Shalini Kondepudi: నాలో మస్తు షేడ్స్ ఉన్నాయి
ABN, Publish Date - Jun 02 , 2026 | 02:41 PM
‘సింగ్ గీతం’లో ప్రతినాయిక ఛాయలుండే ఓ బలమైన పాత్రను పోషించాను’ అని హీరోయిన్ శాలిని కొండెపూడి అన్నారు.
‘సింగ్ గీతం’లో ప్రతినాయిక ఛాయలుండే ఓ బలమైన పాత్రను పోషించాను’ అని హీరోయిన్ శాలిని కొండెపూడి (Shalini kondepudi) అన్నారు. ‘జయమ్మ పంచాయితీ’, ‘మై డియర్ దొంగ’, ‘శుభం’ సినిమాల ద్వారా ప్రేక్షకులను పలకరించిన ఆమె.. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘సింగ్ గీతం’లో కీలక పాత్రలో నటించారు. అయాన్, అహల్యా బమ్రూ ప్రధాన పాత్రధారులుగా వైజయంతీ మూవీస్ బ్యానర్పై దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించారు. ఈ నెల 11న ఈ సినిమా విడుదలవుతోన్న సందర్భంగా మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు శాలిని. ‘ఈ చిత్రం కథాంశం కుబేర పురం అనే కల్పిత గ్రామంలో జరుగుతుంది. ఇందులోని నటీనటుల మాటలు కూడా పాటల్లా ఉంటాయి. అది ఎందుకు అన్నది సినిమా చూసినప్పుడు మీకు తెలుస్తుంది. ఎక్కడా ఎలాంటి రిఫరెన్స్లు లేని ఒరిజినల్ చిత్రమిది. ఇందులో సింగీతం శ్రీనివాసరావు విజన్, నాగ్ అశ్విన్ల సెన్సిబులిటీస్ ప్రధానాకర్షణగా నిలుస్తాయి. నేను పోషించిన పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. ఇలాంటి కథతో ఇంతవరకూ సినిమా రాలేదు. ఇది ఘనవిజయం సాధిస్తే.. మరిన్ని ప్రయోగాత్మక కథలకు తెరరూపం రావడానికి అవకాశం వస్తుంది. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను. కచ్చితంగా ప్రేక్షకులకు మంచి అనుభూతినిచ్చే చిత్రమిది’ అని చెప్పారు.
డైరెక్షన్ చేస్తా..
ఇంతముందుకు మై డియర్ దొంగ సినిమా నేనే రాశాను. నా నెక్స్ట్ సినిమా నా దర్శకత్వంలో ఉంటుంది. కథ కూడా నేనే రాస్తున్నాను. అందుకే నేనే డైరెక్ట్ చేస్తే బాగుంటుందని అనిపించింది. కామెడీ జానర్లో రూపొందుతోంది. ప్రేక్షకులను నవ్వించే సినిమాలు చేయడం నాకు ఇష్టం.