Tollywood: మాట నిలబెట్టుకోమంటున్న తెలంగాణ ప్రభుత్వం!
ABN, Publish Date - Aug 19 , 2026 | 12:58 PM
నాలుగు ప్రముఖ నిర్మాణ సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం లేఖలు పంపింది. తమ చిత్రాల టిక్కెట్ రేట్ల పెంపు ద్వారా వచ్చిన మొత్తంలో 20 శాతాన్ని వెంటనే ఎఫ్.డి.సి.లో జమ చేయమని కోరింది.
తెలుగు సినిమాల టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల పచ్చ జెండా ఊపింది. అయితే అందుకు ఓ షరతును విధించింది. నిర్మాతలు ఎవరైనా సినిమా టిక్కెట్ రేట్లను పెంచుకోవాలని అనుకుంటే, పెంచిన టిక్కెట్ ఛార్జీలలోని లాభంలో ఇరవై శాతాన్ని సినీ కార్మికుల సంక్షేమానికి వెచ్చించడానికై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో జమ చేయాలని చెప్పింది. అందుకు కొందరు నిర్మాతలు ఆమోదం తెలిపి, తమ చిత్రాల టిక్కెట్ ధరలు పెంచుకోవడానికి సిద్థపడ్డారు.
అలా గత యేడాది డిసెంబర్లో వచ్చిన బాలకృష్ణ 'అఖండ 2' సినిమాతో పాటు ఈ సంక్రాంతికి వచ్చిన చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారూ', ప్రభాస్ 'ది రాజా సాబ్' చిత్రాలు ఉన్నాయి. అలానే ఇటీవల విడుదలైన 'పెద్ది' సినిమా సైతం టిక్కెట్ రేట్లను పెంచుకునే వెసులు బాటును ఉపయోగించుకుంది. కానీ ఈ నలుగురు నిర్మాతలు ఇంతవరకూ టిక్కెట్ రేట్ల పెంపు కారణంగా వచ్చిన లాభంలో ఇరవై శాతాన్ని ఎఫ్.డి.సి.లో నమోదు చేయలేదు. దాంతో తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించాలని కోరుతూ ఈ నాలుగు సినిమాల నిర్మాణ సంస్థలకు లేఖ రాసింది. ఎగ్జిబిటర్స్ నుంచి డబ్బులు వసూలు చేసి, ఎఫ్.డి.సి.లో జమ చేయాల్సిన బాధ్యత సదరు నిర్మాణ సంస్థలదే అని స్పష్టం చేసింది. ఆ రకంగా 14 రీల్స్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, షైన్ స్క్రీన్ ఇండియా, వృద్ధి సినిమాలకు లేఖను పంపింది. మరి వీరు ఎప్పటిలోగా ఆ డబ్బుల్ని జమ చేస్తారో చూడాలి.
ఇవీ చదవండి:
తప్పు ఒప్పుకున్న లోకేష్.. శభాష్ అన్న బన్నీ
చరణ్ సరసన ధురంధర్ బ్యూటీ.. ఇదెక్కడి కాంబోరా మావా
ఎన్టీఆర్- త్రివిక్రమ్ టైటిల్ మారిందిరో..