M. S. Viswanathan: సంగీత ప్రియులను అలరించిన స్వర విన్యాసం
ABN, Publish Date - Jun 25 , 2025 | 10:42 AM
ప్రముఖ సంగీత దర్శకులు ఎమ్మెస్ విశ్వనాథన్ కు తెలుగు చిత్రసీమతో ప్రత్యేక అనుబంధం ఉంది. అంతేకాదు.. ఎన్టీఆర్ నటించిన పలు చిత్రాలకూ ఆయన మధురమైన సంగీతాన్ని అందించారు.
తెలుగువారిని విశేషంగా అలరించిన పరభాషా సంగీత దర్శకుల్లో ఎమ్మెస్ విశ్వనాథన్ (MS Viswanathan) స్థానం ప్రత్యేకమైనది. మహానటుడు ఎన్టీఆర్ (NTR) నటించిన పలు చిత్రాలకు ఎమ్మెస్ విశ్వనాథన్ స్వరాలు సమకూర్చారు. జూన్ 24న ఆయన జయంతి. ఈ సందర్భంగా తెలుగు సినిమాతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుందాం.
యమ్మెస్ విశ్వనాథన్ ఈ పేరులోనే ఓ సమ్మోహనం ఉందని అంటారు సంగీతాభిమానులు. దాదాపు మూడు తరాల ప్రేక్షకులను తన బాణీలతో మురిపించారు ఎమ్మెస్. ఆరంభంలో మిత్రుడు రామ్మూర్తి (Rammurthy) తో కలసి ఆయన పంచిన మధురామృతాన్ని చవిచూసిన వారు ఆ స్వరవిన్యాసాలను మరచిపోలేరు. విశ్వనాథన్ - రామ్మూర్తి స్వరకల్పనలో రూపొందిన పాటలు ఈ నాటికీ అలరిస్తూనే ఉన్నాయి. 2012లో విశ్వనాథన్ - రామ్మూర్తి సంగీతద్వయాన్ని అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (Jayalalitha) 'తిరై ఇసై చక్రవర్తి' అనే టైటిల్ తో గౌరవించారు. అంతేకాదు 60 బంగారు కాసులు, ఓ కారును కూడా వారికి బహూకరించారు జయలలిత.. నవతరం సంగీతాభిమానులు సైతం విశ్వనాథన్- రామ్మూర్తి వరుసలను విశేషంగా అభిమానిస్తూ ఉండడం మరింత విశేషం!
దాదాపు పదిహేనేళ్ళు అన్యోన్యంగా సాగిన రామ్మూర్తి- విశ్వనాథన్ మైత్రీబంధం 1965లో విడిపోయింది. ఎవరికి వారు సొంతగా స్వరకల్పన చేస్తూ సాగారు. విశ్వనాథన్ స్థాయిలో రామ్మూర్తి సోలోగా అలరించలేక పోయారు. తెలుగు , తమిళ భాషల్లో విశ్వనాథన్ బాణీలు జనాన్ని ఓ ఊపు ఊపేశాయి. కె.బాలచందర్ సినిమాలకు విశ్వనాథన్ సమకూర్చిన సంగీతం మరపురాని మధురం పంచింది.
తెలుగులో ఎంతోమంది దర్శకులు విశ్వనాథన్ స్వరాలతో సాగారు. తెలుగునాట నటరత్న యన్టీఆర్ తో ఎమ్మెస్ విశ్వనాథన్ బంధం అపురూపమైనది. విశ్వనాథన్- రామ్మూర్తి తమ గురువు సి.ఆర్.సుబ్బురామన్ కు చేదోడు వాదోడుగా ఉంటూ సాగారు. అలా వారు తొలిసారి నేపథ్యం సమకూర్చిన సినిమా యన్టీఆర్ హీరోగా రూపొందిన 'అమ్మలక్కలు'. ఆ పై యన్టీఆర్ కథానాయకునిగా తెరకెక్కిన అనేక చిత్రాలకు ఇద్దరూ స్వరకల్పన చేశారు. వారిద్దరూ చివరిసారిగా పనిచేసిన తెలుగు చిత్రం యన్టీఆర్ 'ఆడబ్రతుకు'. ఇక సోలోగానూ యన్టీఆర్ తో విశ్వనాథన్ కొన్నిచిత్రాలకు పనిచేశారు. యన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన చివరి చిత్రం 'సమ్రాట్ అశోక'కు కూడా విశ్వనాథన్ సంగీతం సమకూర్చడం విశేషం! పదేళ్ళ క్రితం జూలై 14, 2015న ఎమ్మెస్ విశ్వనాథన్ తుది శ్వాస విడిచారు. దశాబ్దాలపాటు పండిత పామరులను తన స్వరాలతో ఓలలాడించిన ఎమ్మెస్ విశ్వనాథన్ ను తెలుగు సినీ అభిమానులు ఎప్పటికీ మరువలేరు.
Also Read: Movies In Tv: బుధవారం, జూన్ 25.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
Also Read: Samantha: సమంత సెకండ్ హ్యాండ్ కామెంట్స్.. చాలా బాధపడిందన్న డిజైనర్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి