సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఎగ్జిబిటర్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్.. ఆ నలుగురు ఎక్కడ?

ABN, Publish Date - May 14 , 2026 | 07:17 PM

కొందరికి ముద్దు - మరికొందరికి వద్దు - అదే ఇప్పుడు కొందరిని హద్దులు దాటేలా చేస్తోంది. దాని వల్ల ఎంతమందికి లాభమో కానీ, ప్రస్తుతం ఎగ్జిబిటర్స్ మాత్రం దానికే జై కొడుతున్నారు. ఇంతకూ ఏమిటది.!?

Exhibitors Producers

చాలా రోజులుగా 'పర్సంటేజ్ సిస్టమ్ (percentage system) కావాలని పలువురు ఎగ్జిబిటర్స్ (Exhibitors) భావిస్తున్నారు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ (Single screen theatres) వారు 'పర్సంటేజ్' లేకపోతే తమ మనుగడ సాగదనీ తేల్చేశారు. అయితే 'యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్' లోని కొందరు నిర్మాతలు మాత్రం 'పర్సంటేజ్ సిస్టమ్' వల్ల తాము కోట్ల రూపాయలు నష్టపోతామని అంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం కోసం కూర్చుని మాట్లాడుకుందామని నిర్మాతల్లో కొందరు ఆశించారు. అయితే అటు, ఇటు వాదనల మధ్యలో ఉన్నట్టుండి విమర్శలు తలెత్తాయి. ప్రముఖ నిర్మాత నాగవంశీ మాటల్లో నోటెడ్ ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్ ( Suniel Narang) ను టార్గెట్ చేశారని కొందరి భావన. అదే విషయాన్ని నారంగ్ ముందు పెట్టినప్పుడు దానికి ఆయన నాగవంశీపై సెటైర్స్ వేశారు. ఇలా సమస్య పరిష్కారం కోసం దారులు వెదకడం మరచి కాంట్రవర్సియల్ కామెంట్స్ చేసుకోవడం పరిశ్రమలో చర్చనీయాంశమయింది.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత నాగవంశీ (Naga Vamshi) చెప్పక పోయినా, ఆ వందల థియేటర్ల ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్ అని చిత్రసీమలో అందరికీ తెలుసు. అందువల్లే నాగవంశీపై సునీల్ నారంగ్ వ్యంగ్యంగా మాట్లాడారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం ఎగ్జిబిటర్స్ మీడియా మీట్ ఏర్పాటు చేశారు. తామెవరినీ విమర్శించడం లేదని, పర్సంటేజ్ విధానం అమలు చేసి తమను ఆదుకోవాలనే కోరుకుంటున్నామని అన్నారు. 'పెద్ది' ( Peddi) సినిమాను టార్గెట్ చేసి, ఈ వివాదం తీసుకు వచ్చామనడం సబబు కాదని తేల్చి చెప్పారు. ఎప్పటి నుంచో 'పర్సంటేజ్' కోసం పోరాడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మే 15వ తేదీనే సమస్యకు తగిన పరిష్కారం దొరుకుతుందని సి.కళ్యాణ్ ( C. Kalyan) ఆశాభావం వ్యక్తం చేశారు.

సి.కళ్యాణ్ ఒక్కరోజులోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అంటున్నారు. కానీ, 'పర్సంటేజ్ సిస్టమ్'పై ఎన్నో ఏళ్ళుగా ఎగ్జిబిటర్స్ అభ్యర్థిస్తూనే ఉన్నారు. 'పర్సంటేజ్ సిస్టమ్'పై ఇంత రచ్చ సాగుతున్నా, టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్స్ అయిన అల్లు అరవింద్ (All Aravind), డి.సురేశ్ బాబు (Suresh Babu), దిల్ రాజ్ (Dil Raju), సి.అశ్వనీదత్ (Aswani Dutt) వంటివారు బయటకు రాకపోవడంపైనా సినీజనం విచారం వ్యక్తం చేస్తున్నారు. సినిమా రంగంలో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే సమయంలో ఈ నలుగురు బిగ్ ప్రొడ్యూసర్స్ ముందుండేవారు. మరి ఈ సారి వారు ముందుకు రాకుండా తమ సన్నిహితులను అటు, ఇటు పంపించడం ఎంతవరకు సబబు అన్నది ప్రశ్న.

కారణాలు ఏవైనా ఈ సమ్మర్ లో సినిమా సందడి ఏ మాత్రం సాగలేదు. జూన్ 4వ తేదీన రామ్ చరణ్ 'పెద్ది' సినిమా వస్తోంది. ఓ పెద్ద సినిమా వస్తోందంటే థియేటర్స్ కళకళలాడతాయి. కాబట్టి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం దిశగా ఇటు ఎగ్జిబిటర్స్, అటు ప్రొడ్యూసర్స్ సాగాలనే టాలీవుడ్ జనం ఆశిస్తున్నారు. ఈ క్రమంలో మే 15వ తేదీనే ఛాంబర్ లో 'పర్సంటేజ్ సిస్టమ్'పై అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని సి. కళ్యాణ్‌ తెలపడం విశేషం. ఈ మాటలు ఎంతోమంది సినిమా థియేటర్స్ వారికి ఊరటనిస్తున్నాయి. మరి ఎలాంటి పరిష్కారం లభిస్తుందో చూద్దాం.

Updated Date - May 14 , 2026 | 07:44 PM