Pakeezah: అక్టోబర్లో ఫ్రాన్స్లో రీస్టోర్డ్ వెర్షన్ ప్రీమియర్
ABN , Publish Date - Sep 03 , 2026 | 01:51 PM
మీనాకుమారి నటించిన క్లాసిక్ హిందీ సినిమా 'పాకీజా' రిస్టోర్డ్ వెర్షన్ సిద్థమైంది. అక్టోబర్ లో ఈ సినిమా ప్రీమియర్ షో ఫ్రాన్స్లో జరుగబోతోంది.
భారతీయ సినీ క్లాసిక్స్లో ఒకటైన 'పాకీజా' సినిమాకు దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత రిస్టోర్డ్ వెర్షన్ను రూపొందించారు. రెండేళ్ళ పాటు సాగిన ఈ పునరుద్ధరణ పనులు ఇటీవలే పూర్తయ్యాయి. సంతృప్తికరంగా కాపీ వచ్చిందని నిర్థారించుకున్న తర్వాత అక్టోబర్ మాసంలో ఫ్రాన్స్లోని లియోన్ లో జరుగబోతున్న లూమియర్ ఫెస్టివల్లో దీనిని వరల్డ్ ప్రీమియర్గా ప్రదర్శించబోతున్నారు. అలానే ఆ తర్వాత బీఎఫ్ఐ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శిస్తారు.
'పాకీజా' చిత్రానికి ఓ గొప్ప చరిత్ర ఉంది. ఈ సినిమా నిడివి 153 నిమిషాలు. దీనిని కమల్ అమ్రోహీ దాదాపు 15 పాటు తీశారు. ఇందులో మీనాకుమారి సాహిబ్ జాన్ అనే వేశ్య పాత్ర వేశారు. 1956లో బ్లాక్ అండ్ వైట్ గా మొదలైన ఈ సినిమాను 1958లో ఈస్ట్మన్ కలర్ గా మార్చారు. నటీనటుల మార్పులు, కథలో సరికొత్త చేర్పులు, పెరిగిన నిర్మాణ వ్యం వీటి కారణంగా కమల్ అమ్రోహీ ఈ సినిమా పూర్తి చేయడానికి ఒకటిన్నర దశాబ్దం పట్టింది. 1964లో కమల్ అమ్రోహీ - మీనాకుమారి విడిపోవడంతో చిత్రీకరణ ఆగిపోయింది. ఆ తర్వాత నాలుగేళ్ళకే మీనాకుమారి లివర్ సిరోసిస్ బారిన పడటంతో ఈ సినిమా భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. అయితే సునీల్ దత్, నర్గీస్ ప్రోత్సాహంతో ఆమె తిరిగి షూటింగ్లో పాల్గొన్నారు. అలా అనేకానేక అడ్డంకులను అధిగించి 'పాకీజా' చిత్రం 1972 ఫిబ్రవరి 4న విడుదలైంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే సినిమాటోగ్రాఫర్ జోసెఫ్ విర్షింగ్, సంగీత దర్శకుడు గులామ్ మహ్మద్ కన్నుమూశారు. దాంతో ఇతర సినిమాటోగ్రఫర్ల సాయంతో దీనిని పూర్తి చేశారు. ఇక దీనికి నౌషాద్ నేపథ్య సంగీతం అందించారు. ఈ సినిమా విడుదలైన రెండు నెలలకే మీనాకుమారి మార్చి 31న కన్నుమూశారు.
'పాకీజా' సినిమా రిస్టోరేషన్ ప్రక్రియను కమల్ అమ్రోహీ ఫ్యామిలీ సహకారంతో ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ పూర్తి చేసింది. దశాబ్దాలు క్రితం నాటి ఫిల్మ్ దెబ్బ తినడంతో అతి జాగ్రత్తగా వెలిసిపోయిన రంగులను తిరిగి రిస్టోర్ చేశారు. ప్రింట్పై ఉన్న గీతలను, ఫంగస్ను తొలగించారు. ఈ సినిమాకు సంబంధించిన ఒరిజినల్ స్టిల్స్ సాయంతో ఈ పునరుద్ధరణ ప్రక్రియను చేశామని ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ డైరెక్టర్ శివేంద్ర సింగ్ దుంగార్పూర్ తెలిపారు. ఇందుకోసం రామ్ నార్డ్ ల్యాబ్లో లభించిన ఇంటర్ పాజిటివ్, సినిమాస్కోప్ ప్రింట్తో పాటు, ఎన్.ఎఫ్.డి.సీ, నేషపల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాలో భద్రపర్చిన కలర్ రివర్సల్ ఇంటర్ నెగెటివ్ ను కూడా వినియోగించామని, వాటి సహాయంతో సినిమా అసలు రూపానికి అత్యంత దగ్గరగా తీసుకు రాగలిగామని శివేంద్ర చెప్పారు.
విశేషం ఏమంటే... ఈ సినిమా తొలి ప్రీమియర్ షో కూడా చాలా స్పెషల్ గా జరిగింది. ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్ లో అప్పట్లో ఈ సినిమా రీల్స్ ను పల్లకిలో తీసుకొచ్చారు. కమల్ అమ్రోహీ, మీనాకుమారి సహా పలువరు సినీ ప్రముఖులు ఈ ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యారు. అక్టోబర్లో ఫ్రాన్స్ లో జరిగే రిస్టోర్డ్ వర్షన్ ప్రీమియర్ షోకు సైతం అదే ఆదరణ లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Romanchakam Review: సందీప్ రెడ్డి వంగా.. ‘రోమాంచకం’ మూవీ రివ్యూ
యశ్ని ‘రామాయణ’ ఏం చేస్తుందో..
సినిమాలకు త్రిష గుడ్ బై.. ఆమె చివరి చిత్రం ఇదే