Mad Heroes: ట్రైలర్ లాంచ్ కు గైరుహాజరు...

ABN , Publish Date - Jun 02 , 2025 | 04:58 PM

'మ్యాడ్' హీరోలు నార్నే నితిన్, సంగీత్ శోభన్ ఇప్పుడు ఒకరితో ఒకరు పోటీ పడబోతున్నారు. నితిన్ నటించిన 'శ్రీశ్రీశ్రీ రాజావారు', సంగీత్ నటించిన 'గ్యాంబ్లర్స్' రెండూ జూన్ 6నే విడుదల కాబోతున్నాయి.

ఒకప్పుడు అవకాశాల కోసం అర్రులు చాచిన యంగ్ హీరోస్ కాస్తంత క్రేజ్ వచ్చేసరికీ తమ వైఖరిని మార్చుకుంటారు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న సినిమాలను, కొత్త దర్శకులతో చేసిన వీరు వరుస విజయాలతో మరింత పైకి ఎదగాలని చూస్తుంటారు. నిజానికి ఇందులో తప్పేమీ లేదు. ఎవరైనా ఉన్న చోట నుండి మరింత పైకి చేరుకోవాలని తహతహలాడటం సహజమే. అయితే తమ ప్రారంభ రోజులలో సహాయం చేసిన వ్యక్తులను, సంస్థలను నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదు. రకరకాల కారణాల వల్ల కొందరు యువ కథానాయకులు చేసిన సినిమాల సినిమాల విడుదలలో జాప్యం జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి తొలి చిత్రం కంటే ముందు ఆ తర్వాత నటించిన సినిమాలు విడుదలైపోతుంటాయి. దాంతో సదరు హీరోలు మొదటి చిత్రం విడుదలకు రెడీ అయ్యే సరికీ దానిని ప్రమోట్ చేయడానికి మొహమాట పడుతూ ఉంటారు. ఇప్పుడు నార్నే నితిన్ (Narne Nithin) పరిస్థితి కూడా అలాంటిదే అని ఫిల్మ్ నగర్ లో టాక్.


నార్నే నితిన్ నటించిన తొలి చిత్రం 'శ్రీశ్రీశ్రీ రాజావారు' (Sri Sri Sri Rajavaru). చింతపల్లి రామారావు దీనిని నిర్మించారు. అప్పట్లో నార్నే నితిన్ బావ అయిన ఎన్టీఆర్ (Jr NTR) కూ ఈ కథను చెప్పి, ఆయన గో ఎ హెడ్ అన్న తర్వాతే ఈ సినిమాను నిర్మించామని చింతపల్లి రామారావు చెబుతున్నారు. ఈ సినిమాను 'శతమానం భవతి' మూవీతో జాతీయ పురస్కారం పొందిన దర్శకుడు వేగేశ్న సతీశ్ (Sathish Vegesna) తెరకెక్కించాడు. సంపద ఈ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పుడీ అమ్మాయి విశ్వక్ సేన్ సరసన మరో సినిమాలో అవకాశం అందిపుచ్చుకుంది. కారణం ఏదైనా కానీ 'శ్రీశ్రీశ్రీ రాజావారు' మూవీ అప్పట్లో విడుదలకు నోచుకోలేదు. దీని తర్వాత నార్నే నితిన్ నటించిన 'మ్యాడ్' (Mad), 'ఆయ్' (Aay), 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) సినిమాలు రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇటీవల వచ్చిన 'సింగిల్' మూవీలోనూ నార్నే నితిన్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. అయితే... ఇప్పుడు 'శ్రీశ్రీశ్రీ రాజావారు' మూవీని చింతపల్లి రామారావు రిలీజ్ కు సిద్థం చేశారు. జూన్ 6న ఈ మూవీ రాబోతోంది. అయితే... ఈ సినిమా ప్రమోషన్స్ కు నార్నే నితిన్ దూరంగా ఉంటున్నాడు. ఇటీవల జరిగిన మూవీ ట్రైలర్ లాంచ్ వేడుకలో అతను పాల్గొనలేదు. వేరే షూటింగ్ బిజీలో ఉండి నితిన్ హాజరు కాలేకపోయాడా... లేకపోతే దర్శక నిర్మాతలతో అతనికి పడటం లేదా అనేది తెలియాల్సి ఉంది.


నార్నే నితిన్ బాటలోనే సంగీత్ శోభన్!

ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారులిద్దరూ తండ్రి మరణించిన తర్వాత నటులుగా తెరంగేట్రమ్ చేశాడు. సంతోశ్‌ శోభన్ 'గోల్కొండ హైస్కూల్'లో నటించాడు. ఆ తర్వాత హీరోగానూ కొన్ని సినిమాల్లో చేశాడు. అన్నయ్య అడుగుజాడల్లో నడుస్తూ సంగీత్ కూడా నటుడు అయ్యాడు. సంతోష్ తో కలిసి ఓ వెబ్ సీరిస్ కూడా చేశాడు. అలానే 'మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్' మూవీస్ లో సంగీత్ శోభన్ హీరోగా చేశాడు. అతను నటించిన 'గ్యాంబ్లర్స్' మూవీ జూన్ 6 విడుదల కాబోతోంది. గతంలో విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో 'శ్రీవల్లి' మూవీని నిర్మించిన సునీత, రాజ్ కుమార్ బృందావనం ఈ సినిమాను నిర్మించారు. ఇందులో సంగీత్ శోభన్ తో పాటు రాకింగ్ రాకేశ్‌ కూడా కీలక పాత్ర పోషించాడు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో సంగీత్ శోభన్ పాల్గొనలేదు. దానికి కారణం తెలియరాలేదు. ఏదేమైనా ఈ ఇద్దరు యంగ్ హీరోస్ కు ఇప్పుడు వచ్చిన క్రేజ్ కారణంగా ఆ చిన్న చిత్రాలు జనం ముందుకు వస్తున్నాయి. కానీ వారే వీటి ప్రచారానికి దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. అయితే... జూన్ 6 లోపు జరిగే ఆ యా సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ కైనా వీరు హాజరవుతారో లేదో చూడాలి.

Also Read: Ghaati: రిలీజ్ డేట్ చెప్పేసిన స్వీటీ.. ఎప్పుడొస్తుందంటే.. ?

Also Read: Dhanush: నన్ను, నా సినిమాను ఏం చేయలేరు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 02 , 2025 | 04:59 PM