Venu Udugula: 'రాజు వెడ్స్ రాంబాయి' నిర్మాతల మరో సినిమా!
ABN , Publish Date - Jun 02 , 2026 | 01:13 PM
'రాజు వెడ్స్ రాంబాయి' నిర్మాతల్లో ఒకరైన వేణు ఊడుగుల మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. ఇందులో నటించడానికి ఆసక్తి ఉన్న తెలంగాణ భాష, యాస తెలిసిన వారు తమని సంప్రదించాలని కోరారు.
'నీదీ నాదీ ఒకే కథ, విరాట పర్వం' చిత్రాలను డైరెక్ట్ చేసిన వేణు ఊడుగుల బేసికల్గా రైటర్. ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన 'జై బోలో తెలంగాణ'కు ఆయన రచన చేశారు. అయితే గత యేడాది వేణు ఊడుగుల నిర్మాతగా మారి, తన స్నేహితుడు రాహుల్ మోపిదేవితో కలిసి సాయిలు కంపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, 'రాజు వెడ్స్ రాంబాయి' మూవీని నిర్మించారు. ఈ సినిమా 2025 గద్దర్ అవార్డులలో పలు శాఖలలో అవార్డులను గెలుచుకుంది. దాంతో సాయిలు కంపాటితో సినిమాను రూపొందించానికి పలువురు నిర్మాతలు రెడీ అవుతున్నారు.

ఇదే సమయంలో వేణు ఊడుగుల... సంధ్య భాను చల్లాతో కలిసి మరో సినిమాను నిర్మించబోతున్నాడు. ఈ సినిమాను మధుకర్ రెడ్డి కొమిరెడ్డి డైరెక్ట్ చేయబోతున్నాడు. దీని కథాంశం గురించి తెలియచేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'అన్నదమ్ములు అంటే రామలక్ష్మణుల్లా కలిసి ఉండే రామాయణం రోజులు పోయినమ్. గిప్పుడు రక్తం పంచుకున్నోళ్ళే గొడళ్ళు పట్టుకునే మహాభారతం నడుస్తోంది' అని ఆ పోస్టర్ లో పేర్కొన్నారు. జమ్మికుంట అనే ఊరిలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన పంచాయితీ ఆ ఊరి రాతను ఎలా మార్చింది? ఆ ఇద్దరి గొడవతో ఊరు ఎలా ఓడిపోయింది? ఏ ఇంటిలోనూ జరగకూడదని కథగా ఎలా మిగిలిపోయింది? అనేది ఇందులో చూపించబోతున్నామని, ఈ సినిమాలో నటించడానికి తెలంగాణ యాస, బాస వచ్చిన వాళ్ళు తమను సంప్రదించాలని దర్శక నిర్మాతలు కోరారు. 'రాజు వెడ్స్ రాంబాయి తర్వాత… వాస్తవ సంఘటనలతో మరో అర్థవంతమైన కథతో ప్రేక్షకుల ముందు వస్తున్నామని వేణు ఊడుగుల తెలిపారు.
ఇవి కూడా చదవండి:
కెరీర్లోనే హయ్యస్ట్ రెమ్యునరేషన్.. ఇదీ రష్మిక రేంజ్!
టాలీవుడ్ వర్క్ కల్చర్పై దీపికాకు జాన్వీ కౌంటర్!
Tollywood: విజయ దాహార్తి తీర్చని మే మాసం!