Multiplex: ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో.. కొత్త మల్టీప్లెక్స్ ప్రారంభం
ABN, Publish Date - Feb 04 , 2026 | 11:22 PM
హైదరాబాద్లో ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే మరో కొత్త మల్టీప్లెక్స్ ప్రారంభం అయింది.
హైదరాబాద్లో మరో మల్టీప్లెక్స్ ప్రారంభం అయింది. ఇప్పటికే భాగ్యనగరంలో క్రమక్రమంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మాయమవుతూ వాటి స్థానంలో మల్టీప్లెక్స్ థియేటర్లు వచ్చి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హార్ట్ ఆఫ్ ది సిటీగా చెప్పుకునే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ (RTCX Roads) లో పేరెన్నికగన్న సుదర్శన్ 70mm, ఓడియన్, మయూరి వంటి థియేటర్లు మూతబడి సినీ లవర్స్కు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఆపై క్రమంగా ఆ ప్రాంతం కళ లేక వెలవెల పోయింది.
కాలక్రమంలో మల్టీప్లెక్స్ థియేటర్ల హావా పెరుగుతుండడం, మెట్రో కల్చర్ రెట్టింపు స్థాయిలో వ్యాపిస్తుండంతో ప్రజలంతా వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. సినిమా తారలు మహేశ్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ వంటి స్టార్లు సైతం ఈ బిజినెస్లోకి దిగి సొంతంగా మల్టీప్లెక్స్ స్క్రీనింగ్స్ ఏర్పాటు చేస్తున్నారంటే వీటికి ఇప్పుడు క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో సినిమాలకు గుండెకాయలా చెప్పుకునే ఆర్టీసీ క్రాస్రోడ్స్లో దాదాపు ఒకటిన్నర దశాబ్దం క్రితం మూత పడిన ఓడియన్ సినిమాస్ ఇప్పుడు ఐనాక్స్ ఓడియన్ మాల్గా పునః ప్రారంభమైంది. మొత్తం 8 స్కీన్లతో బుధవారం రాత్రి షోలతో సినిమా ప్రదర్శనలు మొదలు పెట్టారు. దీంతో నగరంలో కొత్తగా మరో మల్టీప్లెక్స్ అందుబాటులోకి వచ్చినట్లైంది.
ఇక ఇదే ఆర్టీసీ క్రాస్రోడ్స్లో పాత సుదర్శన్ 70 ఎంఎం స్థానంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మించిన AMB సినిమాస్ సైతం 7 స్క్రీన్లతో త్వరలోను ఆరంభం కానుంది. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్కు పూర్వ వైభవం వస్తుందని సినీ లవర్స్ అభిప్రాయ పడుతున్నారు.