Dhanush: నన్ను, నా సినిమాను ఏం చేయలేరు

ABN , Publish Date - Jun 02 , 2025 | 04:51 PM

ప్రచారంలో భాగంగా ఇటీవల చెన్నైలో ‘కుబేర’ ఆడియో లాంచ్‌ వేడుకను నిర్వహించారు. ఇందులో ధనుష్‌ పవర్‌ఫుల్‌ స్పీచ్‌తో అభిమానుల్లో జోష్‌ నింపారు.


ధనుష్‌ (Dhanush) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’ (kubera). శేఖర్‌ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో వస్తున్న ఈ  చిత్రంలో కింగ్‌ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. రష్మిక మందన్నా కథానాయిక.  జూన్‌ 20న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రచారంలో భాగంగా ఇటీవల చెన్నైలో ఆడియో లాంచ్‌ వేడుకను నిర్వహించారు. ఇందులో ధనుష్‌ పవర్‌ఫుల్‌ స్పీచ్‌తో అభిమానుల్లో జోష్‌ నింపారు. ఇదే వేదికపై ధనుష్‌ దర్శకత్వంలో నటించాలనుందని అక్కినేని నాగార్జున (Nagarjuna) అన్నారు.

ధనుష్‌ మాట్లాడుతూ ‘‘నటనలో బెస్ట్‌ ఇవ్వడానికే శాయశక్తుల ప్రయత్నం చేస్తుంటాను. నాపై, నా సినిమాలపై ఎంత నెగెటివ్‌ ప్రచారం చేస్తారో చేసుకోండి. నా సినిమాల విడుదలకు ముందు  ఏదో ఒక విషయంలో కుట్రలు చేస్తూనే ఉంటారు. అయినా నన్ను, నా సినిమాను ఏం చేయలేరు. ఎందుకంటే నా అభిమానులు ఎప్పుడూ నాతో ఉన్నారు. ఇలాంటి సర్కస్‌ పనులు మానుకోండి. ఈ వేదిక ముందున్నది నా అభిమానులు మాత్రమే కాదు..  23 సంవత్సరాలుగా ఫ్యాన్స్‌ రూపంలో నా వెంటే ఉన్న నా బలం. మీరెంత నెగెటివి ప్రచారం చేసినా వీరంతా ఎప్పటికీ నాతోనే ఉంటారు’’ అని ధనుష్‌ అన్నారు. అభిమానులను ఉద్దేశించి  "సంతోషం ఎప్పుడూ మనలోనే ఉంటుందని దాన్ని బయట వెతుక్కోవద్దని ధనుష్‌ సూచించారు. ‘‘ఆనందంగా జీవించాలని మనం బలంగా కోరుకోవాలి. అది మనలోనే.. మనతోనే ఉంటుంది. నా వరకూ నేను మంచి భోజనం చేసి సంతోషిస్తాను. అదే నాకు ఆనందం. మన సంతోషాన్ని మించింది ఏమీ ఉండదు’’ అని అన్నారు.
శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ '‘కుబేర’లో ఈ పాత్ర ధనుష్‌ కాకుండా మరెవ్వరూ చేయలేరు. అత్యంత అద్భుతంగా నటించారు. నేషనల్‌ అవార్డు కచ్చితంగా వస్తుందని నాకు బలమైన నమ్మకం ఉంది’’ అని తెలిపారు. 

Updated Date - Jun 02 , 2025 | 04:51 PM