Gaddar Film Awards: గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ విజేతలు వీరే...
ABN , Publish Date - May 29 , 2025 | 12:00 PM
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రకటనకు శ్రీకారం పడింది. జయసుధ జ్యూరీ ఛైర్మన్ గా ఉన్న 2024 సినిమా అవార్డుల కమిటీ విజేతల జాబితాను ప్రకటించింది.
ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన 'కల్కి 2898 ఎ.డి.'(Kalki 2898 ఎ.డి) చిత్రానికి నాలుగు అవార్డులు దక్కాయి. ప్రధమ ఉత్తమ చిత్రం అవార్డును ఈ సినిమా పొందింది. అలానే ఈ చిత్ర దర్శకుడు నాగ అశ్విన్ (Naga Ashwin) ఉత్తమ దర్శకుడి అవార్డుకు ఎంపికయ్యారు. 'కల్కి 2898 ఎ.డి.' ఆర్ట్ డైరెక్టర్ అద్నితిన్ జిహానీ చౌదరి, కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనా రావ్, అజయ్ కుమార్ కూడా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ కు ఎంపికయ్యారు. 'కల్కి 2898 ఎ.డి.' చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించారు.
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో నాలుగు అవార్డులు అందుకున్న మరో చిత్రం 'లక్కీ భాస్కర్' (Lucky Bhasker). సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా తృతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. అలానే ఈ సినిమాకు స్క్రీన్ ప్లే సమకూర్చిన వెంకీ అట్లూరి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డుకు ఎంపికయ్యారు. లక్కీ భాస్కర్ కు ఎడిటర్ నవీన్ నూలికీ అవార్డు దక్కింది. అలానే ఈ సినిమాలో హీరోగా నటించిన దుల్కర్ సల్మాన్ ను స్పెషల్ జ్యూరీ అవార్డు కు ఎంపిక చేశారు.
నిజాం నవాబు ప్రైవేట్ ఆర్మీ రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా తెలంగాణ పౌరులు చేసిన వీరోచిత పోరాట గాథ నేపథ్యంలో తెరకెక్కిన 'రజాకర్' (Razakar) మూవీ ఎన్విరాన్ మెంట్, హెరిటేజ్, హిస్టరీ కేటగిరిలో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) కు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు లభించింది. బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అవార్డుకు 'రజాకర్' మూవీకి పనిచేసిన నల్ల శ్రీను ఎంపికయ్యారు. అలా ఈ చిత్రానికి మూడు అవార్డులు దక్కాయి.
తెలంగాణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న 'పొట్టేల్' ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన అనన్య నాగళ్ళకు స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది.
నేషనల్ ఇంటిగ్రేషన్, కమ్యూనల్ హార్మొని, సోషల్ అప్ లిఫ్ట్ ఆఫ్ డిప్రస్సెడ్ క్లాసెస్ కేటగిరిలో నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రాళ్ళు' (Committee Kuttollu) అవార్డును గెలుచుకుంది. ఈ సినిమా దర్శకుడు యదు వంశీకి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు అవార్డు దక్కింది. ఉత్తమ బాలల చిత్రం కేటగిరిలో '35 చిన్న కథ కాదు' (35 Chinnakadha Kadu) సినిమా ఎంపికైంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన నివేదా థామస్ ఉత్తమనటిగా ఎంపిక కావడం విశేషం. అలానే ఇందులో బాలనటుడిగా నటించిన మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల స్పెషల్ జ్యూరీ అవార్డును 'మెర్సీ కిల్లింగ్' సినిమాలో నటించిన బేబీ హారికతో కలిసి పంచుకున్నాడు. జి.ఎ.2 బ్యానర్ నుండి వచ్చిన 'ఆయ్' (Aay) సినిమా హోల్ సమ్ ఎంటర్ టైన్ మెంట్ ఫిల్మ్ (డా. ఎం. ప్రభాకర్ రెడ్డి ఉత్తమ ప్రజాదరణ చిత్రం) కేటగిరిలో ఎంపికైంది.
ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) 'పుష్ప -2' (Pushpa -2) చిత్రానికి ఎంపికయ్యారు. అలానే ఈ సినిమాలో 'సూసేకి అగ్గిరవ్వ మాదిరి...' పాట పాడిన శ్రియా ఘోషల్ ఉత్తమ నేపథ్య గాయని అవార్డుకు ఎంపికయ్యింది. ఉత్తమ సహాయనటుడిగా ఎస్. జె. సూర్య (సరిపోదా శనివారం)కు, ఉత్తమ సహాయనటిగా శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బాండ్) చిత్రాలకు ఎంపికయ్యారు. ఉత్తమ నేపథ్య గాయకుడు అవార్డును సిద్ శ్రీరామ్ (ఊరు పేరు భైరవకోన)కు దక్కించుకున్నారు. అందులోని 'నిజమే నే చెబుతున్నా' పాటకు గానూ ఈ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. 'మత్తు వదలరా -2' చిత్రంలో హాస్యాన్ని పండించిన సత్య, వెన్నెల కిశోలకు ఉత్తమ హాస్యనటుడు కేటగిరిలో అవార్డులు దక్కాయి. ఇదే సినిమాలో ర్యాప్ సాంగ్ చేసిన ఫరియా అబ్దుల్లా స్పెషల్ జ్యూరీ అవార్డుకు ఎంపికయ్యింది. ఉత్తమ కథా రచయిత అవార్డును శివ పాలడుగు 'మ్యూజిక్ షాప్' పూర్తి చిత్రానికి పొందారు. ఉత్తమ గీత రచయిత అవార్డును చంద్రబోస్ 'రాజు యాదవ్' చిత్రంలోని పాటకు అందుకోబోతున్నారు. అలానే 'రాజు యాదవ్' చిత్ర నిర్మాతలు ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కళ్ళేపల్లి స్పెషల్ జ్యూరీ అవార్డుకు ఎంపికయ్యారు.
విశ్వక్ సేన్ నటించిన 'గామి' చిత్రం సైతం రెండు అవార్డులకు ఎంపికైంది. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా ఈ చిత్రానికి పనిచేసిన విశ్వనాథ్ రెడ్డి, ఉత్తమ ఆడియోగ్రాఫర్ గా అరవింద్ మీనన్ ఎంపికయ్యారు. 'దేవర' చిత్రంలోని ఆయుధ పూజ చిత్రానికి కొరియోగ్రఫీ అందించిన మాస్టర్ గణేశ్ ఆచార్య బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డును అందుకోబోతున్నారు. బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ అవార్డు 'గ్యాంగ్ స్టర్' చిత్రానికి గానూ కె. చంద్రశేఖర్ రాథోడ్ కు దక్కింది. స్పెషల్ జ్యూరీ అవార్డులను అందుకున్న వారిలో 'క' చిత్ర దర్శక ద్వయం సుజిత్, సందీప్ ఉన్నారు.
తెలుగు సినిమాపై వెలువడిన ఉత్తమ గ్రంథం కేటగిరిలో డా. రెంటాల జయదేవ రచించిన 'తెలుగు సినిమా ఫస్ట్ రీల్' పుస్తకం అవార్డుకు ఎంపికయ్యింది.
గద్దర్ అవార్డులలో ఈసారి ప్రత్యేకంగా ఉర్దు చిత్రానికి సైతం అవార్డు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ ఆ కేటగిరిలో ఏ చిత్రానికి అవార్డు దక్కలేదు. అలానే 2014 నుండి 2023 వరకూ యేడాది ఒక్కో ఉత్తమ చిత్రాన్ని అవార్డుకు ఎంపిక చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ప్రతి యేడాది ఉత్తమ ప్రథమ, ద్వితీయ, తృతీయ చిత్రాలకు అవార్డులు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. మురళీమోహన్ జ్యూరీ ఛైర్మన్ గా ఉన్న ఈ అవార్డులను ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామని దిల్ రాజు తెలిపారు. అలానే గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులతో పాటు ఎన్టీఆర్ జాతీయ అవార్డు, పైడి జయరాజ్ జాతీయ అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు, బి.ఎన్.రెడ్డి, నాగిరెడ్డి - చక్రపాణి, టి.ఎల్. కాంతారావు అవార్డులను కూడా ప్రకటించాల్సి ఉంది. వాటిని కూడా త్వరలో ప్రకటించబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ అవార్డు ప్రదానోత్సవం జూన్ 14న జరుగబోతోంది.