పీపుల్ స్టార్ వైఖరి మారిందన్న నట్టి కుమార్
ABN , Publish Date - May 31 , 2025 | 06:51 PM
ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్ లపై ఆర్. నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలను నిర్మాత నట్టి కుమార్ ఖండించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ (Kandula Durgesh) లపై ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తి (R. Narayana Murthy) చేసిన వ్యాఖ్యలను సీనియర్ నిర్మాత నట్టి కుమార్ (Natti Kumar) తీవ్రంగా ఖండించారు. పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) సినిమా విడుదలకు సంబంధించి తలెత్తిన థియేటర్ల వివాదం విషయంపై ఆర్. నారాయణమూర్తి శనివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. దీనిపై నట్టికుమార్ స్పందించారు.
నిర్మాత నట్టికుమార్ ఈ అంశంపై మాట్లాడుతూ, 'ఆర్. నారాయణ మూర్తితో నాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. పేదల పక్షాన నిలిచే ఆయన అంటే నాకు మొదట్నుంచి ఎంతో గౌరవం. కానీ గత వైసీపీ ప్రభుత్వ హయం నుంచి ఆయన వైఖరిలో పెద్ద మార్పు వచ్చింది. వైసీపీ వాళ్లు ఏమి అరాచకాలు చేసినా, సినీ పరిశ్రమకు ఎలాంటి మేలు చేయకపోయినా వారికి వత్తాసు పలుకుతూ వస్తుండటం ఆయనలోని మార్పుని ఎవరికైనా ఇట్లే అర్ధమయ్యేలా చేస్తుంది. గత సీఎం జగన్ సినీ పరిశ్రమ కోసం మీటింగ్ పెట్టినప్పుడు... ఆ మీటింగుకు చిరంజీవి, ప్రభాస్ వంటి పలువురు పెద్ద హీరోలు వెళ్లారు. దానికి ఆర్ . నారాయణమూర్తి వెళ్లారు. ఆ రోజు చిరంజీవి వంటి పెద్దలను అవమాన పరచినపుడు నారాయణమూర్తి మౌనంగా ఉన్నారు. ఎప్పట్నుంచో డిమాండ్ ఉన్న చిన్న సినిమాకు ఐదో షో ను నారాయణమూర్తి ఇప్పించలేక పోయారు. జగన్ హయాంలోనూ, కేసీఆర్ హయాంలోనూ ఆయనెప్పుడూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించలేదు' అని చెప్పారు.
'కనీసం మూడు వారాల ముందుగా నోటీసు ఇవ్వకుండా థియేటర్లు బంద్ చేస్తామ'ని ప్రకటించడాన్ని నట్టికుమార్ తప్పు పట్టారు. ఈ నిబంధనలు అన్నీ నారాయణ మూర్తికి తెలుసని, అయితే కార్పొరేట్ శక్తుల కుట్ర కోణంలో నారాయణమూర్తి బందీ అయ్యారని, ఏ శక్తులు ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించాయో తనకు తెలుసని నట్టి వ్యాఖ్యానించారు. వెనకా ముందు తెలుసుకోకుండా, వాస్తవాలను పట్టించుకోకుండా నారాయణ మూర్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను, సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్ లను విమర్శించారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సినిమా టిక్కెట్ రేట్ల కంటే పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు అధికంగా ఉండేవని, అప్పుడు ఆర్. నారాయణమూర్తి కానీ, పోసాని గానీ ఏమీ మాట్లాడలేకపోయారని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ సమస్యలను పరిష్కరిస్తామని అంటుంటే విమర్శిస్తున్నారని నట్టి తెలిపారు. నిజానికి థియేటర్ల బంద్ బ్రహ్మాస్త్రం వంటిదని, కానీ దానిని ప్రయోగించడానికి ఒక పద్థతి ఉంటుందని నట్టి కుమార్ అన్నారు. జగన్ చిన్న సినిమాలకు ఏం చేశారో నారాయణమూర్తి చెప్పాలని, అలానే గుత్తాధిపత్యాన్ని ఎందుకు ఇవాళ ఆయన సమర్థించాల్సి వస్తోందో ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు.
Also Read: Singer: గాయని రజియా సుల్తానా కన్నుమూత
Also Read: Kankhajura web series : కంఖాజుర వెబ్ సీరిస్ రివ్యూ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి