Zubeen Garg: జుబీన్ గార్గ్కు హీరోయిన్ భైరవి నివాళి
ABN , Publish Date - Sep 24 , 2025 | 05:51 PM
లెజెండరీ సింగర్ జుబీన్ గార్గ్ తెలుగులోనూ పలు చిత్రాలకు పాటలు పాడారు. ఇటీవల సింగపూర్ లో ప్రమాదవశాత్తు కన్నుమూసిన ఆయనకు హైదరాబాద్ లో ఘన నివాళులు అర్పించారు.
సింగపూర్లో స్కూబా డైవింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన భారతీయ లెజెండరీ సింగర్ జుబీన్ గార్గ్ (Zubeen Garg) సంతాప సభ హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగింది. ఈ సందర్భంగా హీరోయిన్ భైరవి అర్ద్య డేకా (Bhairavi Ardya Deka) ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. తెలుగుతో పాటు 40కి పైగా భాషల్లో 38 వేలకు పైగా పాటలు పాడి కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్న అరుదైన ప్రతిభావంతుడు జుబీన్ గార్గ్ ఆకస్మిక మరణం పట్ల భైరవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'భారతీయ చిత్ర పరిశ్రమ ఒక గొప్ప గాయకుడిని కోల్పోయింది. ఇది సినీ అభిమానులకు తీరని లోటు. జుబీన్ మన కాలంలోని అత్యుత్తమ గాయకుల్లో ఒకరు. ఆయన కేవలం కళాకారుడే కాదు, పేదలకు చేయూతనిచ్చిన మహానుభావుడు కూడా. అస్సాంలో ప్రజలు ఆయనను దేవుడిలా ఆరాధిస్తారు' అని తెలిపింది. జుబీన్ గార్గ్ సంగీత రంగానికి చేసిన సేవలను రాబోయే తరాలకు తెలియచేయడానికి వీలుగా ప్రత్యేక స్మారక ట్రస్ట్ స్థాపనకు భూమిని కేటాయించినందుకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himantha Biswa Sharma) కు భైరవి కృతజ్ఞతలు తెలిపారు.
జుబీన్ గార్గ్ తెలుగులో కూడా గుర్తుండిపోయే పాటలు పాడారు. హీరో నితిన్ (Nitin) నటించిన 'టక్కరి' (Takkari) లోని 'యేలే యేలే', 'విక్టరీ' సినిమాలోని ‘ఓ బ్యాచిలర్’, రామ్ పోతినేని (Ram Pothineni) 'మస్కా' మూవీలోని ‘గుండె గోదారిలా’ వంటి పాటలను పాడి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఈ పాటలను పాడే అవకాశం జుబీన్ కు దివంగత సంగీత దర్శకుడు చక్రి (Chakri) ఇచ్చారు.
Also Read: Rashmika Mandanna: అయ్యా.. అమ్మడిని కొట్టేవారు టాలీవుడ్ లోనే లేరా
Also Read: OG: పవన్ కళ్యాణ్.. 'ఓజీ'లో సుహాస్