరకెక్కించాలంటే సంకల్పబలం, నమ్మకం చాలా అవసరం. మా టీమ్లో ప్రతి ఒక్కరూ అదే తపనతో పనిచేశారు. అంతేకాదు, ఈ సినిమా ప్రారంభమైన తర్వాత జీవితాన్ని చూసే కోణమే మారిపోయింది. రామాయణం మాకు నటులుగా మాత్రమే కాకుండా వ్యక్తులుగానూ ఎన్నో విలువలు నేర్పింది. మేకప్, కాస్ట్యూమ్స్, లుక్స్ నుంచి విజువల్ ఎఫెక్ట్స్ వరకు ప్రతి అంశంలో అత్యున్నత ప్రమాణాలు పాటించాం. ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉండాలనే లక్ష్యంతో శక్తివంచన లేకుండా కృషి చేశాం" అని యశ్ వెల్లడించారు.
అయితే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రామాయణ’ ట్రైలర్ శుక్రవారం విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, చివరి నిమిషంలో వాయిదా పడింది. ట్రైలర్ను భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా తెలిపారు. అందుకే విడుదల తేదీని మార్చినట్లు వెల్లడించారు. త్వరలోనే ట్రైలర్కు కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది.