సౌమ్య మిశ్రా : జైల్లో నేరస్తులకు '23' సినిమా చూపిస్తాం
ABN, Publish Date - Mar 30 , 2026 | 08:48 PM
మల్లేశం, మెట్రో 8am వంటి ఆలోచనాత్మక సినిమాలను రూపందించిన దర్శకుడు రాజ్ రాచకొండ. ఆయన తెరకెక్కించిన మరో చిత్రం '23'.
మల్లేశం, మెట్రో 8am వంటి ఆలోచనాత్మక సినిమాలను రూపందించిన దర్శకుడు రాజ్ రాచకొండ. ఆయన తెరకెక్కించిన మరో చిత్రం '23'. నేరస్థుల పరివర్తన నేరలను తగ్గిస్తుందనే కథంశంతో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతే కాదు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ ఫిలిం అవార్డ్స్లో స్పెషల్ జ్యురీ అవార్డు ను దక్కించుకుంది.
ఈ సందర్భంగా చిత్ర బృందానికి జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆమె హాజరయ్యారు. 'ఈ సినిమా నిర్మాణం అత్యంత బాధ్యత తోనూ, కష్టంతో కూడుకున్నది. ఈ సినిమా నాపై చాలా ప్రభావం చూపించింది. నేరస్థుల పరివర్తన అనే అంశాలు కథలో బాగా పొందుపరిచారు. జైలు జీవితాలను ఇంత వాస్తవికతం గా తెరమీద ఇప్పటి వరకు చూపలేదు. ది షాషాంక్ రిడంప్షన్ వంటి గొప్ప చిత్రాల సరసన నిలబడే చిత్రమిది. ఈ సినిమాను కచ్చితంగా ఖైదీలకు ప్రదర్శించేందుకు ఏర్పాటు చేస్తాం. కొందరిలో మార్పు వచ్చినా అది ఈ సినిమా సాధించిన గొప్ప విజయం' అని చిత్ర బృందాన్ని అభినందించారు.
దర్శకుడు రాజ్ మాట్లాడుతూ 'ఈ సినిమా ప్రయాణం చాలా ప్రత్యేకం. గద్దర్ అవార్డ్స్ జ్యురీ కి థాంక్స్. ఈ చిత్రాన్ని నిర్మించిన ప్రయోజనం నెరవేరాలంటే జైళ్ళలో ఈ సినిమా ప్రదర్శన ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను' అన్నారు.
దర్శకుడు బి. నర్సింగరావు మాట్లాడుతూ '23 వంటి సినిమాలను ప్రభుత్వం ప్రోత్సహించాలి. మాభూమి, దాసి వంటి వాస్తవిక దృక్పథం ఉన్న సినిమాలు తర్వాత ఆ పరంపర కొనసాగలేదు. ఇప్పుడు '23'వంటి సినిమాలు వస్తున్నందుకు ఆనందంగా ఉంది' అన్నారు.