Rishab Sheetty: ఫిల్మ్ యూనివర్స్ గా మారుతున్న 'కాంతార'
ABN , Publish Date - Jun 03 , 2025 | 12:59 PM
రిషభ్ శెట్టికి జాతీయ అవార్డును తెచ్చిపెట్టిన సినిమా 'కాంతార'. ఇప్పటికే ఆ మూవీ ప్రీక్వెల్ ఒకటి తెరకెక్కుతోంది. దీని తర్వాత కూడా ఓ సినిమా ఈ ఫ్రాంచైజ్ లో రాబోతోందని తెలుస్తోంది.
మూడేళ్ళ క్రితం 2022లో వచ్చిన 'కాంతార' (Kanthara) సినిమా మరోసారి కన్నడ చిత్రసీమ గర్వపడేలా చేసింది. జాతీయ స్థాయిలో ఒకేసారి విడుదల కాకపోయినా... దశల వారీగా వివిధ భాషల్లో డబ్ అయ్యి ఇది జనం ముందుకు వెళ్ళింది. అంతే కాదు... ఈ చిత్ర అఖండ విజయాన్ని అందుకుని ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి (Rishab Shetty) కి జాతీయ పురస్కారాన్ని అందించింది. 'కాంతార' సినిమా కూడా బెస్ట్ మూవీగా ఎంపికైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దానికి ప్రీక్వెల్ గా 'కాంతార : చాప్టర్ 1' రాబోతోంది. సప్తమి గౌడ (Sapthami Gouda), కిశోర్ (Kishore), అచ్యుత్ కుమార్ కీలక పాత్రలు పోషించిన 'కాంతార'లో భూత కోలా సంప్రదాయాన్ని, ప్రకృతితో సంఘర్షించకుండా నేచర్ ఫ్రెండ్లీగా ఉండాలని 'కాంతార'లో చూపించారు. ఈ సినిమా దాదాపు 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందన్నది ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. దీంతో ఇప్పుడీ ప్రీక్వెల్ ను తెరకెక్కిస్తున్న మేకర్స్ అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా దీనిని విడుదల చేయబోతున్నారు. కదంబ రాజవంశంకు చెందిన ఆసక్తికరమైన కథను రిషబ్ శెట్టి తెరెక్కిస్తున్నాడు. ఇందులో రిషబ్ నాగ సాధువుగా నటిస్తున్నాడని, అతీంద్రియ శక్తులను మానవ కళ్యాణం కోసం ఉపయోగించే వ్యక్తిగా తెర మీద కనిపిస్తాడని అంటున్నారు.
ఇదే సమయంలో చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఈ ఫ్రాంచైజ్ ను మరింత విస్తరించే ఆలోచన చేస్తోందట. ఒకవేళ కుదిరితే రిషబ్ శెట్టి దర్శకత్వంలో లేదా వేరెవరి దర్శకత్వంలో అయినా 'కాంతార' మూడో భాగాన్ని తీయాలని అనుకుంటున్నారట. 'కాంతార చాప్టర్ 1' కోసం రిషబ్ శెట్టి, కలరిపయట్టు, కత్తి సాము, గుర్రపు స్వారీ వంటివి నేర్చుకుని కెమెరా ముందుకు వచ్చాడు. మరి రేపు 'కాంతార' మూడో భాగం కోసం ఏమేమి చేస్తాడో చూడాలి.
Also Read: Actress Rekha: మరోసారి జనం ముందుకు 'ఉమ్రావ్ జాన్'
Also Read: Raja Saab: ప్రభాస్ రాజా సాబ్ అప్డేట్ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్ ను ఆపడం కష్టమే!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి