Thug Life: కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీమ్ కోర్ట్ నోటీసులు
ABN, Publish Date - Jun 13 , 2025 | 08:15 PM
కమల్ హాసన్ , మణిరత్నం కాంబోలో వచ్చిన 'థగ్ లైఫ్' చిత్రాన్ని కర్ణాటకలో విడుదల కాకుండా అడ్డుకోవడాన్ని సవాల్ చేస్తూ సుప్రీమ్ కోర్ట్ లో కేసు నమోదైంది, దానిని విచారించిన ధర్మాసనం కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు పంపింది.
ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan)నటించిన 'థగ్ లైఫ్' (Thug Life) చిత్రం జూన్ 5న విడుదలై... పరాజయం పాలైంది. అయితే... ఆ సినిమా ప్రమోషన్స్ సమయంలో కమల్ హాసన్ కన్నడ భాష మీద చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన దుమారం మాత్రం ఇంకా చల్లారలేదు. మహేశ్ రెడ్డి (Mahesh Reddy) అనే వ్యక్తి కర్నాటకలో ఈ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవడంపై సుప్రీం కోర్టు లో పిల్ వేశారు. దానిని శుక్రవారం విచారించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, మన్మోహన్ తో కూడిన ధర్మాసనం కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు పంపింది.
సి.బి.ఎఫ్.సి. (CBFC) సర్టిఫికెట్ పొందిన సినిమాను థియేటర్లలో విడుదల కాకుండా అడ్డుకోవడాన్ని ప్రశ్నిస్తూ ఈ పిల్ సుప్రీమ్ కోర్ట్ లో దాఖలైంది. చెన్నయ్ (Chennai) లో జరిగిన 'థగ్ లైఫ్' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో 'కన్నడ భాష తమిళం నుండే పుట్టింద'ని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. ఆ వేదిక మీద శివరాజ్ కుమార్ (Sivaraj Kumar) కూడా ఉన్నారు. అయితే అప్పుడు ఆయన ఆ మాటలను ఖండించలేదు. మౌనంగా ఉండిపోయారు. దక్షిణాది భాషలకు ద్రవిడం మూలమని కొందరు అంగీకరిస్తారు. కానీ తమ భాష గొప్పతనాన్ని చెప్పుకోవడానికి కమల్ హాసన్ కన్నడ భాషను తక్కువ చేసి మాట్లాడారని కన్నడ భాషా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ తర్వాత కూడా కమల్ హాసన్ క్షమాపణలు చెప్పకపోగా, తన మాటలను సమర్థించుకున్నారు. తన మాటలను సరిగా అర్థం చేసుకోలేదని చెప్పారు. దాంతో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దీన్ని సీరియస్ గా తీసుకుని ఆ సినిమాను కర్ణాటకలో విడుదల చేయకూడదని నిర్ణయించింది. ఎవరైనా 'థగ్ లైఫ్'ను విడుదల చేస్తే థియేటర్లలలో ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించింది.
కర్ణాటక హైకోర్ట్ సైతం కమల్ హాసన్ క్షమాపణలు చెప్పి ఉంటే ఇక్కడ వరకూ విషయం వచ్చేది కాదని వ్యాఖ్యానించింది. అయినా కమల్ ససేమిరా అన్నారు. కర్ణాటకలో తమ చిత్రాన్ని విడుదల చేయనని తెగేసి చెప్పారు. దీనిపై సుప్రీమ్ కోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు కాగా... కొందరు వ్యక్తులు, కొన్ని సంఘాలు బెదిరించినంత మాత్రాన ప్రభుత్వం వాటికి తలవొగ్గి సినిమా విడుదలను ఎలా అడ్డుకుంటుందని, వ్యక్తి స్వేచ్ఛను ఎలా హరిస్తుందని ప్రశ్నించింది. ఈ విషయమై సమాధానం చెప్పాల్సిందిగా కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి, కేసును జూన్ 17కు వాయిదా వేసింది. మొత్తం మీద 'థగ్ లైఫ్' సినిమా గురించి అది విడుదలైన రెండు మూడు రోజులకే జనాలు మాట్లాడుకోవడం మానేశారు. కానీ కోర్టు కేసుల కారణంగా అది ఇంకా వార్తలలో నానుతూనే ఉంది.
Also Read: Prabhas: రాజాసాబ్కు కష్టం.. టీమ్ హెచ్చరిక
Also Read: Kantara: Chapter 1: వరుసగా ముగ్గురు మరణం.. అసలు ఏం జరుగుతోంది..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి