Srimani: సీతారామశాస్త్రి ప్రశంస మరువలేను...
ABN, Publish Date - Sep 15 , 2025 | 03:23 PM
'100 పర్సంట్ లవ్' సినిమాతో గీత రచయితగా పరిచయం అయిన శ్రీమణి పుట్టిన రోజు సందర్భంగా తన మనసులోని భావాలను వెల్లడించారు. పరిపూర్ణ రచయితగా పేరు తెచ్చుకోవాలన్నది తన కోరిక అని అన్నారు.
'100 పర్సెంట్ లవ్' చిత్రంతో తో గీతరచయితగా పరిచయమైన శ్రీమణి తెలుగు సినీ పరిశ్రమలో పాటల రచయితగా తనకంటూ ఓ గుర్తింపు సంపాందించుకున్నారు. ఎన్నో అగ్రశ్రేణి చిత్రాలకు, స్టార్ హీరోల చిత్రాలకు పాటలు రాశారు. అనతికాలంలోనే టాప్ లిరిక్ రైటర్స్ల్లో ఒకరిగా పేరుపొందిన శ్రీమణి పుట్టినరోజు (సెప్టెంబర్ 15) సందర్భంగా మీడియాతో ముచ్చటించిన విశేషాలు...
ఈ పుట్టినరోజుకు ఉన్న ప్రత్యేకత ఏమిటీ?
ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. కాకపోతే నా సాహిత్యపు జర్నీలో మరో మెట్టు ఎక్కాలని... కొత్త అఛీవ్మెంట్ సాధించాలన్నదే నా లక్ష్యం. ఈ రోజే నా లైఫ్ మొదలైంది అనే భావనతో కొత్త కొత్త పనులు చేయాలని, ఆ పనులను పుట్టినరోజు నాడే ఆరంభం కావాలని కోరుకుంటాను.
ఈ సంవత్సరం మీరు రాసిన పాటలు ఎలాంటి సంతృప్తి నిచ్చాయి?
సాహిత్య పరంగా లోతైన సన్నివేశాలకు సాంగ్స్ అందించే అవకాశం నాకు లభించింది. ముఖ్యంగా 'తండేల్'లో బుజ్జితల్లి, హైలెస్సా పాటలతో పాటు 'లక్కీ భాస్కర్' లోని నిజమా కలా, 'ఆయ్' సినిమాలోని పాటలు నాకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఈ పాటల ద్వారా కథలో ఉన్న సన్నివేశం తాలూకా లోతైన భావాన్ని చెప్పడానికి ప్రయత్నించాను. ఇలాంటి పాటలు రాసే అవకాశం రావడం గర్వంగా అనిపిస్తుంది.
పాట రాయడాన్ని ఎలాంటి ఛాలెంజ్ గా తీసుకుంటారు?
నాకు ప్రతి పాటకు ఏదో ఒక ఛాలెంజ్ ఉంటుంది. గత ఐదు సంవత్సరాల కాలంలో సంగీతంతో పాటు సాహిత్యంలో సౌండ్ డిజైనింగ్ మారింది. శబ్ధ సౌందర్యం ఆడియన్స్ను ఆకట్టుకునేలా ఉండాలి. అందుకే నేను ట్రెండ్కు తగ్గట్టుగా, స్టాండర్స్ మిస్ అవ్వకుండా, పాటకు కాలపరిమితి లేకుండా అంటే పదేళ్ల తరువాత కూడా సాహిత్యం ప్రెష్గా అనిపించేలా రాయడానికి ప్రయత్నిస్తుంటాను. ఆ ప్రయత్నంలో భాగంగానే నన్ను నేను మార్చుకుంటాను.
ప్రేమ పాటలు చాలా ఎక్కువగా రాస్తుంటారు. వీటిలో కొత్తదనం ఎలా చూపిస్తారు?
ప్రేమ అనేది యూనివర్శల్. ప్రతి పాటలో, భావంలో కొత్తదనం దొరుకుతుంది. కొత్త ఎక్స్ప్రేషన్ ఉంటుంది. పాట సున్నితపదాలతో అందరికి అర్థమయ్యేలా ఎమోషన్ మిస్ అవ్వకుండా రాయడం, శబ్దంలో అర్థం ఉండేలా చూసుకోవడం చేస్తుంటాను.
సోషల్ మీడియా ట్రెండ్లో పాట ఇన్స్టంట్ హిట్ అవ్వడం అనేది తప్పనిసరి అయ్యింది. మీకు ఇది ఎలాంటి టార్గెట్లా ఉంటుంది?
ఇది రచయితలందరికీ కత్తి మీద సాము లాంటింది. ఇంతకు ముందు పాట రీచ్ అవ్వడానికి టైమ్ పట్టేది. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావంతో వినగానే నచ్చేయాలి అనే ఫీలింగ్లో ఉన్నారు. అందుకే తగ్గట్టుగానే పాటలు ఇన్స్టంట్ చార్ట్బస్టర్లుగా నిలుస్తున్నాయి. అయితే ఇదే పాటను పది సంవత్సరాల తరువాత కూడా సేమ్ ఫీలింగ్ ఉండాలి అనే భావనతో అందరం పాటలు రాస్తున్నాం.
పాట రాయడానికి మీరు కథ మొత్తం వింటారా?
'ఆరడుగుల బుల్లెట్...' పాట తరువాత హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ రాసే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. 'ఎక్కడ ఎక్కడ' సాంగ్ తరువాత ప్రేమ పాటలు అవకాశాలు వచ్చాయి. 'మహర్షి' మూవీలో 'ఇదే కద...' అనే పాటను కథ మొత్తం విని రాశాను. కొన్ని సాంగ్స్ సిట్యుయేషన్తో రాస్తాను.
మీరు ఇప్పటి వరకు రాసిన పాటల్లో గర్వపడే పాట ఏదంటే ఏం చెబుతారు?
నేను గర్వపడే పాటను నేను నిర్ణయించలేను. మనం రాసిన పాట గురించి మనం గౌరవించే వ్యక్తులు, ఆరాధించే వ్యక్తులు గొప్పగా చెప్పినప్పుడు బాగా సంతృప్తి దొరుకుతుంది. నన్ను గేయ రచయితగా పరిచయం చేసిన సుకుమార్ గారు 'గీతా గోవిందం' సినిమాలో వచ్చిందమ్మా పాట గురించి బాగా మెచ్చుకున్నారు. బాగా రాస్తున్నావు అని ఎంకరేజ్ చేశారు. నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి నన్ను అభినందించడం నాకు గొప్పగా అనిపించింది. 'మహర్షి'లోని పాట విని సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి గొప్ప వ్యక్తి అభినందించడం నా జీవితంలో మరిచిపోలేను. ఇలాంటి సమయాల్లో గొప్ప పాటను రాశాననే భావన కలుగుతుంది.
దర్శకత్వం చేసే ఆలోచన ఉందా?
దర్శకత్వం వహించాలనే ఆలోచన లేదు. కానీ పరిపూర్ణ రచయితగా ఎదగాలి అనేది నా బలమైన కోరిక. ఇంతకు ముందు తెలిసిన మిత్రులతో కలిసి కథా చర్చల్లో పాల్గొనేవాడిని. అందుకే దాన్ని ఆచరణలోకి తీసుకువచ్చి సంభాషణలు రాయాలని ఉంది. రచన అంటే నాకు ప్రాణం. సాహిత్యం విలువ పెంచాలి అనేది నా కోరిక.
ప్రస్తుతం మీరు పాటలు అందిస్తున్న చిత్రాలు?
దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఓ తార' చిత్రంతో పాటు సాయి దుర్గా తేజ్ 'సంబరాల ఏటిగట్టు', 'ఇండియా హౌస్' చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాలకు సాహిత్యం అందిస్తున్నాను.
Also Read: Tollywood: టాలీవుడ్కు.. కొత్త కళ
Also Read: BRAT: రంగి రంగి.. నువ్వు లాగమాకు లుంగీ! పాట.. దుమ్ము దులుపుతుందిగా