NTR: ఎన్టీఆర్ భావజాలం నేటికీ నిత్యనూతనం, అనుసరణీయం
ABN , Publish Date - Jun 12 , 2025 | 04:46 PM
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన టీ డీ జనార్దన్ బృందం ఇప్పుడు ఆయన నట వజ్రోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానుల కోరిక మేరకు జరుపుతోంది.
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో ఎన్నారై టీడీపీ (TDP), స్థానిక తెలుగు సంఘాల ఉమ్మడి ఆధ్వర్యంలో 'ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం, తెలుగుదేశం మినీ మహానాడు, సిబిఎన్ 75వ జన్మదినం' వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం (Telugu Desam) పార్టీ అభిమానులతో పాటు ఇండియా నుండి వచ్చిన నారా రోహిత్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎన్టీఆర్ (NTR) తనయులు నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna), ఎమ్మెల్యే బోడే ప్రసాద్, టీటీడీ బోర్డు సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి, అశ్విన్ అట్లూరి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు సైతం ఇందులో టి. డి. జనార్థన్ పాల్గొన్నారు. ఈ వేదికపై ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడు పై ఇటీవల వెలువడిన పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ వేడుకలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకోగా, నన్నూరి నర్సిరెడ్డి తనదైన శైలిలో అనర్గళంగా మాట్లాడారు. అశ్విన్ అట్లూరి, నారా రోహిత్ (Nara Rohith) ఆహుతులను ఉద్దేశించి ప్రసంగించారు.
చివరగా టి. డి. జనార్దన్ (T D Janardhan) మాట్లాడుతూ 2023లో ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా తాము ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు వున్న ప్రతిచోట ఎన్. టి. రామారావుకు సంబంధించిన పలు కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆ సందర్భంగా ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితానికి సంబంధించిన పలు గ్రంథాలను వెలువరిస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు తొలుత విజయవాడలో, ఆ తర్వాత హైదరాబాద్ లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఎంతో ఘనంగా నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. గత ఏడాది కాలంగా ఎన్టీఆర్ 75 ఏళ్ల సినీరంగ ప్రస్థానాన్ని పురస్కరించుకొని 'ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు' నిర్వహిస్తున్నామని, గల్ఫ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలోని వివిధ నగరాలలో వున్న ఎన్నారై తెలుగుదేశం విభాగాలు, అక్కడున్న తెలుగు సంఘాలు... ఈ ఉత్సవాల్ని తమ వద్ద కూడా నిర్వహించాలని ఆహ్వానించడంతో వారందరితో కలిసి ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఈ బృహత్తర కార్యక్రమాల్ని నిర్వహిస్తోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్.టి. రామారావు అభిమానుల్ని అనుసంధానం చేయడం లక్ష్యంగా 'గ్లోబల్ నెట్ వర్క్'ను ఏర్పాటు చేశామని, అందుకు అనుగుణంగానే తమ కమిటిని ఇక నుంచి 'ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ గ్లోబల్ నెట్ వర్క్ కమిటీ'గా మార్పు చేసినట్లు తెలిపారు. 2024 ఎన్నికల ముందు ఎన్నారైలు సొంత రాష్ట్రానికొచ్చి తమ శ్రమ, ధనం ఖర్చు చేసి తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి విజయానికి కృషిచేశారని, భవిష్యత్ లో కూడా ఇటువంటి సహకారం అందించాలన్నారు.
ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితానికి సంబంధించి మరుగునపడిన అంశాలు ఇంకా అనేకం ఉన్నాయని వాటన్నింటినీ వెలుగులోకి తేవడానికి తమ కమిటీ కృషిచేస్తోందని, మహోన్నతమైన ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని ఆయన తెలుగు ప్రజలకు చేసిన సేవలను భావితరాలకు తెలియజేయడమే తను కమిటీ లక్ష్యమని టి.డి. జనార్థన్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ భావజాలం, సిద్ధాంతాలు నేటికీ నిత్యనూతనం, అనుసరణీయమని ఆయన తెలిపారు.
Also Read: Kannappa: విమాన ప్రమాదం.. కన్నప్ప టీమ్ షాకింగ్ నిర్ణయం!
Also Read: Rajasimha Tadinada: నరకపు అంచుల దాకా వెళ్లొచ్చా.. ప్లీజ్ ఆదుకోండి...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి