Tollywood: థియేటర్లలో సందడి చేసేవి ఇవే...
ABN , Publish Date - May 29 , 2025 | 04:39 PM
మే నెలాఖరులో ఆడియెన్స్ ను పలకరించడానికి వివిధ భాషలకు చెందిన ఆరు సినిమాలు వస్తున్నాయి. అందులో మూడు దశాబ్దాల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకున్న రాజేంద్ర ప్రసాద్, అర్చన మూవీ 'షష్టిపూర్తి' ఒకటి కావడం విశేషం.
మే 30వ తేదీన తెలుగువారి ముందుకు వైవిధ్య భరిత చిత్రాలే వస్తున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది 'భైరవం' (Bhairavam). తమిళ చిత్రం 'గరుడన్' (Garudan) నుండి బేసిక్ పాయింట్ ను తీసుకుని దర్శకుడు విజయ్ కనకమేడల తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా దీన్ని మలిచాడు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas), మంచు మనోజ్ (Manchu Manoj), నారా రోహిత్ (Nara Rohith) కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాతో దర్శకుడు శంకర్ కుమార్తె అదితి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. కె. కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. దీనితో పాటు మరో మూడు స్ట్రయిట్ తెలుగు సినిమాలు ఈ వీకెండ్ కు వస్తున్నాయి.
రాజేంద్ర ప్రసాద్ (Rajednra Prasad), అర్చన (Archana) అప్పుడెప్పుడో 'లేడీస్ టైలర్'లో కలిసి నటించారు. ఆ తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకు 'షష్టిపూర్తి'లో భార్యభర్తలుగా యాక్ట్ చేశారు. రూపేశ్, ఆకాంక్ష సింగ్ (Akanksha Singh) యువ జంటగా నటించిన ఈ సినిమాకు పవన్ ప్రభ దర్శకుడు. మాస్ట్రో ఇళయరాజా (Ilayaraja) ఈ సినిమాకు సంగీతాన్ని అందించడం విశేషం. విడుదలకు ముందే ఈ సినిమా పాటలకు చక్కని స్పందన లభించింది. తెలుగుదనం గుబాళించే ఈ సినిమా తప్పకుండా విజయాన్ని సాధిస్తుందనే ధీమాను నిర్మాత కూడా అయిన రూపేశ్ వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే... సంగీత దర్శకుడు శశిప్రీతం (Sashi Pritam) చాలా క్రితమే దర్శకత్వం కూడా చేశాడు. అయితే కాస్తంత గ్యాప్ తర్వాత మరోసారి అతను డైరెక్ట్ చేసిన థ్రిల్లర్ మూవీ 'ఎక్స్ రోడ్స్' (X Roads) ఈ నెల 30న వస్తోంది. ఇదే కాకుండా బాలనటుడిగా పలు చిత్రాలలో నటించిన నిఖిల్ దేవాదుల హీరోగా నటిస్తున్న 'ఘటికాచలం' (Ghatikachalam) సినిమా ఈ నెల 31న రాబోతోంది. ఈ ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని అమర్ కామెపల్లి దర్శకత్వంలో ఎం.సి. రాజు నిర్మించారు.
ఈ వీకెండ్ లో రెండు అనువాద చిత్రాలు కూడా జనం ముందుకు వస్తున్నాయి. అందులో ఒకటి 'కరాటే కిడ్: లెజెండ్స్'. జాకీ చాన్, బెన్ వాంగ్తో ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా యాక్షన్ ప్రియులను ఆకట్టుకోవడానికి 30న వస్తోంది. అలానే ఇప్పటికే మలయాళంలో విడుదలైన టోవినో థామస్ యాక్షన్ డ్రామా 'నారివెట్ట'ను తెలుగులో అదే పేరుతో డబ్ చేసి 30న విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే... మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న 'ఖలేజా' (Khaleja) సినిమాను సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 30 రీ-రిలీజ్ చేస్తున్నారు. కానీ ఒక రోజు ముందే ఈ సినిమా ప్రీమియర్ షోస్ ప్రదర్శన ప్రారంభమైంది. మరి ఈ చిత్రాలలో ఏవేవి ప్రేక్షకులను మెప్పిస్తాయో చూడాలి.
Also Read: Yash Vs Ranabir : యాక్షన్ సీన్స్ చిత్రీకరణలో రామాయణం
Also Read: Gaddar Film Awards: గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ విజేతలు వీరే...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి