Amitabh Bachchan: షోలే రిటర్న్స్....
ABN, Publish Date - Jun 23 , 2025 | 03:09 PM
భారతీయ సినిమాలో మైలురాళ్ళుగా నిలిచాయి ఎన్నో చిత్రాలు. వాటిలో 'షోలే' స్థానం ప్రత్యేకమైనది. ఈ యేడాదితో 'షోలే' యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా 'షోలే'ను మోడరన్ టెక్నాలజీని ఉపయోగించి రీస్టోరేషన్ చేశారు. ఈ నెల 27న 'షోలే' ఆధునిక హంగులతో ఇటలీలో ప్రీమియర్ షో పడనుంది.
'షోలే' (Sholay) సినిమాలో టాప్ స్టార్స్ నటించారు. ఆ సినిమాతో స్టార్ డమ్ చూసిన వారూ ఉన్నారు. అయితే వారందరి కన్నా మిన్నగా 'షోలే' మూవీకే ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉండడం విశేషం. ఈ సినిమాను ఏ ఫార్మాట్ లో రూపొందించినా చూసి ఆనందించారు అభిమానులు. ప్రస్తుతం మోడరన్ టెక్నాలజీని ఉపయోగిస్తూ 'షోలే'ను రీస్టోరేషన్ చేశారు. నిజానికి ఈ చిత్రాన్ని 35 ఎమ్.ఎమ్. కెమెరాతో రూపొందించారు. తరువాత కొన్ని థియేటర్లలో 70 ఎమ్.ఎమ్.లో ప్రదర్శించారు. మరికొన్ని చోట్ల లెన్స్ ఉపయోగించి సినిమాస్కోప్ లోనూ ఆడించారు. దాదాపు ఈ సినిమా 20 యేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్ కట్ వర్షన్ దూరదర్శన్ లో ప్రదర్శించినప్పుడు కూడా అభిమానులు విశేషంగా తిలకించారు. కొన్నేళ్ళ క్రితం 'షోలే'ను 3డి ఫార్మాట్ లోనూ అందించారు. ఇలా పలు మార్లు పలు హంగులతో సాగిన 'షోలే' ఒరిజినల్ నెగటివ్ పాడయి పోయింది.దాంతో ముంబైలో అందుబాటులో ఉన్న 'షోలే' కాపీని, బ్రిటిష్ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో భద్రపరచిన కాపీని జోడించి దానితోనే మోడరన్ టెక్నాలజీని ఉపయోగిస్తూ 'షోలే'ను రీస్టోరేషన్ చేశారు. ఈ ప్రింట్ ను జూన్ 27వ తేదీన ఇటలీలోని ప్లాజా మేగోర్ లో ప్రదర్శించనున్నారు. యాభై ఏళ్ళ తరువాత ప్రీమియర్ షో గా 'షోలే' ప్రదర్శితమవ్వడమే కాదు, ఓ చరిత్రగా నిలచిపోతుందని మేకర్స్ అంటున్నారు.
హైదరాబాద్ లో 'షోలే' రికార్డ్....
'షోలే' చిత్రం 1975 ఆగస్టు 15వ తేదీన విడుదలయింది. అంటే ఈ యేడాదితో ఈ సినిమా యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటోందన్న మాట. 'షోలే' రిలీజ్ అయిన సమయంలో ఈ సినిమాలోని కథ, కథనాన్ని విమర్శకులు చీల్చి చెండాడారు. అయితే చిత్రదర్శకుడు రమేశ్ సిప్పీ, 'షోలే'ను నిర్మించిన ఆయన తండ్రి జి.పి.సిప్పీ మాత్రం తప్పకుండా తమ చిత్రం ఘనవిజయం సాధిస్తుందన్న విశ్వాసంతో ఉన్నారు. ఓ పదిహేను రోజులు పోయిన తరువాత నుంచీ 'షోలే' హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ కావడం మొదలెట్టింది. అలా ఎన్నో కేంద్రాలలో వందరోజులు, రజతోత్సవం, స్వర్ణోత్సవం చూసింది 'షోలే'. హైదరాబాద్ లో యన్టీఆర్ సొంత థియేటర్ 'రామకృష్ణ 70 ఎమ్.ఎమ్.'లో ఈ సినిమా దాదాపు 76 వారాల పాటు ప్రదర్శితమయింది. హైదరాబాద్ లో ప్లాటినమ్ జూబ్లీ చూసిన తొలి చిత్రంగా 'షోలే' నిలచింది.
'షోలే' సినిమాను తలచుకోగానే పలు పాత్రలు మనకళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి. ముఖ్యంగా విలన్ గబ్బర్ సింగ్ (Gabbar Singh) పాత్ర మరపురానిది. 'షోలే' చూసి గబ్బర్ సింగ్ డైలాగ్స్ భట్టీయం వేసి ఆనందించిన వారెందరో ఉన్నారు. ఆ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అంతెందుకు 2012లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా రూపొందిన 'గబ్బర్ సింగ్'కు ఆ టైటిల్ పెట్టుకున్నందుకు 'షోలే' మేకర్స్ కు రాయల్టీ చెల్లించారు. దీనిని బట్టే గబ్బర్ సింగ్ పాత్ర ఎంతలా జనం మదిలో నిలచిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇందులో హీరోలుగా నటించిన వీరు, జై పాత్రల పేర్లు కూడా జనాన్ని మురిపించాయి. ఆ రోజుల్లో ఓ 'షోలే' అభిమానికి మగ కవలలు పుడితే వారికి వీరు, జై అని నామకరణం చేశారు. దేశవ్యాప్తంగా వందకు పైగా కేంద్రాలలో శతదినోత్సవం చూసిన తొలి చిత్రంగా 'షోలే' హిస్టరీ క్రియేట్ చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే 'షోలే' పలు విశేషాలకు నెలవుగా నిలచింది. ఇక రీస్టోరేషన్ తో మోడరన్ హంగులతో రూపొందిన 'షోలే' ఇటలీ ప్రీమియర్ తరువాత భారత దేశంలో సైతం ఆగస్ట్ 15న 50 యేళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. మరి గోల్డెన్ జూబ్లీ ఇయర్ లో షోలేకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూద్దాం.
Also Read: Janaki vs State of Kerala: ఆ పాత్రకు సీత పేరు పెట్టలేం.. సెన్సార్ సూచన
Also Read: Mahesh - Aamir Khan: నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, చప్పట్లు కొట్టిస్తుంది...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి