ఆడవారికి ధైర్యాన్నిచ్చే చిత్రం ‘సరస్వతి’.. ఇలాంటి కథలు అరుదుగా వస్తాయి
ABN, Publish Date - Mar 02 , 2026 | 06:27 AM
వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్ర పోషిస్తూ దర్శకత్వం వహించి, నిర్మించిన చిత్రం సరస్వతి. మార్చి 6న థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
‘సరస్వతి (Saraswathi) చిత్రంలోని ప్రతీ పాత్ర చాలా అర్థవంతంగా ఉంటుంది. ప్రకాశ్రాజ్, ప్రియమణి తమ నటనతో ఈ సినిమాకు ప్రాణం పోశారు. ప్రేక్షకులకు మంచి సందేశం ఇస్తూనే ఆద్యంతం అలరిస్తుంది’ అని అన్నారు వరలక్ష్మి శరత్కుమార్ (Varalaxmi Sarath Kumar). ఆమె ప్రధానపాత్రలో నటించి తెరకెక్కించిన చిత్రం ‘సరస్వతి’.
దోశ డైరీస్ బ్యానర్పై వరలక్ష్మి శరత్కుమార్, పూజ శరత్కుమార్ ఈ సినిమాను నిర్మించారు. ఈనెల 6న విడుదలవుతున్న సందర్భంగా ప్రీ-రిలీజ్ వేడుక జరిపారు. ఈ సందర్భంగా వరలక్ష్మీ మాట్లాడుతూ.. 'సొంత మదర్ కాకపోయినా నన్ను అనుక్షణం గైడ్ చేస్తూ నాకు మంచి సపోర్ట్ ఇచ్చిన రాధిక గారి గురించి ఎంత చెప్పినా తక్కువే' అని కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ కార్యక్రమంలో నటుడు శరత్కుమార్ మాట్లాడుతూ ‘సరస్వతి’ లాంటి కథను కచ్చితంగా చెప్పి తీరాలి. స్త్రీలను గౌరవించడం మన కర్తవ్యం. ఈ సినిమా ప్రేక్షకుల ప్రేమను పొందుతుంది’ అని చెప్పారు. ‘ఆడవారికి ధైర్యాన్నిచ్చే చిత్రం ‘సరస్వతి’. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ కథను వరలక్ష్మి తెరకెక్కించినందుకు గర్వంగా ఉంది’ అని రాధికా శరత్కుమార్ తెలిపారు. వరలక్ష్మి సినిమాల్లోకి వెళతా అంటే శరత్ కుమార్ అంగీకరించలేదని ఆ పై మేమంతా బలవంతం చేయడం వల్ల అంగీకరించారన్నారు. ఇక తమిళం కన్నా తెలుగులో చేస్తే ఇంకా బాగా గుర్తింపు వస్తుందని, ఆ ఇండస్ట్రీనే నీకు సరైందని, మంచి పాత్రలు పడతాయని చెప్పానని రాధిక తెలిపారు.